Search This Blog

Saturday 30 December 2017

Tiruppavai - తిరుప్పావై 15వ రోజు పాశురము





తిరుప్పావై 15వ రోజు పాశురము

ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్

మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవసహజం, కాని దాన్ని ఓరిమితో సహించడం మానవప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే, అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిదానానికి చేరే ముందర కల్గాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి . ఈ రోజు ఆండాళ్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది.

ఈరోజు పాశురం బయట గోపబాలికలకు లోపల గోపబాలిక మద్య సంభాషణలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కల్శి వీరంతా స్వామిని పంఖజ నేత్రా, పుండరీకాక్షా అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమోనని అనుకొని తాను లోపలనుండే గొంతు కలిపి ఆనందిస్తుంది.

అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలుకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో, "ఎల్లే!" ఏమే "ఇళంకిళియే!" లేత చిలకా! "ఇన్నం ఉఱంగుదియో" ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా. వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు.

కాని లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని, శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి "శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్" ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమి లేడు"నంగైమీర్!" పరిపూర్ణులు మీరే. "పోదరుగిన్ఱేన్" వస్తున్నాను అని అంది.

బయట నుండి వాళ్ళు "వల్లై" మహా సమర్దురాలివే "ఉన్ కట్టురైగళ్" నీ నోటి దురుసుతనం మాకు తెలుసులే, "పండేయున్ వాయఱిదుమ్" ఎప్పటినుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు. అంతలో లోపల గోప బాలిక"వల్లీర్గళ్ నీంగళే" మీరే సమర్థులు, నన్నా సమర్థురాలు అని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుచే భాదలో ఉన్నాను, మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు, "నానే తాన్ ఆయిడుగ" రాకపోవడం నాదే తప్పు అని ఓరిమితో అంది.

కాని బయట నుండి,"ఒల్లై నీ పోదాయ్" ఏమే రా! మరి ఇంక, "ఉనక్కెన్న వేఱుడైయై" మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవమా మరొకసారి ఎత్తిపొడిచారు లోపల గోపబాలికను పరిక్షించటానికి. ఆమె లోపలనుండి"ఎల్లారుం పోందారో" అంతా వచ్చారా అంది, బయటనుండి వీల్లు "పోందార్" అందరూ వచ్చారు, నీవు బయటికి రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు.

"పోంద్-ఎణ్ణిక్కోళ్" ఏం చేద్దాం అందరం అని ఆడిగింది లోపల గోప బాలిక. "వల్లానై కొన్ఱానై" బలం కల్గిన ఏనుగు - కువలయాపీడం "మాత్తారై మాత్తరిక్కవల్లానై" దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగల్గినవాడు "మాయనై" చిత్ర విచిత్రమైన మాయలు చేసే మాయావిని "ప్పాడ" పాడుదాం.

ఆండాళ్ తల్లి అయిదోపాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో, పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మళ్ళీ మథురానగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేసాడు. మథురానగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేవరకు ఉంది ఆయన మాయ. పుట్టగానే రాత్రికి రాత్రికే యమునానది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు, అక్కడికి పంపిన పూతన, శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడివారిని పిచ్చెక్కించి, అక్కడినుండి తిరిగి మథురకు వచ్చి కువలయాపీడాన్ని, చారూణముష్టికులను చంపి, కంసున్ని చంపి, బందీగా ఉన్న ఉగ్రసేనున్ని రాజుగా చేసి మథురానగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు. ఇది భగవంతుడు చేసే చేష్ట.

ఈరోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్. అలాంటి యోగ్యత కల్గిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగ గలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప, లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు, ఇక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలు.

Friday 29 December 2017

Tiruppavai - తిరుప్పావై 14వ రోజు పాశురము



తిరుప్పావై 14వ రోజు పాశురము
ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్

మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వార వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు. ఈమూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అందుకే మనం వేద మార్గాన్ని విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపలగోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా, అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేపడం ప్రారంభించింది.

"శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్" ఎర్ర కలవలు వికసిస్తున్నాయి "ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్" నల్ల కలువలు ముకిళించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యోదయంతో నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోప బాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకొనేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టిచ్చుకోలేదు. లేదమ్మా అయితే, "ఉంగళ్ పురైక్కడై" నీ ఇంటి పెరటి "త్తోట్టత్తు వావియుళ్" తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి కావలిస్తే చూసుకో. అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు. ఇక్కడ "నీ" అని సంభోదించినా లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది, నీ అన్నా లోపల పరమాత్మ వరకు భావించి, పెద్దగా పట్టిచ్చుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగముగా ప్రయోగించారు, ఏమిటంటే లోపల తోటలో గోప బాలిక శ్రీకృష్ణుడికోసం ఎదురుచూస్తుంటే వెనకనుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని, శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు, గోప బాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు. పెద్దగా పట్టిచ్చుకోలేదు లోపల గోపబాలిక.

"శెంగల్పొడి క్కూరై" కాషాయాంభరధారులు "వెణ్బల్ తవత్తవర్" తెల్లటి పలువరుసలు కల్గిన యోగులు "తంగళ్ తిరుక్కోయిల్ " ఆరాధనకై తమ తమ పెరుమాళ్ళ ఆలయాలకి "శంగిడువాన్" తాళాలు తెరువడానికి "పోగిన్ఱార్" వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు. తాళం తీయడం జ్ఞానముద్రలా ఉంటుంది, అందుకే ఇక్కడ ఆండాళ్ తల్లి, లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి, తమకూ జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది.

అలాగే మేం ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం, అంటూ "ఎంగళై" మమ్మల్నందరిని "మున్నం ఎరుప్పువాన్" ముందే లేపుతాను అని "వాయ్ పేశుమ్" వాగ్దానం చేసావు. "నంగాయ్!" పెద్ద పరిపూర్ణురాలివే! "ఎరుందిరాయ్" లేవమ్మా "నాణాదాయ్!" నీకు సిగ్గు అనిపించటంలేదా "నావుడైయాయ్" పెద్ద మాటకారిదానివి.

జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండేస్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విధ్య అంటారు వేదాల్లో. లోపల గోపబాలిక దహరవిధ్యలో పరినిష్నాత అయి ఉండచ్చేమో "శంగోడు చక్కరం ఏందుం తడక్కైయన్ పంగయ క్కణ్ణానై ప్పాడ" ఆమె హృదయం, దానిలో దహరాకాశం, అందులో స్వామి, ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం, నీవు ఆ యోగ్యత కల్గిన దానివి, నీవూ లేచి మాతో కలిస్తే అందరం కల్సి స్వామిని పాడుదాం అంటూ లోపల గోప బాలికను లేపారు.

Thursday 28 December 2017

Tiruppavai - తిరుప్పావై 13వ రోజు పాశురము



తిరుప్పావై 13వ రోజు పాశురము

పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్

ఒక్కొక్క గోపబాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కల్గిస్తుంది ఆండాళ్. అందరిని చిలిపి తనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణున్నా పాడటం అంటూ నిన్న గోకులంలో రామనామం పాడారు, దానితో గోకులం అంతా కలకలం మొదలైంది. కొంతమంది రాముడే సరి అని మరి కొందరు లేదు కృష్ణుడే సరి అని రెండు జట్టులుగా విడిపోయారు.

వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి, వారి మధ్య నిలిచి వాళ్ళకొక విషయం చెప్పింది. నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళ్ళితే అక్కడ ఆమె శ్రీకృష్ణున్ని కథ చెబుతూ పడుకోబెడుతుంది. అనగనగా రాముడు, భార్య సీత వాళ్లు అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు... అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి "సౌమిత్రే ధనుః" అని అరిచాడు. ఆ తల్లికేమి అర్థం కాక కంగారు పడిపోయింది. మరి కృష్ణుడెందుకు లక్ష్మణున్ని ధనస్సు తెమ్మని పిలిచాడు, ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి. అప్పుడుండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు ఇప్పుడుండే అవసరాలకోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు, ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోప బాలికలకు సర్ది చెప్పింది. ఇక కలిసి కట్టుగా మరొక గోప బాలికను లేపడం ప్రారంభించారు.

కృష్ణుడి జట్టు వారు "పుళ్ళిన్ వాయ్ కీండానై" ఒకనాడు కొంగ వేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారవేసాడు కృష్ణుడు అన్నారు. అంతలో రాముని జట్టువారు "ప్పొల్లా అరక్కనై" రావణాసురుడిని గిల్లి పారవేసాడు రాముడు అని అన్నారు. "కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్" ఇలా స్వామి కళ్యాణగుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు.

"పిళ్ళైగళ్ ఎల్లారుమ్" గోపబాలికలందరూ "పావైక్కళం పుక్కార్" వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోప బాలికతో అన్నది. లోపల గోప బాలిక వాళ్ళంతా చిన్న పిల్లలు కదా తొందర పడుతున్నారు ఇంకా తెల్లవారలేదు అన్నట్లుంది, వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుర్తులు చెప్పుతున్నారు. "వెళ్ళి యెరుందు" శుక్రోదయం అయ్యింది, "వియారమ్" బృహస్పతి "ఉఱంగిత్తు" అస్తమిస్తోంది అని గుర్తులు చెప్పారు. మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేక పోయామంటే మనలో ఉండే వ్యతిరిక్త భావనలే అవరోధంగా ఉన్నాయి, ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి, అందుకని భగవంతుణ్ణి చేరటానికి ఇది సరియైన సమయం.

"పుళ్ళుం శిలమ్బిన కాణ్" పక్షులు మాటలాడుకుంటున్నాయి "పోదరి క్కణ్ణినాయ్" తుమ్మెద వాలిన పుష్పంవంటి కళ్ళు కలదానా. తనను గుర్తించిన వాన్ని భగవంతుడు శిరస్సున ధరిస్తాడు అందుకే లోపల ఉండే గోప బాలిక తను వెళ్ళడం ఎంటీ కృష్ణుడే తన దగ్గరకు రానీ అంటూ పెద్దగా పట్టించు కోవడం లేదు. "కుళ్ళ కుళిర" చల చల్లటి ఆనీటిలో "క్కుడైందు" నిండా మునిగి "నీరాడాదే" అవగాహన స్నానం మనం చేయ్యాలి కదా , లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు, ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది. "పళ్ళి క్కిడత్తియో" ఇంకా పడుకుని ఉన్నావా "పావాయ్!" ముగ్దత కల్గిన దానా, " నీ నన్నాళాల్" సమయం అయిపోతుంది, "కళ్ళం తవిరుందు కలంద్" మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు మాతో కలువు అంటూ అందరూ ఆ గోపబాలికను లేపి తమలో చేర్చుకున్నారు.

Tiruppavai - తిరుప్పావై 12వ రోజు పాశురము




తిరుప్పావై 12వ రోజు పాశురము

కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్

భగవద్గీత రెండో ఆధ్యాయంలో మనకు భగవంతునికి మద్యవర్తిగా ఉండే దివ్యజ్ఞానం కల మహనీయుడు ఎట్లా ఉంటాడో, అతని జ్ఞాన దశని నాలుగు స్థితులుగా వర్ణించబడి ఉంది. ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగవ స్థితికి చేరిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెబుతుంది. ఒక పరిపక్వమైన దశను చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది అంటే, వాడి చుట్టూ ఎన్నోరకాల వస్తువులూ, ఆకర్షణలు ఉంటాయి, కానీ అవి ఏవీ కూడా వాడిలోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు.

"ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట: స్తిత ప్రజ్ఞ: తదోచ్యతే |
ప్రజా:తి యదా కామాన్ సర్వాన్ మనో గతాన్ || "

వాడికి ఎలాంటి కోరికలు ఉండవు, మనస్సులో కూడా. ఆన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు, కాని నాకు ఆనందాన్ని కల్గించేవి అని ఎప్పుడూ అనుకోడు. మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే దానికి క్రింద ఉండే స్థితిని వివరించాడు.

"దుఃఖేషు అనుద్విజ్ఞమనాః సుఖేఃషు విగతస్పృహ:
వీత రాగ భయ క్రోద: స్తితదీ: ముణిరుచ్యతే"

ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసు కాని మనస్సు వాటియందు ఉంచకుండా సాధన చేస్తాడు. ఇది రెండో స్థితి. కొంత కాలం ఇలా సాధన చేసినట్లయితే మనస్సు స్థిరం అవుతుంది. లోపలుండే పరమాత్మ విషయకమే ఆనందం. ఇవాలటి గోప బాలిక అలాంటి స్థితి కల్గిన వంశానికి చెందినది అంటుంది ఆండాళ్.

"ఇళంకత్తెరుమై" లేత దూడలు కల్గిన గేదెల "కనైత్త్" అరుపు వినిపిస్తోంది. ఎందుకంటే వాటిని పట్టించుకోనే నాథుడే లేడు. వాళ్ళంతా శ్రీకృష్ణ సేవలో నిమగ్నమై ఉన్నారు. "కన్ఱుక్కిరంగి" దూడ విషయంలో జాలి తలచి తనంతట తానే "నినైత్తు" దూడ వచ్చిందని భావించి, "ములై వరియే" పొదుగుల గుండ "నిన్ఱు పాల్ శోర" ఏక ధారలుగా పాలు ఇస్తున్నాయి. "ననైత్త్-ఇల్లమ్" ఇల్లంతా తడిసి పోయి , "శేఱాక్కుమ్" అంతా బురద అయ్యింది.

ఈ గోప బాలిక సోదరుడికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ, అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడి వెంటే ఉండేవాడు. లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి లక్ష్మణుడి కర్మ, రెండోది భరతుని కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు, తను రాముని సేవలో మరచి నిత్య కర్మలను పెద్దగా చేసేవాడు కాదు. అదే భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామమంలో ఉంటూనే రాజ్య పాలన చేసాడు, నిత్య కర్మలను పాటించేవాడు. ఇక్కడ మనం గమనించాల్సింది భరతుడు నిత్య కర్మానుష్టానం చేసింది రామునికోసమే, లక్ష్మణుడు నిత్య కర్మలను మానింది రాముడి కోసమే. నిన్నటి గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే, ఈ రోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు వదిలినా అవీ శ్రీకృష్ణుడి కోసమే.

