Search This Blog

Sunday 17 June 2018

Ramayanam - Bala Kanda I



రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ఉత్తర కాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షససంహారం కోసమే రామావతారము వస్తే, రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి, కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు, అదేంటంటే, "దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ ", నేను పదకొండువేల సంవత్సరాలు భూమండలం మీద ఉండి, భూమండలాన్నంతటిని పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు, భగవంతుడు కనుక, రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు, భగవంతుడు కనుక, రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు, భగవంతుడు కనుక, రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు, భగవంతుడు కనుక, ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమి ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగ బతికి చూపించలేదు, ఒక మనిషిలాగ బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు.

అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందొ, అంత కాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లితండ్రుల దెగ్గర, సోదరుల దెగ్గర, గురువుల దెగ్గర, భార్య దెగ్గర ఎలా ఉండాలొ, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలొ రాముడిని చూసి నేర్చుకోవాలి. 

యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్. ||

ఎక్కడన్నా రామాయణం గూర్చి మాట్లాడుతుంటె స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు.

రామ అంటె లోకులందరినీ రమింపచేసే నామం. రావణాసురుడు బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేసి నరవానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరాలని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు, రావణుడే చెప్పాడు, ఇంతమందిని అడిగాను నాకు నరవానరాలు ఒక లెక్క అన్నాడు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటె అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి, ఒక మనిషి తలుచుకుంటె ఏదన్నా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరు రామనామం చెప్పాలి.

కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్ |
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ||

రాముడి యొక్క ఆయనం(నడక) కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. అలాగే ఆయన రామాయణానికి సీతాయాశ్చచరితమ్ మహత్:, పౌలస్త్య వధ అనే పేర్లు కూడా పెట్టుకున్నారు.

             వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలొ సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి - కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. అగ్నిశర్మకి చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీదెగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతె చంపుతాను అన్నాడు. మహర్షులలో ఉన్న అత్రి మహర్షి "నువ్వు దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు" అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు

మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని, ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చె ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబసభ్యులు. చాలా బాధ కలిగి, మళ్ళి ఋషుల దెగ్గరికి వచ్చి, నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తరువాత మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు(వల్మీకం) కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుష నామమయ్యింది. అప్పుడు మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి, పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటె, ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట




  

సంక్షిప్త రామాణము

తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ||

వాల్మీకి మహర్షి రామాయణంలొ రాసిన మొదటి శ్లోకం. దీని అర్ధం ఏంటంటె, తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటె................

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||
చారిత్రేణ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః జాత రోషస్య సంయుగే ||

లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు.

ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే |
మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరమ్ ||
శ్రుత్వా చైతత్ త్రిలోకజ్ఞో వాల్మికేర్నారదో వచః |
శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్ ||
బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః |
మునే వక్ష్యామ్యహం బుధ్వా తైర్యుక్తః శ్రూయతామ్ నరః ||
ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః |
నియతాత్మా మహోవీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ ||
బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రు నిబర్హణః |
విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహా హనుః ||
మహోరస్కో మహేష్వాసో గూఢజత్రుః అరిందమః |
ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః ||
సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ |
సీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ||
ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాంచ హితే రతః |
యశస్వీ జ్ఞానసంపన్నః శుచి ర్వస్యః సమాధిమాన్ ||
ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః |
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా ||
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా |
వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః ||
సర్వ శాస్త్రార్థతత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ |
సర్వలోకప్రియః సాధుః అదీనాత్మా విచక్షణః ||

సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సిందుభిః |
ఆర్యః సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః ||
స చ సర్వ గుణోపేతః కౌసల్యానందవర్ధనః |
సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేన హిమవానివ ||
విష్ణూనా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః |
కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథివీ సమః ||
ధనదేన సమస్త్యాగ్రే సత్యే ధర్మ ఇవాపరః ||
తమేవం గుణసంపన్నం రామం సత్య పరాక్రమం |
జ్యేష్ఠః శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథస్సుతమ్ ||
ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా |
యౌవరాజ్యేన సంయోక్తుం ఇచ్చత్ ప్రీత్యా మహీపతిః ||
తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యా అధ కైకేయీ |
పూర్వం దత్తవరా దేవీ వరం ఏనమ్ అయాచత |
వివాసనంచ రామస్య భరతస్యాభిషేచనమ్ ||
స సత్యవచానాద్రాజా ధర్మ పాశేన సంయుతః |
వివాసయామాస సుతం రామం దశరథః ప్రియమ్ ||
స జగామ వనం వీరః ప్రతిజ్ఞాం అనుపాలయన్ |
పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్ ||
తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణోనుజగామ హ|
స్నేహాద్వియసంపన్నః సుమిత్రానందవర్ధనః ||
భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్ర మనుదర్శయన్ |||
రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణ సమాహితా |
జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా ||
సర్వ లక్షణ సంపన్నా నారీణాం ఉత్తమావధుః |
సీతా అపి అనుగతా రామం శశినం రోహిణీ యథా ||
పౌరై రనుగతో దూరం పిత్రా దశరథేన చ ||
శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ |
గుహామాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియమ్||
గుహేన సహితో రామో లక్ష్మనేన చ సీతయా |
తే వనేన వనం గత్వా నదీ స్తీర్త్వా బహూదకాః ||

చిత్రకూట మనుప్రాప్య భరధ్వాజస్య శాసనాత్ |
రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయః ||
దేవ గంధర్వ సంకాశాః తత్ర తే న్యవసన్ సుఖమ్ |||
చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తదా |
రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతమ్ ||

మృతేతు తస్మిన్ భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజైః |
నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః ||

స జగామ వనం వీరో రామపాద ప్రసాదకః |
గత్వా తు సుమహాత్మానం రామం సత్య పరాక్రమమ్ |
అయాచత్ భ్రాత్రం రామం ఆర్య భావ పురస్కృతః ||
త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచో అబ్రవీత్ |||
రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః |
న చైఛ్చత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః ||
పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః |
నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః ||
స కామం ఆనవాప్యైవ రామపాదవుపస్పృశన్ |
నందిగ్రామే కరోత్ రాజ్యం రామాగమన కాంక్షయా ||

గతేతు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః |
రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ |
తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశ హ ||
ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవ లోచనః |
విరాథం రాక్షసం హత్వా శరభంగం దదర్స హ ||
సు తీక్ష్ణం చాప్యగస్త్యంచ ఆగస్త్య భ్రాతరమ్ తథా |||
అగస్త్యవచనాచ్చైవ జగ్రాహ ఐంద్రం శరాసనమ్ |
ఖడ్గం చ పరమ ప్రీతః తూణీచాక్షయసాయకౌ ||
వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ |
ఋషయో అభ్యాగమన్ సర్వే వధాయ సు రరక్షసామ్ ||
స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే |
ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసాం |
ఋషిణామగ్నికల్పానాం దండకారణ్య వాసినామ్ ||
తేన తత్రైవ వసతా జనస్థాన నివాసినీ |
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ ||
తతః శూర్పణఖావాక్యాదుద్యుక్తాన్ సర్వ రాక్షసాన్ |
ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసమ్ ||
నిజఘాన రణే రామః తేషాం చైవ పదానుగాన్ |||
వనే తస్మిన్ నివసతా జనస్థాననివాసినామ్ |
రక్షసామ్ నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ ||
తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్చితః |
సహాయం వరయామాస మారీచం నామ రాక్షసమ్ ||
వార్యమాణస్సుబహుశో మారీచేన స రావణః |
న విరొథో బలవతా క్షమో రావణ తేన తే ||
అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః |
జగామ సహ మారీచః తస్య ఆశ్రమపదం తదా ||
తేన మాయావినా దూరం అపవాహ్య నృపాత్మజౌ |
జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషమ్ ||
గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీమ్ |
రాఘవః శోక సంతప్తో విలలాపాకులేంద్రియః ||
తత స్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషమ్ |
మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ |
కబంధం నామ రూపేణ వికృతం ఘోర దర్శనమ్ ||
తం నిహత్య మహాబాహుః దదాహ స్వర్గతశ్చ సః |||
స చాస్య కథయామాస శబరీం ధర్మ చారిణీమ్ |
శ్రమణీం ధర్మనిపుణాం అభిగచ్ఛేతి రాఘవ ||
సోభ్యగచ్ఛన్మహాతేజాః శబరీమ్ శత్రుసూదనః |
శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః ||
పంపాతీరే హనుమతా సంగతో వానరేణ హ |
హనుమాద్వచనాచ్చైవ సుగ్రివేణ సమాగతః ||
సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః |
ఆదితస్తద్ యథావృత్తం సీతాశ్చ విశేషతః ||
సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః |
చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్ని సాక్షికమ్ ||
తతో వానర రాజేన వైరామ కథనం ప్రతి |
రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ ||
ప్రతిజ్ఞాతం చ రామేణ తథా వాలి వథం ప్రతి|
వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః ||
సుగ్రీవ శ్శంకితశ్చాసీ న్నిత్యం వీర్యేణ రాఘవే |
రాఘవప్రత్యయార్ధం తు దుందుభేః కాయ ముత్తమమ్ |
దర్శయామస సుగ్రీవో మహాపర్వత సన్నిభమ్ ||
ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః |
పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశ యోజనమ్ ||
బిభేద చ పునస్తాలాన్ సప్తైకేన మహేషుణా |
గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా ||
తతః ప్రీతిమనాస్తేన విశ్వస్తః స మహాకపిః |
కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తథా ||
తతో గర్జత్ హరివరం సుగ్రీవో హేమ పింగళః |
తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః ||
అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః |
నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవః ||
తతః సుగ్రీవ వచనాత్ హత్వా వాలినమాహవే |
సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్య పాదయత్ ||
స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః |
దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్ జనకాత్మజామ్||
తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్హనుమాన్ బలీ |
శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవమ్ ||

తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితామ్ |
దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతామ్ ||
నివేదయిత్వా అభిజ్ఞానం ప్రవృతిం చ నివేద్య చ |
సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణమ్ ||
పంచ సేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రి సుతానపి |
శూరమక్షం చ నిష్పిప్య గ్రహణం సముపాగమత్ ||

అస్త్రేణోన్ముక్తం ఆత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ |
మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్తాన్ యదృచ్చయా ||
తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీమ్ |
రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్మహాకపిః ||
సో భిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణంమ్ |
న్యవేదయదమేయాత్మా దృష్ఠా సీతేతి తత్వతః ||
తతః సుగ్రీవసహితో గత్వా తీరం మహదధేః |
సముద్రం క్షోభయామాస శరైరాదిత్యసన్నిభైః ||
దర్శయామాస చ ఆత్మానం సముద్రః సరితాం పతిః |
సముద్రవచనాచ్ఛైవ నళం సేతుమకారయత్ ||
తేన గత్వా పురీం లంకాం హత్వా రావణ మాహవే |
రామస్సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ ||
తామువాచ తతో రామః పరుషం జనసంసది |
అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ ||
తతో అగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగత కల్మషామ్ |
బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వ దైవతైః ||
కర్మణా తేన మహతా త్రైలోక్యం స చరాచరమ్ |
స దేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః ||
అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రమ్ విభీషణమ్ |
కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోద హ ||
దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ |
అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః ||
భరద్వాజాశ్రమం గత్వా రామః సత్య పరాక్రమః |
భరతస్యాంతికం రామో హనూమంతం వ్యసర్జయత్ ||
పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవసహితశ్చ సః |
పుష్పకం తత్ సమారుహ్య నందిగ్రామం యయౌ తథా ||
నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో అనఘః |
రామః సీతా మనుప్రాప్య రాజ్యం పునరవాస్తవాన్ ||
ప్రహృష్టోముదితో లోకః తుష్టః పుష్టః సుధార్మికః |
నిరామయో హ్యరోగిశ్చ దుర్భిక్షభయవర్జితః ||
న పుత్రమరణం కించిత్ ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ |
నార్యశ్చా అవిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||
న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః |
న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా ||
న చాపి క్షుద్భయం తత్ర న తస్కర భయమ్ తథా |||
నగరాణీ చ రాష్ట్రాణి ధన ధాన్య యుతానిచ |
నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా ||
అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః |
గవాం కోట్యయుతం దత్వా విద్వభ్యో విధిపుర్వకమ్ |
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||
రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |
చాతుర్వర్ణ్యం చ లోకే అస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||
దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ |
రామోరాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి ||
ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||
ఏతదాఖ్యానసమాయుష్యం పఠన్ రామాయణం నరః |
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||
పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్
స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ |
వణిగ్జనః పణ్యఫలత్వమీయాత్
జనశ్చ శూద్రో అపి మహత్వమీయాత్ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే  వాల్మీకియే ఆది కావ్యే బాల కాండే  ప్రధమసర్గః సమాప్తము ||

నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలొ ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు........
ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు

చెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. రోజు మధ్యాన సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది...........




మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||

దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలొ ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు

ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు " బ్రాహ్మణుడా! నీ నోటివెంట వచ్చిన శ్లోకమే రామాయణ కథ." అన్నారు. శ్లోకానికి అర్ధం చూడండి......

"
నిషాద" అంటె బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. "మా" అంటె లక్ష్మి దేవి. "మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః", అంటె లక్ష్మిని తనదిగా కలిగిన శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. " యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్", కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన రామ, నీకు మంగళం జెరుగుగాక, అని శ్లోక అర్ధం మారింది

బ్రహ్మగారు అన్నారు, "నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను " నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు



వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగ ఆయనకి బ్రహ్మ గారి వరం వల్ల జెరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంబించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంబించారుతరవాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశలతో పాడించారు. వాళ్ళు తరవాత ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో పాడడం మొదలుపెట్టారు........




కథ ప్రారంభం


రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు.............

    
బాలకాండ

పూర్వకాలంలొ కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. నగరం 12 యోజనముల పొడువు, 3 యోజనముల వెడల్పు ఉండేది( యోజనం అంటె = 9 మైళ్ళు ). నగరం మధ్యలొ రాజ ప్రాసాదంలొ దశరథ మహారాజు నివాసముండేవారు. నగరంలొ రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతొ ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి రాజ్యంలొ. ఇంట్లోనుకుడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలొ అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితొ వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతొ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలొ పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు అయోధ్య నగరంలొ లేడు. 

దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చె ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. కోసల దేశంలొ పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు. 

ఇన్ని ఉన్నా దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్దారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలొ యాగమంటపం నిర్మించారు. 

దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతొ సుమంత్రుడు ఇలా అన్నాడు...........

సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం | 
ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||

పూర్వకాలంలొ ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు............ఇక్ష్వాకువంశములొ జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతొ పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతొ అన్నాడు. రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలొ ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి అన్నాడు.

అప్పుడు దశరథ మహారాజు, నాకు రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటె, సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు.............పూర్వకాలంలొ విభణ్డక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చెయ్యడానికి ఒక సరస్సు దెగ్గరికి వెళ్ళగా, అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చేసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలొ పడింది. వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటె విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల రాజ్యంలొ వర్షాలు పడడం మానేశాయి. దేశంలొ క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలొ అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు. 

వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, రుష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు..... ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి |. రుష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణ్డకుడు లేని సమయంలో వీళ్ళు రుష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు, అని మంత్రులు సలహా ఇచ్చారు. 


వేశ్యలకి విభణ్డకుడి మీద ఉన్న భయం వలన, వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. ఒకరోజు విభణ్డకుడు లేని సమయంలో గానం విన్న రుష్యశృంగుడు, గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న వేశ్యలని చూసి, వాళ్ళు పురుషులే అనుకొని, మహాపురుషులార! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభణ్డకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత వేశ్యలు ఆశ్రమంనుంచి వెళ్ళిపోతూ రుష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు. మరునాడు రుష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దెగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే..........

తత్ర ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని |
వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ||

ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జెరిపించారు. 

కాబట్టి దశరథ మహారాజు రుష్యశృంగుడిని పిలవడానికి, అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక, వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితొ ఇలా అన్నాడు...మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా, అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి, వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.

No comments:

Post a Comment