"నచ్చెల్వన్ తంగాయ్" ఏం సంపదలు కల్గిన వాడి చెల్లెలా!. ఆండాళ్ లోపలున్న గోప బాలికను గొప్ప జ్ఞానిగా భావిస్తోంది, జ్ఞానులైన మహనీయులు వారు తామంతట తాము భగవత్ జ్ఞానాన్ని అనుభవిస్తూ మనపై జాలితో మనకు ఉపదేశిస్తూ ఉంటే మన దేహం తడిసి, లోపల మనలోని హృదయం ద్రవించేట్టుచేసి మనం కూడా భగవంతుణ్ణి అనుభవించేట్టు చేస్తుంది. "పనిత్తలై వీర" మంచుతో పైన తడుస్తున్నాం, ఏం స్థితి వచ్చిందమ్మా మాకు!! మూడు ప్రవాహాలుగా మేం కొట్టుకుపోతున్నాం. క్రిందేమో పాల ప్రవాహం, పైనేమో మంచు, మరి మధ్యలో మాహృదయాలలో శ్రీకృష్ణుడి కళ్యాణగుణాల ప్రవాహంతో తడిసిపోతున్నాం. ఎక్కడ ఆధారం లేకుండా పోతుంది, మరి "నిన్ వాశల్ కడై పత్తి" అమ్మా నీ గుమ్మపు పైకప్పుని పట్టుకొని వ్రేలాడుతున్నాం .

అయితే లోపలున్న గోపబాలికకు కృష్ణుడు ఆడపిల్లలను ఏడిపిస్తాడని కోపం ఉన్నట్లుంది, అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు "శినత్తినాల్" కోపంతో "తెన్ ఇలంగై క్కోమానై" అందమైన లంకానగరానికి రాజైన రావణాసురుణ్ణి "చ్చెత్తమ్" సంహరించి, "మనత్తుక్కినియానై" అందరి హృదయాలు దోచుకున్న మనోభిరాముని నామం "ప్పాడవుమ్" పాడుతున్నా "నీ వాయ్ తిఱవాయ్" నీవు నోరు తెరవవా! "ఇనిత్తాన్ ఎరుందిరాయ్" ఇకనైనా నోరు తెరిచి లేవమ్మా. "ఈదెన్న పేర్ ఉఱక్కమ్" ఇది ఎలాంటి నిద్రమ్మా, "అనైత్తిల్లత్తారుం అఱింద్" లోకమంతా తెలిసి పోయింది లేవమ్మా నీ గొప్పతనం అంటూ ఆక్షేపిస్తూ గోప బాలికను లేపింది ఆండాళ్ తల్లి.

Tiruppavai - తిరుప్పావై 11వ రోజు పాశురము




తిరుప్పావై 11వ రోజు పాశురము

కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్

గోపికలు "యుగాయితం నిమేషేన చక్షుసా ప్రాప్యుడాయితం శూణ్యాయతా జగత్ సర్వం గోవింద విరహేణమే" అని భావిస్తారు. ఒక కంటి రెప్పపాటు గోవిందుని ఎడబాటును సహించేవారు కాదట. పరమ భక్తుల స్థితి అలా ఉంటుంది. భక్తులెప్పుడు తమనొక నాయికగా భగవంతున్ని ఒక నాయకుడిగా భావిస్తారు. భగవంతుని పై వారికుండే భక్తి, జ్ఞానం వారి సౌందర్యం. ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్లే, భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలు చూస్తాడు. వారు ఏది చేసినా, చూసినా, విన్నా లౌకికమైన వాటియందు శ్రద్దలేకుండా వాటి వెనకాతల కారణభూతుడైన భగవంతున్ని భావిస్తూ, అన్ని పనులూ భగవత్ సంబంధంగానే చేస్తారు . ఇలాంటి సౌందర్యానికే భగవంతుడు వశమై ఉంటాడు.

ఇవాలటి గోపబాలికది దివ్యమైన సౌందర్యం కలది. పురుషులను ఆకర్షించేది దేహ సౌందర్యం అయితే, పురుషోత్తముణ్ణి ఆకర్షించేది భక్తి సౌందర్యం. ఈవాల్టి గోప బాలిక అలాంటి సౌందర్యం కలది. గొప్ప వంశానికి చెందినది. చాలా పాడి సంపద కల వంశంలో పుట్టినది ఈ గోపబాలిక. భగవత్ సేవా సంపద గొప్పగా కల్గినది కాబట్టి, ఈవిడని తీసుకొని వెళ్తే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అని మన ఆండాళ్ తల్లి ఈవాలటి గోపబాలికను లేపుతుంది.

"కత్తుకఱవై" దూడలకు పాలిచ్చే, దూడలవలె ఉండే, తక్కువ వయసుగా కనపడే "క్కణఙ్గళ్" గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల "పలకఱందు" పాలు పితకటంలో నేర్పరులు, "శెత్తార్ తిఱల్ అరియ" శత్రువుల బలం నశించేట్టుగా "చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం" వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ మదమును అణచగలిగేవారు, "కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం" ఏపాపమూ అంటని వారు, ఎందుకంటే వీరు ఏమి చేసినా శ్రీకృష్ణుడి కోసమే కదా చేసేది. శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు. అలాంటి వంశానికి చెందిన "పొఱ్కొడియే" బంగారు తీగ, తీగ ఎదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని ప్రాకుతుంది, ఈ గోపిక శ్రీకృష్ణుడినే ఆధారంగా చేసుకొని ప్రాకే బంగారు తీగ.

శరీరంలో ఏదో ఒక అవయవం అందంగా ఉంటే అది సౌందర్యం అంటారు. అదే సామూహికంగా పాదాది కేశాన్తంగా ఉండిన సౌందర్యాన్ని లావణ్యం అంటారు. మరి ఆమె లావణ్యాన్ని ఆండాళ్ తల్లి ఇలా వర్ణిస్తోంది. "పుత్తరవల్ గుల్" తన పుట్టలో ఎలాంటి భయం లేకుండా చుట్టుకొని పడగ లేపి ఉన్న ఒక పాములాంటి అందం కల్గి ఉండి, "పునమయిలే" ఏభయంలేని తన వనంలో పురివిప్పిన నెమలిలాంటి కేశ సౌందర్యం కలదానా. "పోదరాయ్" రావమ్మా!! నీవెంట మేము నడుస్తాం."శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు" ఈ చుట్టూ ఉండే చెలికత్తెలు అందరూ వచ్చి, "నిన్-ముత్తం పుగుందు" నీ ముంగిట ప్రవేశించి, "ముగిల్ వణ్ణన్ పేర్-పాడ" నీలమేఘశ్యాముని పేరు పాడుతున్నాం. నిన్ను నెమలితో పోల్చాం, నెమలి మేఘాన్ని చూసి ఎలా పరుగెత్తుతూ వస్తుందో, నీలి మేఘశ్యామున్ని మేం కీర్తిస్తుంటే నీవూ వస్తావని అనుకున్నాం. కానీ, "శిత్తాదే" ఉలుకు లేదు "పేశాదే" పలుకు లేదు "శెల్వప్పెణ్డాట్టి" ఓ సంపన్నురాలా! ఎమమ్మా ఐశ్వర్య మదమా "నీ ఎత్తుక్కుఱగుం పొరుళ్" లేకుంటే ఎందుకు పడుకున్నావు అంటూ లోపలి గోపబాలిక వంశాన్ని, సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను లేపుతుంది ఆండాళ్ తల్లి.

Tiruppavai - తిరుప్పావై 10వ రోజు పాశురము




తిరుప్పావై 10వ రోజు పాశురము


నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్ ||

ఆండాళ్ తల్లియొక్క సంకల్పం, అందరూ కలవాలి, వైయత్తు వళ్ వీర్గాళ్ ఈ భూమిమీద ఉన్నవాళ్ళంతా ఒకటి. ఇది మన ఆండాళ్ తల్లి హృదయ వైశాల్యం. ఏ ఒక్కరూ కూడా మంచిని వదులుకోవద్దూ అనేది అమ్మ ఔదార్యం. ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకొని ముందుకు సాగుతుంది. అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరుతుంది. శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికకరాలకోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపబాలికను లేపుతూ ఈరోజు ఐదవ గోపబాలికను గోష్టిలో చేరుస్తుంది. పైపైకి గోపికలు కృష్ణుడి కథగా మనకు చెపుతున్నా మనుష్యులుగా మనలోని జ్ఞాన వికాసం ఎట్లా ఉండాలి అనేది చెప్పటం అమ్మ యొక్క లక్ష్యం.

మానవ జీవితం అనగా సుఖ దుఃఖాలు నదీ తరంగాలుగా ఒక దానివెంట ఒకటి వస్తూనేవుంటాయి. సుఖమైనా దుఖఃమైనా ఎప్పటికి నిలిచి ఉండవు. అవి ఎలా మారినా నీవు మాత్రం మారకుండా ఉండాలి. సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు మనలో జరిగే ప్రక్రియను ఎట్లా క్రమబద్దం చేసుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మన మానసిక ఏకాగ్రత చెడకుండా ఎట్లా చేసుకోవాలో చెప్పాడు. మానసిక ఏకాగ్రత ఎట్లా చెడుతుంది, అయితే దుఖం వల్లనన్నా లేక సుఖం వల్లనన్నా చెడుతుంది. సుఖం వచ్చినప్పుడు మిడిసి పడకూడదు. సుఖః దుఃఖాలు ప్రమాదకరం కాదు, వాటియందు మనం పెట్టుకున్న పట్టు ప్రమాదకరం. అలాంటి సమయంలో ఏకాగ్రతని పెంచుకోవాలంటే ఏంచెయ్యాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు.

దుఖేఃషు అణుద్విజ్ఞమనాః సుఖేషు విగతస్పృహః |
వీత రాగ భయ క్రోదః స్తితదీః మునిరుచ్యతే ||

మనం జీవితంలో విజయం పొందాలని అనుకుంటాం. నిరంతరం వాడు తన లక్ష్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి - వాడినే ముని అంటారు. అలా కావాలంటే సుఖం వచ్చినప్పుడు ఒంటిపై సృహ ఉండకుండా చేసుకోకు! దుఃఖం వచ్చినప్పుడు మనస్సు ఉద్విజ్ఞం చెందకుండా ఉండాలి. మనకు వీటియందు పట్టు ఉండకుండా చూసుకోవాలి. మనలోని రాగం భయంగామారి క్రోదంగా మారుతుంది. ఈరోజు మన ఆండాళ్ తల్లి లేపే గోపబాలిక ఇలాంటి జ్ఞానం కల్గి ఉన్నది.

"నోత్తు" మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు. కానీ నీనోము అయిపోయింది. ఎందుకంటే ఫలితం నీకు ముందే లభించింది. "చ్చువర్ క్కం పుగుగిన్ఱ" నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్టు ఉన్నావు, అంటే కృష్ణుడు నీవద్దే ఉన్నాడు. కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్నీ వారికి లభించినట్లే. సఖలలోకాలనన్నినింటిని తనలోచూపించాడు కదా! ఎప్పటికీ మారకుండా ఏక రూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే, ఆ భగవంతుడే రూపు దాల్చి వచ్చినదే శ్రీకృష్ణ అవతారం. ఆయనలో సఖలం ఉన్నట్లేకదా, ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా. "తేషాం రాజన్ సర్వ యజ్ఞాః సమాప్తాః" ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్టించాల్సిన అవసరం ఉండదు. "అమ్మనాయ్" ఓ యజమానురాలా! యజమానురాలంటే ముందు మమ్మల్ని సుఖింపజేసి కదా నీవు సుఖం అనుభవించాలి. "మాత్తముం తారారో" ఒక మాట మాతో మాట్లాడరాదా "వాశల్ తిఱవాదార్" తలుపులు తర్వాత తీద్దువుగాని, లోపలనుండే మాట్లాడు. నీవు భాగవతోత్తమురాలివి, నిన్ను సేవించుకోవటం ముఖ్యం. నిన్ను శ్రీకృష్ణ సేవనుండి మేం వేరు చేయటంలేదు. నీ మాట చాలు మాకు. అది మాకు ప్రాణం కాపాడుతుంది. జ్ఞానం పొందాలనుకొనే వ్యక్తికి మహానుభావుల వాక్కు మొదటి రక్ష.

వీళ్ళు కృష్ణుడులోపల ఉన్నాడని అనుమానిస్తున్నారు, ఇక ఏం మాట్లాడినా వీళ్ళు తప్పు పడతారు అని లోపల గోపబాలిక ఏం పలకలేదు. లోపల కృష్ణుడేం లేడు అని అన్నట్లుగా ఆమె వీళ్ళను పట్టించుకోలేదు. "నాత్తత్తుళాయ్ ముడి" లోపలుండే వాడు మన స్వామియే, ఎందుకంటే తులసిని ధరించిన వాడు మన స్వామియే కదా. ఎవరికి ఆపద వాటిల్లినా రక్షించడానికి తానే తగును అని సూచించడానికి గుర్తుగా ధరిస్తాడు. మేము ఆ వాసన గుర్తించాం.

లోపల గోపబాలిక నాపై లేని అభాండాలు వేయకండి, చూడండి తలుపులు వేసే ఉన్నాయి కృష్ణుడెక్కడినుండి వస్తాడు అని అంది. "నారాయణన్" అంతటా వ్యాపించినవాడేకదా ఆయన, సఖల చేతన అచేతన వస్తువులకన్నింటికీ లోపన పైన వ్యాపించి ఉండేవాడు. అలాంటి వానికి తలుపులు అడ్డా! "నమ్మాల్ పోత్త ప్పఱై తరుం" దేవతలకే అందని స్వామి మనలాంటి సామాన్యులరందరికి అందేవాడు ఆయన. "పుణ్ణియనాల్" పుణ్యాన్ని ఇచ్చే ఉదారుడు. ఆయన అందరికి అందాల్సినవాడు నీ ఒక్కదాని వద్దే పెట్టుకోవడం సబబా!

"పండొరునాళ్" ఇదివరకు ఒకనాడు "కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం" మృత్యువు నోట్లో దూరాడు కుంభకరణుడు. రాముడు అందరినీ రక్షించగల ఉదారుడు, ఆయన కుంభకరణుడిని చంపలా, కుంభకరణుడే మృత్యువు నోట్లో దూరాడు. దీప కాంతికోసం వచ్చిన కీటకం ఆ వేడికి మృత్యువును చేరితే తప్పు దీపందా! బుద్దిమంతుడూ ఆ దీపకాంతినే వాడుకొని బాగుపడతాడు, బుద్ది హీనుడు దానిలోనే పడి ప్రాణం తీసివేసుకుంటాడు. "తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో" ఇంతగా మేం చెబుతుంటే వినట్లేదంటే ఆయనతో నిద్రలో పోటీ పడుతున్నావా? పైపైకి సరదాగా చెప్పినా లోపల వేరే అర్థాన్ని సూచిస్తోంది అండాళ్ తల్లి.

ఒక దివ్యమైన జ్ఞానం కల మహనీయుడితో పోలుస్తుంది. ఎవరు అంటే, కుభంను కరణముగా కల్గిన వ్యక్తి, అగస్త్యుడు ఓడి పోయి తన శక్తిని నీకు ఇచ్చేసాడా అంటుంది. అగస్త్యుడు అనే ఋషి ఒక కుండలో పుట్టిన వాడు. శివుని వివాహానికి హిమాలయాపర్వతాన్ని ఆయన ఎక్కుతుంటే ఆ పర్వతం అగస్త్యుడి వైపు వంగిందట. వింధ్య పర్వతం మేలుపర్వతానికి పోటితో పెరుగుతుంటే దేవతలంతా గాబరాపడి ఈయనని అడిగితే, వింధ్య పర్వతం ఈయన శిష్యుడు. ఈయన దగ్గరకు రాగానే ఆ పర్వతం వంగి నమస్కారం పెడితే ఆయన తధాస్తు అని పెరుగుదలని వంచాడు అది ఆయన గొప్ప తనం. మామూలుగా ఒక్కొక్క పర్వతానికి అదిష్టాన శక్తివిశేషం ఉంటుంది. మనం దాన్నే పర్వతం అంటాం. ఈ భూమినీ మనం అలాగే భావిస్తాం, ఇక్కడ ఎన్నో జీవులు జన్మిస్తున్నారు, అందుకే ఆ శక్తి విశేషాన్నే మనం భూదేవి ఆంటాం. అగం-పర్వతం స్త- పెరుగుదలని నిలిపిన వాడు అందుకే ఆయన పేరు అగస్త్య అయ్యింది. మనలో పెంచుకున్న పాపపు కొండలని స్తంభింపజేయువాడు ఆయన. ఒకనాడు మొత్తం సముద్రాన్ని పానం చేసిన మహనీయుడు. ద్రావిడ భాషకంతటికి ఆయన వ్యాకరణ సూత్రాలను రచించిన మహనీయుడు. వాతాపిని సంహరించిన మహనీయుడు. అలాంటి మహనీయుడు కూడా నీవద్ద ఓడిపోయాడా అన్నట్లుగా ఆండాళ్ తల్లి చెబుతుంది.


లోపల గోపబాలిక కృష్ణా అంటూ లేచింది, "ఆత్త అనందల్ ఉడైయాయ్!" పెద్ద బద్దకం కల దానా, "అరుంగలమే" అతిలోక సుందరి, ఒక మంచి ఆభరణం లాంటి దానివి. జ్ఞానులు అలా ఉంటారు, వాళ్ళు ప్రాపంచిక విషయాల్లో పెద్దగా తెలిసినవారుకాదు. "తేత్తమాయ్ వందు తిఱవ్" తొందరగా సర్దుకొని రావమ్మా.


Tiruppavai - తిరుప్పావై 9వ రోజు పాశురము





తిరుప్పావై 9వ రోజు పాశురము

తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్

ఆండాళ్ తల్లి ఈరోజు నాలుగో గోపబాలికను లేపుతుంది. "తూ" పరిశుద్దమైన "మణి" మణులతో చేసిన "మాడత్తు" మేడ, "చ్చుత్తుం విళక్కెరియ" చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి. ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించ గలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్ర్తాలు కావాలి. శాస్ర్తాలకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఆరెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. ఒక వత్తు వేదం, ఒక వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యాణాలు. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అణుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది. ఈ గోపబాలిక వెలుతురుకోసం దీపం వెలిగించలేదు, అది మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటిచుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటిచుట్టూ దీపాలు వెలిగించింది. "దూపం కమళ" దూపం పరిమళిస్తుంది. "త్తుయిల్ అణైమేల్ కణ్ వళరుమ్" నిద్రపుచ్చే అందమైన ఒక పడక పై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నావా. "మామాన్ మగళే!" ఓ మామగారి కూతురా! "మణి క్కదవం తాళ్ తిఱవాయ్" మణులతో చేసిన ద్వారం తెరుచుకొని రావమ్మా. సంస్కృతంలో వివిద అంకెలకు గుర్తుగా, తొమ్మిది మణులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆధిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు. ఇక్కడ మణి అనగానే మనకూ భగవంతునికి ఉండే తొమ్మిదిరకాల సంబంధాలు తెలుసుకోవాలి.

1. మనందరికి తండ్రి ఆయనే

2. మనందరిని రక్షించేవాడు ఆయనే

3. మనందరిని నావాల్లు అని కల్గిన వాడు ఆయనే- శేషి అంటారు

4. మనందరిని భరించేవాడు ఆయనే - భర్త అంటారు

5. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు ఆయనే- జ్ఞేయము అంటారు

6. మనందరిని తన వస్తువులుగా కల్గి ఉండి వాటికి స్వామి ఆయనే

7. మనందరికి ఆధారం ఆయనే - నారాయణుడు అంటారు

8. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే - అంతర్యామి అంటారు

9. భోక్తా ఆయనే. స్వీకరించగల వాడు ఆయనే

లోకంలో మనం ఎదో ఒక సంబంధం అమ్మ,నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం, అదే ఇన్ని సంబంధాలు కల్గి, శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! "పితా రక్షకః శేషి భర్తా జ్ఞేయ స్వామి ఆధారః ఆత్మా భోక్తా" అష్టాక్షరీ మహా మంత్రం దీన్నే తెలిపింది. భగవద్గీతలో ఎన్నో సార్లు ఈ విషయం చెప్పాడు. ఈ జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానమే ఆగోపిక వెలిగించిన దీపాలు. మనలోని మంచి ఆచరణ దూప పరిమలాల వంటిది.

అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం. వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా, వాళ్ల స్థానాన్ని తలచుకున్నా మనం తరించిపోతాం. మనకు ఈ శరీరంపై దృష్టి ఉండి, ఇకపై దేనియందు మనస్సు అనిపించదు. దీన్ని పోషించుకోవాలి, దీని కోసం దేన్నైనా వదిలేయ్యాలి అని ఇలా దేహ బ్రాంతి పెరిగిపోతుంది. ఈ తలుపు తెరుచుకోవాలి. ఈ ఆకర్షనమైన దేహం అనే తలుపు తెరుచుకొంటే లోపలుండే వాడి దర్శనం అవుతుంది. అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేం. ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరువాల్సిందే.

"మామీర్!" ఓమెనత్తా, "అవళై ఎళుప్పీరో" మీ కూతురుని లేపమ్మా. ఇంత హాయిగా పడుకొని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే, ఆయనే మాట్లాడనివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు. "ఉన్ మగళ్ తాన్ ఊమైయో" నీపిల్ల ఏమైనా మూగదా లేక "అన్ఱి చ్చెవిడో" చెవిటిదా లేక "అనందలో" అలసిపోయిందా "ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో" ఎవరైనా కాపలా కాస్తున్నారా లేక ఎవరైనా వచ్చి మంత్రం వేసేశాడా. శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం, ఆయన దగ్గర ఉంటే ఇక ఏమంత్రం పనిచెయ్యదు. అక్కడి నుండి బయటకు రావడం కష్టం. భగవత్ జ్ఞానం కల్గిన వ్యక్తి అలానే ఉంటాడు, ఇతరమైన మాటలు మాట్లాడడు. బయటి విషయాల్లో మూగివాళ్ళ వలె ఉంటారు. లౌకికమైన మాటలు వినలేరు ఆ విషయంలో చెవిటివారివలె ఉంటారు. లౌకికమైన పనుల యందు అలిసినట్లు ఉంటారు. భగవంతుడు అలాంటి వాళ్ళను కాపలా కస్తుంటాడు. ఈ గోపిక అలాంటి జ్ఞాని.

ఆయితే లోపల గోపబాలిక తల్లి అలా ఆక్షేపించకండి, ఈమె ప్రవృత్తి మీకు తెలియనిదా, లోపల ఆయన నామాలను స్మరించుకుంటుంది. మీరూ ఆ నామాలను పాడండి, లేచి వస్తుంది అని చెప్పింది. మేము ఆయన నామాలనే పాడుతున్నాం. ఏమేమి అని అడిగింది.

"మామాయన్" చాలా ఆశ్చర్యమయిన పనులు చేసేవాడు, ఒకనాడు అడివి దహించి పోతుంటే ఒక్కసారి ఇలా మింగేసాడు, మన దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో చిలిపి పనులు, తుంటరి పనులు. ఎలాగో ఒకలాగ ఆయనపై మనస్సు పడేట్టు ఆయన మన బాగుకోసం చేసాడిన్ని పనులు. ఇవన్నీ దయ చేత కారుణ్యం చేత చేసాడు.

ఆ దయ పైకి లేచేట్టు చేసేందుకు అయనకు ఒకావిడ ఉంది, మన పాపాలను కనపడకుండా చేసే ఒకావిడ ఉంది, "మాదవన్" మా-లక్ష్మీదేవి దవ-నాథుడు,లక్ష్మీదేవి సంబంధం కల్గిన వాడు ఆయన, మరి ఆయన ఏ దిక్కు లేక మన కోసం రావడంలేదు, ఆయన "వైకుందన్" వైకుంఠం అంటే ఈ విశ్వం కంటే మూడు రెట్లు ఎక్కువ- త్రిపాద్ విభూది అనిపేరు. అక్కడుండే వారంతా తన మనస్సు తెలుసుకొని ప్రవర్తించే వారు. అలాంటి వైకుంఠానికి నాథుడు. మన బాగుకోసం మనకోసం వచ్చాడు. ఇలా "ఎన్ఱెన్ఱు" ఎన్నెన్నో "నామం పలవుం నవిన్ఱ్" నామాలను పలుకుతున్నాం.

ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన ఒక గోపబాలికను లేపింది ఆండాళ్ తల్లి.'

Saturday 23 December 2017

Tirupavvai - తిరుప్పావై 8వ రోజు పాశురము




తిరుప్పావై 8వ రోజు పాశురము

కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్

ధనుర్మాస వ్రతం ఒక విలక్షణమైన వ్రతం. శరీరాన్ని శ్రమింపజేసి, హింసించి చేసే వ్రతం కాదు, శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం. నీటివాలుకు మనం తెర చాప ఎత్తుకుంటే, దానికి గాలికూడా వాలు అయితే యాత్ర వేగంగా సాగినట్లుగానే, మన శరీరం ఏ ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావల్సిన పదార్థాలని అందిస్తూ, బాగుపడటానికి ఆలోచనారీతిలో మార్పు వచ్చేలా, మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాళ్ తిరుప్పావై. ఒక ఉత్తమ స్థితికోసం పాటుపడటం, అది కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పొందాలని చెప్పేదే ఆండాళ్ తిరుప్పావై. మన వేదాలు ఆ రహస్యాలనే తెలుపుతాయి. "అస్మాన్ అగ్నే నయ సుపతా రాయే" మా అందరిని కలిపి మంచిమార్గాన నడుపు అనే విషయాన్నే తెలుపుతాయి. మన వేద సంప్రదాయం ఇదే, ఆండాళ్ ఆ మార్గాన్నే నడిచి తను ఫలాన్ని పొంది మనకు అందించింది తిరుప్పావైని. మనిషికి ఇదీ లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ఇలా చేరాలి అని వేదాలు తెలిపాయి. అందరం కలిసి ఆనందం పొందడాన్నే బ్రహ్మానందం అని అంటారు. ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది, అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి. అలా ముక్తి కోరుతున్నాం అంటే మనల్ని ముముక్షు అని అంటారు.

మరి ఏంచేయాలి ఏది పొందాలనేది మన వేదాలు చెబుతాయి. యాజ్ఞవల్కుడు అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడు. జనక చక్రవర్తి గురువుగారు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉండే వారు. పెద్దావిడ మైత్రేయి, చిన్నావిడ కాత్యాయని, కొంతకాలం అయ్యాక వానప్రస్తం గడుపాలని తన ఆస్తిని విభజించి వాళ్ళకు పంపకం చేసాడు. అయితే కాత్యాయని సంపదలను తీసుకొని ఊరుకుంది. మైత్రేయి గొప్ప యోగ్యత కలది, ఆయనను ఒక ప్రశ్న వేసింది. ఇన్ని సంపదలను విడిచి వెళ్తున్నావంటే నీవు కోరుకుంటున్నది భహుషా ఇంతకంటే విలువైనదై ఉంటుంది కాదా. మరి నాకూ ఆ సంపదే కావాలంటూ ఆయన వెంట భయలుదేరింది. మరి నీవు పొందాలనుకున్న ఆ ఆత్మజ్ఞానం ఏదో నేనూ పొందాలని అనుకుంటున్నాను, మరి దానికి నేనెలా సాధన చేయ్యాలో చెప్పు అని అడిగింది. "ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిద్యాసితవ్యః మైత్రేయీ" అంటూ ఉపదేషం చేసాడు. హే మైత్రేయీ "ఆత్మావారే ద్రష్టవ్యః " లోపల ఉండే ఆత్మా అనేదాన్ని మనం స్పష్టంగా చూడవలె. కానీ ఎట్లా కనిపిస్తుంది ? ద్రష్టవ్యః - చూడాలి అనుకున్న దాన్ని మొదట "శ్రోతవ్యః" వినాలి, మంతవ్యః - దాన్నే పదే పదే తలచాలి, నిదిద్యాసితవ్యః - ఇకపై దాన్ని ఊహించాలి. మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచిదో అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి. ఆండాళ్ ఇదే విషయాన్ని చెబుతుంది. అండాళ్ తల్లి చెప్పేది ఏదో మెట్ట వేదాంతం కాదు, లౌకికమైనది అంతకంటే కాదు. ఆండాళ్ తిరుప్పావై మన ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అందులో మనం సాధించాల్సిన ప్రగతిని సూచిస్తూ అందించిన అతి సుందరమైన ఒక లలితమైన గోపికా కృష్ణుల కథ. పైకి ఒక అందమైన కథ, లోపల మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత్ర.

మొదట పక్షులు అరిస్తున్నాయి అని చెప్పింది, ఇంక పక్షుల అరుపులు వినలేదా అని చెప్పింది - ఇది మనం శ్రవణం చేయటం లాంటిది. అలా చేయగా క్రమేపి రుచి ఏర్పడ్డాక, ఆలయ పిలుపు శఖం ధ్వని, గోపికల పెరుగు చిలికే ధ్వనిని ఊహించింది. ఇలా కనిపించని వాటిని ఊహిస్తున్నారు. ఎన్నింటినో వింటాం, ఊహిస్తాం ఆ తర్వాత మనకు జ్ఞానుల సహవాసం కావాలి. అందుకే మునులు స్మరించువాడు అని తెపిపింది, వాడే నారాయణుడు అని తెలిపింది. ఇలా మునుల వద్ద ఉపదేశం పొంది మనం ఇక మనం జీవనం సాగించాలి. అలా సాగితే మనం "ద్రష్టవ్యః" అప్పుడు స్పష్టంగా చూడగలం.

"కీళ్" తూర్పు దిక్కున "వానమ్" ఆకాశం "వెళ్ళెన్ఱ్" తెల్లవారిందని అనుకుని "ఎరు మై" గేదెలన్ని కూడా "శిఱు వీడు మెయ్యాన్" చిన్న మేత మేయడానికి "పరందన కాణ్" పచ్చిక బయళ్ళలో వ్యాపించాయి. సాదారణంగా గేదెలను తామసిక గుణంతో పోలుస్తారు, తెలవారటాన్ని సత్వంతో పోలుస్తారు. ఇక్కడ ఆండాళ్ తల్లి మనలోని తామసిక గుణాన్ని బయటకు పంపి సత్వం పైకి వస్తున్నప్పుడే మనం భాగుపడే ప్రయత్నం చెయ్యాలి. మరి ఈ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు-"రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే" మనలోపలుండే సర్వ రసుడు, సర్వ గంధుడు అయిన భగవత్ దర్శనం అయినప్పుడు మాత్రమే మనలోని ఈ తామసిక గుణం బయటకి పోతుంది. అంతవరకు మనం దాన్ని అణిచే ప్రయత్నం చేయాలి. మీముఖ కాంతికి చీకటి చెదిరి అలా తెల్లవారినట్లు మీకనిపిస్తుంది, ఇంకా తెల్లవారలేదు అని ఆ లోపల గోప బాలిక లేవలేదు.

"మిక్కుళ్ళ పిళ్ళైగళుం" మిగతా పిల్లలందరూ "పోవాన్ పోగిన్ఱారై" త్వరత్వరగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళిపోతుంటే "ప్పోగామల్ కాత్తు" వాళ్ళను ఆపి, "ఉన్నైక్కూవువాన్ వందు నిన్ఱోం" నిన్ను కూడా తీసుకు వెళ్దామని నీ ఇంటి ముందుకు వచ్చాం. ఎందుకంటే, "కోదుగలం ఉడైయ పాపాయ్!" శ్రీకృష్ణుడికే నిన్ను కలవాలని కుతూహలం కల్గించే గోపికవి కదా నివ్వు. భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా "ప్రియోహి జ్ఞానినో త్యర్థమాం సచ మమ ప్రియః" జ్ఞానికి నేనంటే ఎంత ఇష్టమో నాకూ జ్ఞాని అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని పరమాత్మ అన్నాడు. అందుకే మనం ఆలయాల్లో ఆళ్వారులని పెట్టుకొని వారి ద్వారా స్వామిని సేవిస్తాం. నిన్ను వదిలి మేం వెళ్ళలేం. నీవు మావెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పనిసరి ప్రసన్నం అవుతాడు. "ఎళుందిరాయ్" లేవమ్మా అందరం కలిసి వెళ్దాం. ఇక్కడకు వెళ్ళి "పాడి ప్పఱై కొండు" మనకు నోరు ఉన్నందుకు ఆయన నామాన్ని పాడుదాం.

"మావాయ్ పిళందానై" గుఱ్ఱం రూపంలో వచ్చిన అశ్వాసురుని నోట్లో చేయి పెట్టి నోరు విరిచివేసాడు. మనలోని ఇంద్రియాలు అశ్వాలకు ప్రతీక. కఠోపనిషత్లో ఈ విషయం ఉంది. యముడు నచికేతుడికి చెబుతాడు "ఇంద్రియాణి హయానాహుః" శరీరం అనే రథానికి ఉన్న గుఱ్ఱాలు ఇంద్రియాలు. ఈ ఐదు ఇంద్రియాలు మనను ఐదువైపులకు లాగుతుంటాయి. మనస్సు అనే ఖల్లెంతో బుద్ది అనే సారథిచేతులో పెట్టావా ప్రయాణం సుఖం. లేకుంటే ఈ రథం ముక్కలు ముక్కలై పోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు. భగవంతుడు ఇంద్రియాలను హరించడు, వాటి ప్రవృత్తిని మారుస్తాడు. అందుకే అశ్వాసురుని నోరు విరిచేసాడు.

"మల్లరై మాట్టియ" మథురా నగరిలో మల్ల యోదులైన చాణూరుడు ముష్టికుడులను, ఖంసుడు శ్రీకృష్ణ బలరాములని సంహరించడానికి ఏర్పాటుచేసాడు. వారు మారక ద్రవ్యం సేవించి ఉన్నారు, కృష్ణ బలరాములు వారి మద్యకి వెళ్ళి, ఇరువురు వారిని వారే సంహరించుకొనేట్లు చేసారు. మనకి ఆయనను దూరంగా పోకుండా ఆయనే చేసుకున్నాడు. మనలోని కామ క్రోదాలు ఈ మల్ల యోదులవంటివే అని గమనించాలి. మనలోని కోరికలను ఎంతవరకు ఆపగలం, ఎంత కోరిక తీర్చుకోవాలని చూస్తే అంత పెరుగుతాయి మన కోరికలు. పూరణైరేవ కన్యతే- దేనితోనైతే నీవు పూడ్చాలని ప్రయత్నం చేస్తావో అవే ఈ కన్నాన్ని పెద్దగా చేస్తాయి. అగ్నికి కావల్సింది ఇందనం, ఇందనం పోస్తే అగ్ని మరింత పెరుగుతుంది అలానే మనలోని కోరికలు మరింత పెరుగుతాయి. రావణవద అనంతరం, హే రావణా ఈ రాముడు కోతులు నిమిత్తమాత్రులు, నిన్నా వీరు అణిచివేసింది, నీలోని కామ క్రోదాలను పైకి లేపుకున్నావు వాటితోనే నిన్ను నీవే చంపుకున్నావు! అని మండోదరి శోకిస్తూ అన్న మాటలు. కృష్ణుడివైపు మనం మలిస్తే వాటిని కృష్ణుడే సంహరించివేస్తాడు.

"దేవాది దేవనై" ఆయన దేవాదిదేవుడు, మనల్ని ఆయన ఎప్పుడూ వదలడు. ఇన్నాళ్ళూ మనం నీవాడను అని అనకనే కదా ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు కోరిక కలిగినందుకు నోటితో ఒక్క సారి అను. ఏమని "చ్చెన్ఱు నాం శేవిత్తాల్" ఒక్క సారి మనం చేరి తండ్రీ మేము నీవారమని తెలిపితే చాలు. "ఆవా ఎన్ఱ్ ఆరాయ్ అంద్ అరుళ్" మన కోసం ఆయనే తపిస్తాడు. ఇక్కడ మనం రామాయణంలోని ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం. రాముడు వనవాసం చేస్తూ పంచవటిలో కుటీరం కట్టుకొని ఉన్నాడు, అంతలోనే అక్కడికి కొంతమంది ఋషులు వచ్చి రామా మాకు ఇన్ని కష్టాలున్నాయని మొర పెట్టుకున్నారు. రాముడు నేను అయోద్య నుండి వచ్చింది మీ కష్టాలు తెలుసుకొని తీర్చేందుకేనని, తను కొంత ఆలస్యం చేసినందుకు సిగ్గు పడ్డాడు. ఇదీ పరమాత్మ స్వభావం. మనం ఒక్కసారి సేవిస్తే చాలు ఆయన మనకోసం తపిస్తాడు. తిరుమరిసై ఆళ్వార్, ఆయననే భక్తి సారులు అని కూడా అంటారు. ఆయన కాంచీపురంలో ఒక ఆలయంలో ఉండేవారు. వారితో పాటు ఆయన శిష్యుడు ఉండేవాడు. అయితే ఆ శిష్యుడు మంచిగా పాటలు పాడేవాడు. ఆయన్ని రాజుగారు పిలిచి తనపై పాటలు పాడమని కోరారు. దానికి ఆయన, దేవున్ని పాడే నాలుక మనుష్యులను పాడటానికి కాదు అని అన్నాడు. దానికి రాజు కోపించి ఆయన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు. అతనితో పాటు గురువుగారూ బయలుదేరారు. దానితో ఆ గురువుగారి వెంట ఆలయంలో పెరుమాళ్లు కూడా అతని వెంటనే వెళ్తాననడంతో, రాజుగారు ఇద్దరిని బతిమిలాడి తీసుకువచ్చారట. ఆ భక్తుడంటే ఆ పెరుమాళ్ళకి అంత ఇష్టం ఉండేది. యదోక్తకారి - ఎలా చెపితే అలా వినే పెరుమాళ్ అని అర్థం ఇది కాంచిపురంలో ఒక ఆలయం.

అందుకే మన ఆండాళ్ ఈరోజు అలాంటి ఒక గోపికను మనతో కలిపి, భగవంతుని అనుగ్రహం మనపై పడేట్టు చేస్తుంది.

Tiruppavai - తిరుప్పావై 7వ రోజు పాశురము




తిరుప్పావై 7వ రోజు పాశురము

కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్

"కీశు కీశ్ ఎన్ఱ్" పక్షులు మాట్లాడుతున్నాయి. "కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో" పక్షులు వాటి ఆహారంకోసం వెల్లడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే అని బాధతో మాట్లాడుతున్నాయి. నీకు వినబడట్లేదా. కేవలం మేం నిలుచున్న చెట్టుమీది పక్షులేకాదు, "ఎంగుం" అన్ని చెట్లమీది పక్షులూ అరుస్తున్నాయి, అంటూ అండాళ్ తల్లి "ఆనైచ్చాత్తన్" భరద్వాజ పక్షి గురించి చెబుతుంది.

ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి, చిలుకలవలె మాట్లాడగల పక్షులు. ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది అండాళ్ తల్లి. రాముడు వనవాసానికి వెల్లినప్పుడు ఒక రోజు భరద్వాజ ఆశ్రయంలో ఉండి వెళ్తాడు. తరువాత భరతుడు రాముణ్ణి వెతుకుతూ ఆ ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు భరద్వాజుడు భరతునికి ఉన్న రామ భక్తిని పరిక్షిస్తాడు. ఏపాపం చేయని రాముణ్ణి ఏం చేయాలని బయలుదేరావని ప్రశ్నించాడు. దానికి భరతుడు నీవు త్రికాలజ్ఞుడివి నీకు కూడా తెలియదా నా అంతర్యం అని విలవిలా ఏడిచాడు. భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విళాసాలు కల్గి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు. అందులో ఒక సభ ఏర్పాటు చేసాడు. భరతుణ్ణి రాజ సింహాసనంపై కూర్చోమన్నాడు. రాముడు కూర్చోవాల్సిన రాజ సింహాసనం వైపు వింజామరం ఊపుతూ, భరతుడు వెళ్ళి మంత్రి కూర్చునే ఆసనంపై కూర్చున్నాడు. అప్పుడు భరద్వాజునికి భరతునిపై నమ్మకం కల్గింది. అప్పుడు భరద్వాజుడు భరతునితో నాకున్న తపస్సంపద అంతా వినియోగించానయ్యా. సార్తకమైంది అని చెప్పాడు. భరద్వాజుడు ఒక్క పురుష ఆయిష్షు వేద అద్యయణం కాగానే తనకు ఇంకొక పురుష ఆయిష్షు కావాలంటూ తపస్సు చేయటం ప్రారంభించాడు. ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుష ఆయుష్షు భరద్వాజునికి పెంచాడు. మళ్ళీ వేద అధ్యయణం చేసి అదీ సరిపోనట్లనిపించింది, మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అలా మూడు పురుష ఆయుష్షులు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోనట్లు అనిపించి చింతించసాగాడు, ఈ సారి ప్రజాపతి తానంతట తనే వచ్చి, ఏంకావాలి అని అడిగాడు. మరొక్క పురుష ఆయుష్షు అని అడిగాడు, అయితే ప్రజాపతి ఆయనకు ఒక్క సారి కళ్ళల్లో మూడు పర్వతాలు ఆ పై మూడు పిడికెడులు కనిపించజేసాడు. భరద్వాజుడితో నీవు చదివింది ఆ వేదంలోని కేవలం మూడు పిడికెడులు మాత్రమే. ఇక చదివింది చాలు దాన్ని ఆచరించు అని చెప్పాడు. కాబట్టి ఆయనకు తెలిసింది రామభక్తుని సేవ. భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము అని భరద్వాజ సంహితలో ఈ సూక్తిని ఆయన రాసి పెట్టాడు. అందుకే భరద్వాజుడు మూడు పురుషాయిష్యులలో సంపాదించిన తపస్సంపద అంతా భగవత్ భక్తి కల్గిన మహనీయునికై వినియోగించాడు. ఆండాళ్ తల్లి అలాంటి పేరు కల్గి ఉన్న పక్షిని చెబుతుంది అంటే అంతర్యం నీవు భగవతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు, భగవత్ భక్తులతో కలవడంలేదు "పేయ్ ప్పెణ్ణే" పిచ్చిదానా అని లోపల ఉన్న గోపబాలికను అంటుంది.

గోకులంలో గోపికలకు నిత్యకర్మ పెరుగులు చిలకడం. అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేవారు. దానికి వారు స్నానం ఆచరించి, పువ్వులు దరించి ఇవన్నీ భగవత్ సేవ అని భావిస్తూ చేసేవారు. అక్కడి గోవులు కృష్ణ కర స్పర్శచే పెరిగినవి కావటంచే అవిచ్చే పాలు అంత చిక్కనివి, ఇక పెరుగు ఇంకా చిక్కగా ఉండేది, వీళ్ళకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది, ఇక కృష్ణ నామస్మరణ చేస్తూ చేసేవాళ్ళు. వాళ్ళు పాలు కాచినా, పెరుగు చిలికినా, వెన్న దాచినా అన్నీ కృష్ణుడి కోసమే. కృష్ణుడు వెన్న దొంగిలించడం కూడా వారికి ఇష్టమే, ఒక్క రోజు కన్నయ్య వెన్న దొంగిలించకుంటే వారికి భాదగా ఉండేది, వెన్న దాచటం, కృష్ణుడు వెన్న దొంగిలించటం ఇవన్నీ వారికి ఒక సరదా. ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమి ఉండేది కాదు, కృష్ణుడి క్షేమం తప్ప వాళ్ళకంటూ ఏమి కోరేవారు కాదు.

"కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు" గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగలా శబ్దం చేస్తున్నాయి. "వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్" గోపికల జడల్లోని పుష్పాలు రేపల్లె అంతటా పరిమళాన్ని విరజిమ్ముతున్నాయి."మత్తినాల్ ఓ శై పడుత్త తయిర్ అరవం" కవ్వముతో పెరుగు చిలికే శబ్దం "కేట్టిలైయో" వినబడలేదా. "నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!" ఓ పెద్ద నాయకురాలా! నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట తీసుకెల్లాల్సినదానివి, హాయిగా నిద్ర పోతున్నావా అంటూ ఆక్షేపించసాగారు.

"నారాయణన్ మూర్ త్తి కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో" పెరుగులు చిలికే గోపికలు స్మరించే శ్రీకృష్ణ నామాలను మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు. ఏమిటా నామాలు అంటే "నారాయణ" సర్వ జగత్తును లోపల పెట్టుకున్న స్వామి, మరి అంతవాడు మనకేం అందుతాడు అనుకోకుండా, మూర్తీభవించిన అందమేనా అన్నట్టుగా ఉన్న చిన్ని రూపంలో వచ్చాడు మనకోసం. అందుకే ఆయన "మూర్తి" మన కోసం ఒకరూపు దాల్చి మన కోసం వచ్చినవాడు.

కేవలం అందమైనవాడేనా! కాదూ, మనం కృష్ణున్ని సేవించుకోవడానికి వచ్చే అడ్డుకూడా ఆయనే తొలగించుకొని తనను మనకు ఇచ్చుకొనేవాడు, "కేశవన్" కేశి అనే గుఱ్ఱం రూపంలో ఉన్న రాక్షసున్ని సంహరించినవాడు. కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుఱ్ఱంలా వచ్చి నోరు తెరిచాడు, తెరిచిన ఆ నోరులో చేయిపెట్టాడు కృష్ణుడు, చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు. అలా ఉబ్బిన చేయివల్ల ఆ అసురుడు సంహరింపబడ్డాడు.

అలా మనకు ఉపకారం చేసే వాడి నామాన్ని పాడుతుంటే నీవు వచ్చి మాతో కల్సి పాడొచ్చుకదా. లోపల గోప బాలిక, తను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపేస్తారేమోనని కాబోలు లేవటం లేదు. కానీ ఆమె లోపలనుండి భగవత్ నామ స్మరణ చేయడంచే ఆమెలో ఒక తేజస్సు మన వాళ్ళకి కనిపించింది. "తేశం ఉడైయాయ్" భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కల్గిన దానా "తిఱవ్" రావమ్మా, నీ తేజస్సును మాకూ పంచి ఇవ్వు అని ఆండాళ్ తల్లి పిలుస్తుంది. మనలోని భగవత్ జ్ఞానమే మనకు తేజస్సును కలగ జేస్తుందని గమనించాలి.

Thursday 21 December 2017

Tiruppavai - తిరుప్పావై 6వ రోజు పాశురము





పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్ ||

ఈ రోజు నుండి మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికను లేపడం ప్రారంభిస్తుంది. మనకో సందేహం రావచ్చు. శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్ర పట్టడం లేదు, వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరి కొందరెలా నిద్ర పోతున్నారని మనకు అనిపించవచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. భగవంతుని గుణాలు, ప్రేమ అనేవి ఒక మత్తు మందులాంటివి. అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేసి కొందరికి నిద్రమత్తులో ఉంచేట్టు చేసాయే తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి. పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు, మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి.

శ్రీకృష్ణ పరమాత్మ రెండో అధ్యాయమంలో స్థితప్రజ్ఞుల గురించి చెప్పాడు. వారు ఎలా ఉంటారంటే అందరూ మేల్కొనే వద్ద వాళ్లు పడుకొని ఉంటారు, అందరూ పడుకొనే వద్ద వాళ్లు మెలుకువగా ఉంటారు. సామాన్యులు శారీరక సుఖాలలో మెలుకువై ఉంటారు. మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపల ఉండే మన విషయంలో, వెనకల ఉండి నడిపే వాడి విషయంలో జ్ఞానం శూన్యం. ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కల్గి ఉంటారు. మరి జ్ఞాణులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా, భగవంతుని విషయంలో జాగరూపులై ఉంటారు. ఆలోపల ఉండే గోపికలూ అట్లాంటివారే. అందుకే మనం వాళ్ళను మన తోడుపెట్టుకొని భగవంతుని దగ్గరకు వెలితే తప్ప భగవంతుడు మనకేసి చూడడు. అలా భగవంతుని విషయంలో నిమగ్నమై ఉన్న ఒక పది మంది గోపికలను లేపుతూ భగవత్ జ్ఞాన దశల్లోని ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాళ్ తల్లి మనకున్న పొరల్ని తొలగిస్తుంది. అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది.

ఈ రోజు లేపే గోపబాలిక ఒక చిన్నపిల్ల. చిన్నపిల్లలు మనసులో చేతల్లో ఒకేరకమైన భావం కల్గి ఉంటారు. అలాంటి ఒక గోపబాలికను లేపుతూ "పుళ్ళుం శిలమ్బిన కాణ్" పక్షులు అరుస్తున్నాయ్ లేవవోయ్. భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైన పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి. అంటే రెండు రెక్కల పక్షులు మనకు తెల్లవారడాన్ని సూచించినట్లే, జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే రెండు రెక్కలతో ఆకాశము అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవతత్వములో విహరించే మహానుభావుల పలుకులు, మనల్ని అజ్ఞానములోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే. అందుకే మనవాళ్లు ఒక గుర్తుగా చెప్పారు.

లోపల గోపబాలిక వీళ్ళు చేసే అల్లరికి పక్షులు లేచి ఉంటాయి అని భావించినట్లుంది, మనవాళ్ళు రెండో గుర్తు చెప్పడం ప్రారంభించారు "పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో పిళ్ళాయ్!" ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుని స్వామి - విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ద్వని కూడా వినిపించడం లేదా ఓ చిన్నపిల్లా అని అంటుంది. అక్కడి దీప కాంతి శంఖం ఊదే వాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని అండాళ్ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ - తెల్లని పిలుపు శంఖం అని వర్ణిస్తుంది. శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు. లోపలుండే గోపబాలిక అది జాము జాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారలేదన్నట్లుగా భావించి ఇంకా నిద్ర లేవలేదు. "ఎళుందిరాయ్" - మేలుకో. మరి అండాళ్ తల్లి తాను ఎలా మేల్కొందో కొన్ని గుర్తులు చెబుతుంది. "మునివర్గ ళుం యోగిగళుం మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరుంద్" మునులూ, యోగులూ మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి-హరి-హరి అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగా వినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం, నీకు వినబడలేదా! మరి వాళ్లు మూడు సార్లు హరినామం ఎందుకు అన్నారో అండాళ్ తల్లి వివరిస్తుంది.

"పేయ్ములై నంజుండు" పూతన స్తనాలకు అంటి ఉన్న విషాన్ని ఆరగించాడు - దూదిపింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు - వదలని వాడు కాబట్టే ఆయనను అచ్యుత అని అంటారు. ప్రకృతి మనకు ఇచ్చే "ఆహం-మన" అనే విషాలను హరించేవాడా - హరి అని జ్ఞానులు తలుస్తున్నారు.

"కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి" శ్రీ కృష్ణుని తల్లి యశోదమ్మ ఒక బండి క్రింద పడుకోబెట్టింది, ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీ కృష్ణుని సంహరించాటానికి చూసాడు. కపట శకటాసురున్ని కాలుజాచి సంహరించాడు. ఆయన పాదం అలాంటిది. ఈ శరీరం మనకు ఒక శకటం లాంటిది, పుణ్య - పాపాలు దాని చక్రాలవంటివి, మనల్ని నడిపించే పరమాత్మను దానిక్రింద పెట్టి ఆయన పాదాలను - చరణాలను 'శరణం ప్రపద్యే' అంటే చాలు - మనకు అంటి ఉన్న పుణ్య - పాప సంపర్కాన్ని హరించువాడా - హరి.

"వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తు క్కొండు" - ఆదిశేషువుపై సుకుమారంగా పవళించి ఉన్న జగత్తుకు బీజమైన స్వామి. అయిదు తలల ఆదిశేషువు - అయిదు రకాల జ్ఞానములను తెలియ జేస్తుంది. నేను వాడికి చెందిన వాన్ని, వాడు నన్ను తరింపచేయువాడు, వాన్ని చేరే సాధనం వాడి శరణాగతే, వాన్ని చేరితే కలిగే ఫలితం వాని సేవ, వాన్ని చేరకుండా ఉంచే ఆటంకం వానియందు రుచిలేకుండుట అనే అయిదు జ్ఞానాలు కల్గి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి. ఇతరమైన వాటిపై రుచి హరింపచేసినవాడా- హరి. అంటూ మూడు సార్లు హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ అండాళ్ తల్లి గోప బాలికను లేపింది.

Wednesday 20 December 2017

Tiruppavai - తిరుప్పావై 5వ రోజు పాశురము





తిరుప్పావై 5వ రోజు పాశురము 

మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్

చాలా అందమైనది- అందాలకు మూలకందం అనాలంటే సంస్కృతంలో దాన్ని కృష్-ణ అంటారు. కృష్ అంటే చాలా, ణ అంటే అనందం. ఆనందింపచేయుతత్వము ఐతే రామ-రమయతి అని అంటారు. కృష్ణ అనగానే ఒక మనిషి అనుకోకూడదు, అది ఒక తత్వం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అర్జునుడూ అలాగే అనుకున్నాడు, కృష్ణుడి విశ్వరూపం చూసాకే అర్థం అయ్యింది ఆయనంటే ఏమిటో. అంతటా వ్యాపించిన ఈ తత్వం మనకోసం మనం ఏర్పర్చిన రూపాన్ని, మనం పెట్టిన పేరుని తనదిగా చేసుకోగలదు. ఆ ఎదురుగుండా కనిపించేదాన్ని మనం విశ్వసించగలిగితే చాలు. ఇదే కృష్ణుడు ఇదే తత్వం అని గుర్తించు, అప్పుడు మనకు ఓయ్ అని పలుకుతుంది. అది గుర్తించక పోతే మనం ఎక్కడికి వెళ్ళినా వృదాయే. ఈ గుర్తింపు కలిగితే చాలు, మనం ఉన్నచోటే చాలు. అందుకే "నివృత్తరాగస్య గృహం తపోవనం" నీ లోపల అహంకారం తగ్గితే బాహిరమైన వస్తువుల తత్వం తెలిస్తే అప్పుడు గృహమే ఒక తపోవనం అవుతుంది. నీ జీవితమే ఒక తపస్సు అవుతుంది. ఇలా ఇంటిలో చూడటానికి వీలయ్యేట్టుగా ఒక రూపం పెట్టుకో, ఆ రూపం నీ దృష్టిని ఆకర్షించేట్టుగా ఉండాలి, నీకు భయం కల్గించనట్లుగా ఉండాలి. ఇలా మనం తయారుచేసి దానికి ఒక రూపం పేరు ఇచ్చి ఒక విశ్వాసంతో ఆ పేరుని పలకడం నేర్చుకుంటేచాలు. ఆ విశ్వాసం చాలు, పూజకు నిభందనలు ఏమి లేవు. అచంచలమైన విశ్వాసంతో నిశ్కల్మషమైన ప్రేమతో మనం ఏమి పలికినా అవి మంత్రాలే అవుతాయి. ఆయనా ప్రేమతోనే స్వీకరిస్తాడు. ఏమి చేసినా అది ఆరాధనే అవుతుంది. నీ ఇంట్లో విగ్రహంలోనే విశ్వాన్నంతటా నడిపే తత్వం ఉందని గమనించు చాలు. దీన్ని విశ్వసిస్తే చాలు. ఆధునిక అణువిజ్ఞానం కూడా చిన్న అణువులో ఎంతో శక్తి ఉందని చెబుతుంది. అదేదో జ్ఞానం లేనిది కాదు అంతటా వ్యాపించి ఉంది - దాన్నే మనం నారాయణ అని పేరు పెట్టుకున్నాం. దాని గుణాలను మనం శాస్త్రాల ద్వార గుర్తించగల్గుతున్నాం. అంతటా ఉండే ఆ తత్వం ఈ విగ్రహంలోనూ ఉంది, సందేహం అవసరం లేదు అని మన ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది ఈరోజు పాటలో. రెండో ఆధ్యాయంలో పరమాత్మ ఇదే చెప్పాడు్ - "సంశయాత్మా వినష్యతి". ఏ రంగమైనా ముందుకు పోవడానికి సరి అయిన నిర్ణయం తీసుకో, అడుగు ముందుకు వెయ్యి, సంశయం అవసరం లేదు. దాన్నే అండాళ్ తల్లి అందమైన పాటలో గోపికల కథగా అందించింది.

ఆండాళ్ తల్లి వ్రతం చేద్దామని బయలుదేరింది. చుట్టూ గోపీజనం అంతా చేరారు. మొదటి రోజు మనమంతా ధనుర్మాస వ్రతం చేస్తున్నమని తెలియజేసింది. రెండో రోజు వ్రతానికి కావల్సిన నియమాలేమిటో తెలియ జేసింది. మూడో రోజు వ్రతం ఆచరిస్తే కలిగే లోకక్షేమం గురించి వివరించింది. నాలుగో రోజు ఇలాంటి మంచి మనస్సుతో చేస్తే మనకు దేవతలతో సహా లోకంలోని వారంతా తోర్పడుతారు అని తెలియజేసింది. ఇకవారంతా శ్రీకృష్ణుడి కోసం బయలుదేరుతుండగా కొందరికి సందేహం వచ్చింది. ఇది లోకం మొత్తం క్షేమం కోసం చేసే వ్రతం కదా, ఏమైనా ఆటంకాలు వస్తాయేమో అని సంశయం వ్యక్తం చేసింది ఒక గోపిక. నీకా సంశయం ఎందుకు వచ్చిందని ఆండాళ్ తల్లి అడిగింది, ఆ గోపిక చాలా పురాణాలు చదివినట్లు ఉంది - అందుకు ఆమె, రామాయణంలో శ్రీరాముడి పట్టాభిషేకం అని దశరథుడు ఏర్పాటు చేయగా అదే సమయానికి వనవాసం ప్రాప్తించింది కదా! మరి మంచి పనులకు అడ్డులు కూడా అలాగే ఉంటాయికదా అని సంశయాన్ని తెలిపింది. అంతలో మరో గోపిక లేచి తన సంశయాన్ని తెలియజేసింది. ఈ గోపిక కావ్యాలు చదివినట్లు ఉంది, ఒక కావ్యంలోని వర్ణణ గురించి చెపుతూ - ఒక తుమ్మెద ఒక పద్మంపై వాలిందట, మధువును పానం చేసేసరికి మత్తుతో నిద్ర పోయిందట. సాయంకాలం కాగానే పద్మం ముకుళించుకుపోయిందట, లేచి చూడగానే బయటకు వెల్లడానికి మార్గంలేదని తెలిసి ఉదయం కాగానే పద్మం వికసిస్తుంది నేను వెళ్ళిపోవచ్చనే ఆశతో రాత్రంతా ఎదురుచూసిందట. అంతలోనే ఒక మదపు టేనుగు స్నానం కోసం ఈ పద్మాన్ని లాగి గట్టుపైకి విసిరికొట్టింది. తుమ్మెద అలాగే ప్రాణం కోల్పోయిందట. ఆశలెన్నో పెట్టుకుంటాం కాని నెరవేరుతాయా అని సంశయాన్ని తెలిపింది. మరొక గోపిక కాస్త వేదాంతం చదివినట్లు ఉంది - ఆమె లేచి మనం చేసిన కర్మలు మన శరీరంపైనే రాసి ఉంటాయి అంటారు కదా! వాటిని మనం అనుభవించక తప్పదు కదా! మరి మనం ఎట్లాంటి కర్మలు చేసామో ఏమిటో మనం విజయం సాదిస్తామో లేదో అని సంశయాన్ని తెలియ జేసింది.

ఇలాంటి సంశయాలన్నిటికి సమాదానం ఇస్తుంది ఆండాళ్ తల్లి ఈరోజు పాటలో. మనం చేసే కర్మలచే పుణ్య - పాపాలు భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం చేసే చిన్న విషయం కూడా ఆయనకు తెలియకుండా ఉండదు - అందుకే ఆయనను సర్వజ్ఞుడు - సర్వవేత్త అంటారు. ఆయా కర్మలకు తగిన ఫలాన్నిచ్చే శక్తి కూడా కలిగి ఉంటాడు. అందుకే మన పెద్దలు మన సంకల్పంలో కాని, మాటలలో కాని, చేతలలో కాని చెడు రానివ్వోద్దన్నారు. ఇలాంటి ఒక సంస్కారం ఏర్పరిచారు మన ఋషులు. మనం అనుభవించేవన్నీ మనం ఒకప్పుడు చేసినవే. ఇప్పుడు వచ్చిన త్రేనుపుతో మనం నిన్న తిన్న తిండిని గుర్తించగలం కదా. ఇక మనం ఏమిచేయాలో ఎలా ఉండాలో ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు. భగవంతుడికి మనపై కల్గిన ప్రేమనే పుణ్యం అంటారు, మనపై కల్గిన కోపమే పాపము అంటారు. వీటన్నిటినుండి బయటపడే ఒక సులభమైన మార్గాన్ని ఆండాళ్ తల్లి చెబుతుంది. మనం చేసుకునే కర్మలు మూడు రకాలుగా ఉంటాయి, అవి సంచితములు - ఆగామి - ప్రారబ్దం అని అంటారు. ఇదివరకు మనం చేసుకున్నవాటిని సంచితములని, ఇప్పుడీ శరీరంగా అనుభవిస్తున్నవాటిని ప్రారబ్దం అని, ఇప్పుడు చేస్తున్నవి భవిష్యత్తిలో అనుభవించేవి కనుక వాటిని ఆగామి అని అంటారు. మనం కావాలని అనుకుంటే సంచితాలను - ఆగామిని తీసివేయవచ్చు కాని ప్రారబ్దం మాత్రం ఉంటుంది. భగవంతునికి శరణాగతి చేస్తే ప్రాచీన కర్మలను తుడిచివేస్తాడు, ఇకపై మనం చేసే కర్మలు మంచిగా ఉండటంచే ఆగామి దూరం అవుతుంది. మరి ఈ కర్మలన్నీ ఎక్కడో ఒక దగ్గర అనుభవించాలి కదా, మరి అవి ఎక్కడికి పోతాయని ఒక గోపిక అడిగింది. ఇది మనం అందరం తెలుసుకోవాలి. భగవంతుడు మనపై ఉండే పాపాలను మనల్ని ద్వేషించే వారికి, పుణ్యాలను మనల్ని ప్రేమించే వారికి పంచి మనల్ని స్వీకరిస్తాడు. ఇక ప్రారబ్దం కూడా నిర్వీర్యం కావాలంటే - మనం భగవంతునికి చెందిన వాడను - నేను చేసేది వాడి సేవ - వాడికోసం చేస్తునాను ఇలాంటి భావన చాలు. మనకు అందిన నామంతో ఆయన పేరు పలుకు చాలు ప్రారబ్దం కూడా అంటదు. దీన్నే ఉజ్జీవించి బ్రతకటం అంటారు. ఆయన నామాన్ని పాడుదాం రండి అని ఆండాళ్ తల్లి చెబుతుంది.

"మాయనై మన్ను వడమదురై మైందనై"- చిత్ర విచిత్రమైన ఆశ్చర్యకరమైన కళ్యాణ గుణములు శక్తి విశేషములు కల్గి ఉన్నవాడు. అలాంటి వాడు మధురానగరానికి దిగివచ్చాడు. "తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై" మరి పెరగటమేమో యమునానది ఆవల ఉన్న గోకులంలో. పుట్టగానే మరి రాత్రికి రాత్రి యమునానది దాటడం, ఇది ఒక రహస్యం. దీన్ని ఆండాళ్ పదిహెనవ పాటలో చెబుతుంది. యమునానది సూర్యుని పుత్రిక, యముడి సోదరి. మరి శ్రీకృష్ణుడికి దారి ఎందుకు ఇచ్చింది. మరి కృష్ణుడు ఆ యమునా నది ఒడ్డుననే తిరిగేవాడు. నీటికోసమై వచ్చే గోపికల కోసం వేచి ఉండేవాడు."ఆయర్ కులత్తినిల్ తోన్ఱుం అణి విళక్కై" గోకులంలో మరి వెలిగించనక్కరలేని మణిదీపం వెలుతురువలె పెరుగుతున్నాడు పరమాత్మ. "తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై" మరి ఎలా ఉంటాడు ఆయన అంటే, తల్లి రోటికి కట్టివేస్తే ఏమీ చేతకాని వాడిలా పడి ఉంటాడు - అందుకే ఆయనను దామోదరుడు అంటారు. దామ - ఉదరుడు అయ్యాడు, మన దగ్గర కూడా అలాగే ఉంటాడు విగ్రహ రూపంలో.

అక్కడ తల్లి ప్రేమతో లోంగబడి ఉన్నాడు, మన జ్ఞానంతో మన దగ్గర ఆయన విగ్రహంలో లొంగి ఉన్నాడు. ఆధ్యాత్మిక పిపాస కల్గిన వ్యక్తికి భగవతత్వాన్ని ఎక్కడ సేవించాలంటే, విగ్రహమే ఒక మంచి మార్గం. ఆండాళ్ తల్లి శ్రీవెల్లిపుత్తూరులో జన్మించి అక్కడి వటపత్రశాయిని కోలిచింది, శ్రీరంగనాథున్ని చేరింది, సుందరబాహు స్వామికి మొక్కుబడి చేసింది, వేంకటాచలపతిని ఆరాధించింది. అంతా విగ్రహరూపంలో ఉన్నవారినే కొలిచింది, భగవంతునికోసం ఎక్కడికని పరుగులు పెట్టలా! విగ్రహ రూపాన్నే పరిపూర్ణంగా నమ్మింది. మనకూ ఆ విశ్వాసపూర్ణత కలగాలి. తాను ఆర్జించినది మనమూ పొందాలని తిరుప్పావైని మనకు అందించింది. "తూయోమాయ్ వందు" దీనికి మనం పరిశుద్దం కావాలి. అది ఎలా అంటే భగవంతుని తత్వాన్ని గుర్తిస్తే మానసిక పరిశుద్ది ఏర్పడుతుంది. "నాం తూమలర్ తూవి త్తొళుదు" పరిశుద్దమైన హృదయం అనే పుష్పాన్ని ఆయనపై విసిరితే చాలు. చేతులు ఒక్కసారి జోడిస్తే చాలు. ఇలా చేతులు జోడించటాన్ని అంజలి అంటారు. అన్-జలయతి అంటే ఆయనను జలంలా కరిగేట్టు చేస్తుంది. "వాయినాల్ పాడి" నోరు ఉంది కనక ఆయన నామాన్ని పాడుదాం చాలు. "మనత్తినాల్ శిదిక్క" మనస్సు ఉంది కనక ఆయన గుణములని స్మరించుదాం. "పోయ పిళైయుం" మనం గతంలో చేసిన సంచితములైన పాపాలన్నీ పోతాయి "పుగుదురువాన్ రిన్ఱనవుమ్" ఇక రాబోయే ఆగామి "తీయనిల్ తూశగుం" మనకు అంటకుండా ఉంటుంది "శేప్ప్" ఆయన నామాల్ని చెప్పు. ఈ పాటలో ఆండాళ్ మాయానై, మన్నువడ మదురై, దామోదర అని ఇలా కొన్ని నామాల్ని తెలిపింది.

ఆగమములు చెప్పినదేమిటి

పూర్ణమిదం పూర్ణ మద: పూర్ణాత్ పూర్ణముదచ్యతే|
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ||

ఇది శుక్లయజుర్వేద శాంతి మంత్రం. అదేం తెలుపుతుందో తెలుసుకుందాం. పూర్ణం అనగానే ముందుగా మనకు దేనితో నిండి ఉన్నదని ప్రశ్న వస్తుంది. పూర్ణం అనగా అన్నీ నిండుగా కలదని అర్థం. అంటే స్వరూపం, గుణం, దయ ఇత్యాదులు అన్నీ నిండుగా కలది అనవచ్చు. మరి ఏమిటా పూర్ణం, ఎక్కడ లభిస్తుంది? ఈ మంత్రం దానికి సమాధానం ఇస్తుంది. "పూర్ణమిదమ్" - ఇదం అంటే చాలా దగ్గరగా ఉంటుంది, నీ లోపలనే. దీన్నే మనం అంతర్యామి స్వరూపం అంటాం. కాని మనకు తెలియట్లేదు కదా!. "పూర్ణ మద:" - అద: అంటే అంతటా వ్యాపించి ఉంది. అదీ పూర్ణమే. లాభం లేదు గుర్తించటం కష్టం. మరి ఏం చేస్తుంది ఈ పూర్ణం. "పూర్ణాత్ పూర్ణముదచ్యతే" - ఆ పూర్ణమే ఒక చోటకు చేరి ఉంటుంది - అదీ పూర్ణమే. సృష్టి, స్తితి, లయ కార్యాలు చేయటానికి వ్యూహ స్తానంలో ఉంటుంది. అదీ పూర్ణ రూపమే, కాని మనం చూడలేం కదా. "పూర్ణస్య పూర్ణమాదాయ" ఆయా అవసరాలను బట్టి ఆపూర్ణంలో నుంచి మరో పూర్ణం మన వద్దకు దిగి వస్తుంది - అదీ పూర్ణమే. వీటినే అవతరాలు అంటారు. ఇవి కాలానుగుణం బట్టి వచ్చేవికదా మనం ఇప్పుడు చూడలేం కదా, ఎలాగా? "పూర్ణమేవా వశిష్యతే" - ఆయా అవతారాలలో వచ్చినప్పుడు ఆయా గూణాలను బట్టి మనం ఏర్పాటుచేసుకొన్న విగ్రహం కూడా ఒక పూర్ణమే. అందుకే మనం ఆరాధించే విగ్రహం ఒక సంపూర్ణమైనదే అని ఒక విశ్వాసం ఏర్పడాలి.

ఈ స్వరూపాలన్నన్నింటినీ ఆండాళ్ తల్లి ఒక్కోక్క పాటగా మనకు అందించింది. అందుకే తిరుప్పావైని వేదాల సారం అంటారు

Tiruppavai - తిరుప్పావై 4వ రోజు పాశురము





తిరుప్పావై 4వ రోజు పాశురము



ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్ ||


మనిషిని మనిషిగా తీర్చిదిద్దే వ్రతం ఇది. మానవజన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కల్గితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి. దేవతలంతా సహకరిస్తారు. మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్య తత్వాన్ని నారాయణ ఆని అంటారు. ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీ శుకుడు ఇట్లా అంతటా దైవన్ని దర్షించుకొనేవాడట. దేనిపై పెద్దగా వ్యామొహం లేనివాడవటంచే అలా వెల్లి పోతుంటే, పుత్రవ్యామోహంచే వేదవ్యాసుడు అతని వెంట పరుగెత్తేవాడట. పుత్రా అని తన పిలుపులకు ఆయన స్పందించకపోయే సరికి చెట్లు,పక్షులు ఓయ్ అని పలికేవట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే శ్రీ శుకునిలో ఉన్న తత్వమే అన్నిటిలోనూ ఉందికనకనే అలా స్పందించాయి. ప్రతి వస్తువులోను అది ఉండి నిలబెడుతుంది. దాన్ని మనం చూడగలగాలి, కాని కంటికి కనబడదు. కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి.

ఆండాళ్ తల్లి మనిషిలోని మంచి తనాన్ని మేల్కొల్పటానికి ధనుర్మాస వ్రతం చేసింది, మనల్ని అట్లానే ఆచరించమంది. అందరితో కలిసి ఆచరించాలి అని చెప్పింది. అందరితో కలిసి చేస్తేనే అనుభవ యోగ్యం అవుతుంది. అందరికి సాముహికంగా క్షేమం కల్గాలని మనం చేస్తున్నాం, అలాంటి వాన్ని ముముక్షువు అంటారు. మనం ఒక ముముక్షువుగా బ్రతక గలగాలి. తత్వన్ని అంతటా చూడగలగాలి. తీపికి రుపం ఎమిటి? వివిద పదార్థాలలోనే చూడగలం. అలాగే పరమాత్మ తత్వాన్ని మనం కంటితో చూడలేము కనక, మనవంటి వారికి ఇష్టమయ్యే మనవంటి రూపాన్నే ధరించి మన ఆరాధనలు అందుకోవటానికి చేరుతుంది ఆ బ్రహ్మ తత్వం. కాని అది మాత్రమే ఆయన రూపం కాదు.
సామాన్యంగా భగవంతుడు తన పరివారం అందరితో కల్సి ఉంటాడు, లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోజనం కోసం వివిద దేవతలను ఆశ్రయిస్తారు. కాని ఒక్కరిని ఆరాధించి సఖల ఫలితాలు పొందాలంటే ఏదైన సాధన ఉందా అంటే- అది నారాయణుని ఆశ్రయం తప్ప ఏది లేదు ఎందుకంటే సఖలఫలప్రదాహి విష్ణు: అనేది మనకు ఋషివాక్కు. మిగతావారంతా "ఏకైక లాభాయ:" కాని "సర్వ లాభాయ కేశవ" అంటారు. ఒక్క పరమాత్మను మనం ప్రసన్నం చేసుకొంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు.
అందరూ భయపడే యముడు చెప్పినమాటలు ఏమిటంటే, విష్ణుభక్తుల జోలికి తన దూతలను వెల్లవద్దని. భగవత్ ప్రేమ కల్గి విష్ణువుకే అంకితమయ్యే వాల్లంటే యముడు కూడా భయపడుతుంటాడు. నారాయణ స్మరణ చేయటంచే యమదూతలు అజామయున్ని వదిలివెళ్ళతారు. విష్ణుదూతలు అతన్ని తీసుకుపోతారు. భారతంలో అజామయుడి సన్నివేషంలో ఇది చెప్పబడి ఉంది. అలాగే ఏ దేవతను కొలిచినా, ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చేది నేనేనయా అని భగవద్గీత ఏడవ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఒక్క శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకొంటే మిగతాదేవతలు తామంతట తామే సహకరిస్తారు.

అలా వచ్చిన దేవతల్లో ముఖ్యుడైన వర్ష దేవునికి ఆండాళ్ చేసిన విన్నపం ఇలా ఉంది. ఆళి మళైక్కణ్ణా! - సముద్రంలో నుండి నీళ్లను గ్రహించి నిర్వహించేవాడా - వానదేవా - పర్జన్యా. ఒన్ఱు నీ కై కరవేల్ - ఏ మాత్రం నీవు చేయి దాచుకోవద్దు - ఉదారంగా ఇవ్వు, ఆళి ఉళ్ పుక్కు - సముద్రం అట్టడుగు లోపలి దాకా వెల్లి, ముగందు కొడార్ త్తేఱి - పీల్చుకో, ముందు నీవు తృప్తిగా కడుపు నింపుకోని చాలా ఎత్తుకు వెల్లాలి. ఊళి ముదల్వన్ - సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలికాంతి తరంగాలు కల్గి ఉంటాడో, ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు - అట్లాగే నీ ఆకారాన్ని సరిదిద్దుకో, పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్ ఆళిపొల్ మిన్ని - బీటలువారి ఉన్న ఈ భూమికి ఒక్క సారిగా కురవకూడదు, మొదటగా మెరవవలె, తర్వాత ఉరమవలె, తరువాత కురవవలె. ఆ మెరవడం ఎట్లాఅంటే సుదర్షణ చక్రం మెరుస్తున్నట్లుగా ఉండాలి. వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు - ఎట్లా ఉరమాలి అంటే శ్రీపాంచజన్యంలా - శంఖం ద్వనిలా ఉరుమవలె. ఆద్వని ద్వారా భగవంతున్ని ద్వేషించేవాళ్లు కూడా భక్తులుగా మారేట్లుగా ఉండాలి. తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్ వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ - ఇక కురవడం స్వామి వేసే బాణాలవలె కురవాలి, అందరు సుఖించెందుకు వర్షించు. ఆంగళుం మార్గళి నీరాడ మగిళుంద్ - మార్గశీర్ష స్నానం కోసం మాకు సరిపడేంత నీరు ఉండేలా వర్షించు.


Monday 18 December 2017

Tiruppavai - తిరుప్పావై 3వ రోజు పాశురము





తిరుప్పావై 3వ రోజు పాశురము

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్
విభవం(అవతారములు)

ఈ రోజు ఆండాళ్ తల్లి అవతారముగా వచ్చిన వామనమూర్తిని కొలిచింది. పాల్కడలిలోకి దిగివచ్చిన నారాయణ తత్వం మనకోసం ఒక సారి చేప లాగా, ఒకసారి తాబేలు లాగా, ఒక సారి వరాహముగ, మరోకసారి ఇటు మనిషి కాని అటు మృగము కాని వాడిలా, ఒక సారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మనవద్దకు వస్తాడు.
"ఓంగి" పెరిగెను "ఉలగళంద" కొలిచెను "ఉత్తమన్ పేర్ పాడి" పరమాత్మ నామాన్నే పాడుదాం. నామమే చాలా గొప్పది, భగవంతుడు ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణం లాంటిది. అయన నామంకు ఒంగి ఉంటాడు. ఎవరి నామాన్ని పాడితే ప్రాచీన పాపరాశి అంతా కొట్టుకు పోతుందో, మంచి నడవడిక ఏర్పడుతుందో, నాలుక ఉన్నందుకు సార్తకత ఏర్పడుతుందో ఆయన నామాన్ని పాడుదాం. సౌదర్యం, సౌశీల్యం, సౌలభ్యం అన్ని గుణాలు కల్గిన వామన మూర్తిని అమ్మ ఊహించింది.
ఒక్కసారిగా పెరిగి ఆయన లోకాలను కొలిచాడు, ఆపెరగటం కూడా భలి చక్రవర్తి ఒకపాదాన్ని కడిగిన నీరు, బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగిన రెండో పాదం నీరు ఒకే సారి భూమిని చేరాయట. మరీ ఇంత త్వరగా ఎలా పెరగాడు! ఆయన పెరగలేదు ఆయన అంతటా వ్యాపించి ఉంటాడుకదా ఒక్కసారిగా ఆయన వ్యాప్తిని చూపించాడు. పెరగటం తరగటం మనం చేసేవి మన కర్మల వల్ల, మన సంస్కారాల వల్ల. మరి జన్మ కర్మలు లేనివాడు ఆయన, ఇది మన కోసం చేస్తాడు. ఇవన్నీ ఆయన ప్రేమ కోసం చేస్తాడు. మూడో కాలు భలి తలపై పెట్టాడు, బలిఅహం కాస్తా దాసోహంగా మారింది. రసాతలం భలికి ఇచ్చినాడు. మొదటి రోజు ఆండాళ్ తల్లి మనకు నారాయణ తత్వం గురించి చెప్పింది, రెండో రోజు ఆ తత్వం మనల్ని రక్షించేందుకు ఆయన పాల్కడలిలో ఎలా ఉంటాడో చెప్పింది, ఈరోజు ఆయన మనల్ని ఉద్దరించేందుకు ఎలా అవతారంగా వచ్చాడో తెలుపుతుంది.

వ్రత ఫలితములు

ఈరోజు చాలా ప్రధానమైన రోజు, ఆండాళ్ తల్లి ఈవ్రతం చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పినరోజు. పెద్దలు మనల్ని అశిర్వదించాలంటే ఈ పాటను పాడి మనల్ని ఆశీర్వదిస్తారు. మనషికి మంచి భవనాలు ఉంటే సుఖమా! లేక యంత్రాలు,వాహనాలు ఉంటే సుఖమా! లేక సమాజంలోని వ్యక్తులందరికి అవసరమయ్యే కనీస అవసరాలు ఉంటే సుఖమా! మనిషికి ఉండటానికి నీడ అవసరం - అది ప్రశాంతంగా ఉండాలి, తినడానికి ఆహారం అవసరం అది పుష్టిగా ఉండాలి, త్రాగటానికి జలం అవసరం - అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ కనీస అవసరాలు అందించే వ్యవస్త కావాలి. ఈతి బాధలు ఉండకూడదు, దొంగలూ ఉండకూడదు, రోగాలు ఉండకూడదు.
మనం చేసే కార్యాలు ఎలా ఉండాలంటే దృష్ట-అదృష్ట రెండూ ప్రయోజనాలను కల్గించేలా ఉండాలి. మనం చేసే చిన్న చిన్న యజ్ఞాలకే స్వర్గాది ఫలాలు వస్తాయి అంటారే అది అదృష్ట ఫలం, దృష్ట ఫలంగా ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించే డబ్బు, మంచి సంతానం, భవనాలు, దీర్ఘ ఆయిస్సు, మంచి ఆరోగ్యం ఇవన్నీ లభిస్తాయి అంటారు. మరి మనం చేసే ధనుర్మాస వ్రతం దేవాదిదేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమత్మకోసం చేసేది కావటంచే మనకు లభించేది తిరిగి మనం ఈ కర్మకూపంలోకి చేరక్కరలేకుండా తరించే వీలయ్యే ఉత్తమస్థానం మనకు తప్పక లభిస్తుంది. ఒక్కసారి ధనుర్మాస వ్రతం చేస్తే మనకు ఆయన దగ్గర స్థానం లభించక మానదు. అక్కడికి వెల్లేముందు మనకు లభించే ఫలితాలు ఈరోజు ఆండాళ్ తల్లి వివరిస్తుంది.

ఈ వ్రత గొప్పతనం అలాంటిది, ఈ వ్రత ఫలితం ఇచ్చే శ్రీకృష్ణుడి గొప్పతనం అలాంటిది,ఈ వ్రతంలో మనం వాడే మంత్రం ప్రభావం అలాంటిది, ఈ వ్రతం ఆచరించిన గోపికల గొప్పతనం అలాంటిది, ఆ వ్రతాన్ని మనకు పాడి ఇచ్చిన ఆండళ్ అమ్మ తల్లి వైభవం అట్లాంటిది. మనకు కావల్సింది కేవలం పరిపూర్ణమైన విశ్వాసం ఒకటి ఏర్పడాలి. సఖల దేవతలు శ్రీకృష్ణపరమాత్మ రూపంలో ఒదిగి ఉంటారు కదా! ఆయన అనుగ్రహిస్తే అందరూ అనుగ్రహించినట్లే కదా! ఆయనను తెలిపే నారాయణ మంత్రం ఒక్కటి అనుష్టిస్తే మిగతా మంత్రాలన్నీ అనుష్టిస్తే వచ్చే ఫలం లభించదా!.
ఇక్కడ మనం మహాభారతంలో ఒక సన్నివేషం గుర్తుచేసుకుందాం. అజ్ఞాతవాసంలో పాండవుల గుట్టు రట్టు చేయటానికి ధుర్యోధనుడు తన గూడాచారులను పంపాడు, వారికి ఎక్కడ కనబడలేదు. ఇంత పరాక్రమమైన వాల్లు దాగి ఉండటం చాల వింతయే కదా! దానికి భీష్మ పితామహుడు వారితో పాండవులను వెతకటం అట్లాకాదయా, వారు ఒక్కొక్కరూ నారాయణ మహామంత్రం ఉపాసన చేసిన మహనీయులు, కనక వారు ఉన్నదగ్గర వానలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, రోగాలు ఉండవు, దొంగల భాద ఉండదు, ఇప్పుడు వెతకండి అని రహస్యాన్ని చెప్పాడు. అప్పుడు వారికి విరాట్ నగరం సిరిసంపదలతో కనబడింది, అందుకే ఉత్తరగోగ్రహణం చేసారు. తరువాత కథ మనకు తెలుసు, ఇక్కడ మనకు కథ కాదు ప్రధానం. మనం నారాయణ మహామంత్ర గొప్పతనం గమనించాలి.
"నాంగళ్" ఏం కోరిక లేని "నం పావైక్కు" లోకం మొత్తం సుఖించాలని ఆచరించేది "చ్చాత్తి నీర్ ఆడినాల్" వ్రతం అని వంక పెట్టుకొని స్నానం చేసినా చాలు, వ్రతం చేసినట్లే. మన కోరేది శ్రీకృష్ణ పాద సేవయే కదా! మరి లోకం మొత్తం ఎలా ఫలితం వస్తుంది, ఎలా అంటే శ్రీకృష్ణుడు మూలం కదా, వేరుకు నీరు పోస్తే చెట్టు ఎలా వికసిస్తుందో అలాగే.
"తీంగిన్ఱి నాడేల్లామ్" బాధలు వుండవు " తింగళ్ ముమ్మారి పెయ్దు" నెలకు మూడు సార్లు వర్షాలు కురుస్తాయి-పంటలు బాగాపండుతాయి. "ఓంగు పెఱుం జెన్నెల్" కలువ తామరలు ఏపుగా పెరిగుతాయి "ఊడు కయల్ ఉగళ" ఆ నీటిలో భలమైన చేపలు తిరుగుతింటాయి. "పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప" అందమైన పుష్పాలు పూస్తాయి, వాటిలో తుమ్మెదలు తేనెను ఆస్వాదించి మత్తుతో నిద్రపోతున్నాయి. "తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్" పశువులు ఇచ్చేపాలు పాత్రను దాటి పొంగేంత చక్కని పాడి ఉంటుంది. "నీంగాద శెల్వం నిఱైంద్" కావల్సిన ధనం, సంపదలు చేకూరుతాయు.

Sunday 17 December 2017

Tiruppavai - తిరుప్పావై 2వ రోజు పాశురము





వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్ ||

వ్రతనియమాలు

మనిషి బాగుపడడానికి ఎన్నో మార్గలు. శాస్త్రాలు అవి కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తియోగమని ఇలా ఎన్నో చెప్పబడి యున్నాయి. భగవంతుడే ఒక మార్గమని తీసుకుంటే వారు మార్గశిర్షంలో పయనిస్తారు అని అంటారు. మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు. తల్లి అండలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపచేస్తాడు పరమాత్మ, కాని అలా జరగటానికి మన అంగీకారం కావాలి. మనలోని జ్ఞానం ద్వారా మనం నీవాడను నేను అని ఆయనకు చెప్పాలి. మరి అలాంటి మార్గంలో పయనించటానికి మనం ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి తెలియజేసింది ఈ ధనుర్మాస వ్రతంలో. ఏమి చేయాలో ఏమి అవసరం లేదో చెబుతోంది ఈ పాటలో.

భగవంతుణ్ణి భగవన్మయుడని, పరమాత్మ అని, గోవింద అని ఇలా ఎన్నో పేర్లతో చెబుతారు. మనకు కనిపించే వివిద రూపాల్లో ఉంటాడు కాబట్టి భగవన్మయుడని అంటారు. "అణు" అతి చిన్నరూపం నుండి "బృహత్" అతి పెద్ద స్వరూపంగా ఉంటాడు కాబట్టి పరమాత్మనే అని అంటారు. "శబ్ద సహ" అతి సామన్యుడు పిలిస్తే అందుతాడు, "శబ్దాతిగ" చతుర్ముఖ బ్రహ్మకూడా కీర్తించ చేతకానివాడు, అందుకే ఆయనను గోవింద అని అంటారు. మరి జగత్తు మొత్తం పరమాత్మ శరీరం కదా! మరి ఇక్కడ తగినవి- తగనివి అంటూ ఉంటాయా!!
ప్రకృతి స్వభావాన్ని బట్టి, ఆయా గుణాలను బట్టి సత్వం, రజస్సు మరియూ తమస్సు అనే గుణాలు ఉంటాయని గమనించాలి. సత్వం జ్ఞానాన్ని, రజస్సు కోపాన్ని, తమస్సు అజ్ఞానాన్ని, బద్దకాన్ని ఇస్తాయి. మరి శరీరం ఈ పంచభూతాలతో తయారైనదే కదా, కాబట్టి ప్రకృతిలో ఉండే ఈ గుణాలు మనలో కూడా ఉంటాయి. కాని ఏదో ఒక గుణం పైన ఉండి నడిపిస్తుంది. సత్వం పెరిగితే మంచిది. ఇలా చెప్పటానికి మన చేతిలోని చూపుడు వేలును మనతో పోలుస్తారు, బ్రోటన వేలును పరమాత్మతో పోలుస్తారు. ఇక తమస్సు, రజస్సు, సత్వ గుణాలను మిగతామూడు వెల్లతోపోల్చుతారు. ఈ మూడు గుణాలతో కలిసి ఉన్న చూపుడు వేలుని బ్రోటనవేలితో కలిపే దాన్ని జ్ఞాన ముద్ర అంటారు. చిటికెన వేలు సత్వం కొద్దిగానే ఉంటుంది, రజస్సు-తమస్సు ఎక్కువగా ఉంటాయి. మరి బాగు పడటానికి సత్వం కావాలి, కొన్ని నియమాల్ని పాటించాలి. నియమాలు మరి ప్రకృతిలోని గుణాలకోసమే కాక, మనల్ని ఆదర్షంగా తీసుకొనేవారు బాగు పడటానికి కూడా మనం పాటించాల్సి వస్తుంది. ఈ కృత్యా- అకృత్య వియోచనాలను మన ఆండాళ్ తల్లి ఈ పాటలో తెలియజేస్తుంది.

"వైయత్తు వాళ్ వీర్గాళ్!" ఈ భూమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది. ఈ భూమి తామస గుణమిచ్చేది, ఇక్కడ ఉండగా సాత్వికగుణం కలగటం కుంపెటలో తామరపువ్వు పూసినట్లు అంటారు. చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతునితో చెప్పుతుంది రామాయణంలో. రావణ వధ అనంతరం సీతను తీసుకుపోవటానికి వచ్చిన హనుమ సీతాదేవితో, నువ్వు ఆజ్ఞ యివ్వు నిన్ను పీడించే ఈ రాక్షసమూకను ఒక్కసారి పని పడతాని అంటాడు, దానికి సీత ఇది వారి తప్పు కాదయా, వారు రావణుని అండలో ఉన్నారు, ఈ భూమిమీద ఉండగా తప్పు చేయడం సహజమేకదా, చివరికి చూసిరమ్మని చెబితే కాల్చివెల్లలేదా నీవు. దానికి హనుమ మరి నేనంటే ఏమో, కాని శ్రీరామచంద్రుడు కూడా తప్పు చేసినాడా అమ్మ అని అడిగాడు. సూర్పణక వచ్చినప్పుడు ఆమెతో రాముడు నేను ఏక పత్నివ్రతుడను అనిమాత్రం చెప్పక, తన తమ్ముడికేసి ఎందుకు చూపించాడు. ఇవ్వన్నీ కదా ఇన్ని అపచారాలకు దారి తీసింది అని హనుమంతుడితో చెప్పుతుంది.

"నాముం నం పావైక్కు" ఒకరిని కష్టపెట్టే వ్రతం కాదు, లోకులు వ్రతాలు వారి వారి సుఖాలకోసం చేస్తే ఈ వ్రతం లోకం అందరికోసం చేసేది. "శెయ్యుం కిరిశైగళ్ కేళీరో" మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి, "పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి" పాలకడలిలోని సుకుమారంగా పవళించి ఉన్న వైకుంఠనాథుని పాదాలను పాడదాం. ఆయనను మించినవారు ఇంకెవరూలేరు కాబట్టి "పరమన్" అని అంటారు. ఎందుకంటే మనల్ని కాపాడటానికి తాను మొదటగా పాదం వేసినది పాలకడలిలోనే కదా! ఆయన పాదాలలో శంఖ, రథాంగ, కల్పక, ద్వజా, అరవింద, వజ్రా, అంకుష ఇత్యాదులు గుర్తులుగా చేసుకొని ఉన్న ఆపాదాన్ని పాడుదాం. ఎలాగైతే శిశువు తల్లి స్తన్యాన్ని గుర్తిస్తాడో, భక్తుడు భగవంతుని పాదాలను గుర్తించగలిగి ఉండాలి. సుకుమారమైన నిద్ర అంటే లోక రక్షణకోసం తానుచేసే సాత్విక-యోగనిద్ర. మనకోసం ఇంకా ఏమి చేస్తే బాగుపడతాం అని ఏర్పాటు చేసుకొన్న స్థానం పాలకడలి.

వ్యుహం-పాలకడలి

నిన్నటి నాడు నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇన్ని గుణాలు కల్గి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం, ఒక భూమి మీద నివసిస్తునాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేసారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్నవిత్తనం నుండి ఒకపెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఎర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది.
ఇవన్ని ఏవి లేనప్పుడు పరమాత్మ, ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్నరూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు, కర్మభారాలు మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరినేను వీళ్ళకు ఉపకారం చేయకుంటే ఎలా! కర్మ తొలగాలంటే దేహం కావాలి, దేహం ఉండే నేల కావాలి, దాన్ని భోగ స్థానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావలి వాటినే భోగ్య ఉపకరణములు అంటారు. ఇన్నింటిని తయారు చేనినవాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకొన్న స్థానాన్నే వ్యూహం అంటారు.

అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ద, ప్రత్ర్యుమ్న, సంకర్షన అనే నాలుగు పేర్లతో ఉంటాడు. సృష్టి, స్థితి, లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు, ఆ స్థానాన్నే పాల్కడలి అని కూడా అంటారు.
ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం. అక్కడ వాసుదేవ అనేరూపంతో సర్వం తన ఆదీనంలో పెట్టుకుంటాడు. అందులోంచి ఒక రూపం తీస్తాడు దానికి సంకర్షణ అని పేరు, ఇది ప్రళయం చేయటానికి శివునిలో తానుండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు, దానికి అనిరుద్ద అని పేరు సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు, దానికి ప్రత్యుమ్న అని పేరు సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇది ఇంద్రునిలో ఉండి చేస్తాడు. అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు, ఆదిశేశువుపైన ఆయన ఉంటాడు. ఆర్తితో పిలిచేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడినుండి లోకరక్షణకై అవతారాలను పంపిస్తుంటాడు. అన్ని అవతారాలకు మూలస్థానం పాల్కడలియే. ఆయా అవతారల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతాడు. అందుకే అవతారాలను విభవములు అంటారు.


ఆయన పాదలను పాడుదాం. కడుపు నిండి పోతుంది - ఇక "నెయ్యుణ్ణోం పాలుణ్ణోమ్" నెయ్యి వద్దు పాలు వద్దు. "నాట్కాలే నీరాడి" తెల తెల వారు జామున లేచి స్నానం చేద్దాం. "మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్" కాటుక, పూలు ధరించం, ఏవి విలాసాలో అవి వదిలేస్తాం. "శెయ్యాదన శెయ్యోమ్" మాపూర్వులు చెయ్యనివి ఏమి చెయ్యం - ప్రాచీణ ఆచారాలు మానెయ్యం "తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్" పుళ్ళవిరుపు మాటలు మాట్లాడం. "ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి" చేతనైనంత వరకు ధాన ధర్మం చేస్తాం. "ఉయ్యుమాఱెణ్ణి ఉగంద్" ఇవన్ని ఆనందంతో చేస్తాం.



Tiruppavai - తిరుప్పావై 1వ రోజు - భగవంతుని మొదటి స్థానం నారాయణతత్వం


Tiruppavai Vratham - Margali Masam - All Pasurams explanation by Sri Pujya Guru Brahmasri Chaganti Koteswara Rao Gari - Discourses - Telugu 







తిరుప్పావై 1వ రోజు - భగవంతుని మొదటి స్థానం నారాయణతత్వం

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
నారాయణ మంత్ర ఉపదేశంతో వ్రత ప్రారంభం

"మార్గళి త్తింగళ్" మార్గశిర్షం మంచి మాసం, ఫలమును నిచ్చే మాసం. అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే, అది దేవతలకు ఒక రోజు అంటారు. దక్షినాయిణం వారికి రాత్రి అయితే ఉత్తరాయిణం పగలు. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షినాయిణం నుండి ఉత్తరాయిణంకు మారుతాడు, అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం వారికి తెల తెల వారే సమయం. సత్వాన్ని పెంచేకాలం. కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈమాసాన్ని వినియోగించుకోవాలి. "మది నిఱైంద నన్నాళాల్" చంద్ర కాంతి మంచిగా ఉండే కాలం, చంద్రుడు పెరిగే కాలం కబట్టి మనం మంచిరోజులుగా భావిస్తాం. "నీరాడ ప్పోదువీర్ పోదుమినో" స్నానం చేయటానికి వెల్దాం! ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగివేసుకొనే స్నానం. "నేరిళైయీర్" భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయటానికి యోగ్యులమే.
"శీర్ మల్గుం ఆయ్ ప్పాడి" పంటలు బాగా పండే ఆ నందగోకులంలోని "చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్" సంపన్నులైన గోప పిల్లల్లా, మనమూ అవ్వాలి శ్రీకృష్ణ ప్రేమ కోసం. ఏ భయమూ అవసరం లేదు. "కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్" పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మన వద్దకు వచ్చాడు కదా పరమాత్మ, ఏ అసురుల భారినుండి శ్రీకృష్ణునికి ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడు పట్టుకొని కాపాడుతూ ఉన్నాడు ఒక ఆచార్యునివలె. మరి నందగోపుడు మనవాడే కదా! "ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం" మరి ఆయనేమో తన చేష్టలతో యశోదమ్మ కళ్ళు అనందించి పెద్దగా అయ్యేట్టు చేస్తూ ఆమె ఒడిలో చిన్న సింహంపిల్లలా పెరుగుతున్నాడు. "కార్మేని" నల్లని మేఘంలాంటి ధివ్య కాంతులతో, అంతం లేని గుణాలు కల్గి, "చ్చెంగణ్ " వాత్సల్యం కల్గినవాడు. "కదిర్మదియం పోల్ ముగత్తాన్" చంద్ర సూర్యుల వంటి ముఖం కల్గినవాడు. మిత్రులతో ప్రేమగా శత్రువులతో కోపం కల్గినవాడు. "నారాయణనే నమక్కే పఱైతరువాన్" నారాయణ అనే మంత్రం ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తుంది గోదా "పారోర్ పుగళప్పడింద్" ఫలం సాక్షాత్తు పరమాత్మే, ఈ లోకంలోని వారందరికీ అందజేస్తుంది అమ్మ గోదా.
నారాయణ మంత్రం
ఈ వ్రతంలో మనం భగవంతున్ని ఎట్లాచూస్తామో వివరిస్తుంది. భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించం. భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి. ఆకాశానికి అంతం లేనట్టుగా, సాగరంలో జలానికి అంతంలేనట్టుగా, మన జన్మలకీ కర్మలకీ అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణగుణాలకు కూడా అంతం లేదు. కేవలం ఆయన గుణాలకేకాదు ఆయన స్వరూపానికి కూడా అంతం లేదు కాబట్టే ఆయనను సర్వవ్యాపి అంటారు. ఇందుగలడని అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా, అంతటా వ్యాపించి ఉండటం భగవంతుని గొప్పతనం.
ఆ వ్యాపనశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి "విష్ణు", "వాసుదేవ" మరియూ "నారాయణ". విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం. వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు-ప్రకాశిస్తాడు అని అర్థం. ఈ రెండు మంత్రాల్లో కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి కాని ఎలావ్యాపించి ఉంటాడు, ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనక ఆ మంత్రాలకు కొంచెం లోపం ఉంది అంటారు. కాని నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది, వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది, ఎందుకు వ్యాపించి ఉంటాడని వివరిస్తుంది. ఎందెందులో వ్యాపించి ఉంటాడని తెలియజేస్తుంది, ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది.
నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం, నారములు అంటే సఖల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం. సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం, విడ దీస్తే ఉత్తర-అయణం అంటాం. నారాయణ శబ్దంలోని అయణ అనే పదాని అర్థం ఆధారం. ఈ సఖల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు, లోపల-బయట వ్యాపించి ఉంటాడని తెలియజేసేది నారాయణ మంత్రం. ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రిహి సమాసాలు. తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు, ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. మరి బహువ్రిహి సమాసం తానీ నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది. అర్థాత్ ఆయన లోపల మరియూ బయట వ్యాపించి ఉంటాడని. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి, చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు, పైన కూదా ఉంటాడు కనక అయన పరుడు- అందుచే పరత్వం సౌలబ్యం లాంటి గుణాలు కల్గినవాడు. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను జ్ఞానం కల్గి ఉంటాడు. చేయిజాస్తే అందేవాడు, వారిలోని దోషాలను ఎలా దూరంచేయాలో తెలిసినవాడు, దోషాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కల్గినవాడు. దోషాలను తొలగించే శక్తి కూడా ఉంది. అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది, సౌశీల్యం ఉంది, వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది, వీటి యొగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది, తను ఇలాచేస్తానంటె ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది, ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది.
అన్ని గూణాలు కల్గి ఉన్న ఈ మంత్రాన్ని మన ఆండాళ్ తల్లి మనకు ఊపాస్యమంత్రంగా అందించింది.
ఈ పాటలో ఆత్మ ఉజ్జీవనానికి చేయాల్సిన కార్యక్రమం ఏమిటో తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, శారీరక సుఖాలు ఏకాంతంలో అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు. ఆండాళ్ తల్లి అందరితో కలిసి, నారాయణ మంత్రంతో ముందుకు వెళ్ళుదాం అంటోంది, దీనికి యోగ్యత కేవలం కోరిక మాత్రం చాలు అని ధైర్యం చెబుతోంది.