Search This Blog

Friday 24 February 2017

RUDRA NAMAKA STOTRAM - రుద్రనమక స్తోత్రం


RUDRA NAMAKA STOTRAM - రుద్రనమక స్తోత్రం:


ఇది సాక్షాత్తు డుంఠి వినాయకుడు కాశీ విశ్వనాథుని దర్శించి చేసిన స్తోత్రంగా శివరహస్యం పేర్కొన్నది.
ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రం ఇది.
ధ్యానమ్:

ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర

జ్జ్యోతిఃస్ఫాటిక లింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః!

అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్

ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్ఛివమ్!!

బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజన్గైః

కంఠే కాలాః కపర్దా కలిత శశికలాశ్చండ కోదండ హస్తాః

త్ర్యక్షా రుద్రాక్షమాలా స్సులలితవపుష శ్శాంభవామూర్తి భేదా

రుద్రాశ్శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్!!

ఇత్యుక్త్వా సత్వరం సాంబం స్మృత్వా శంకరపాదుకే

ధ్యాత్వా యయౌ గణాధీశః శివసన్నిధి మాదరాత్!

తతః ప్రణమ్య బహుధా కృతాంజలి పుటః ప్రభుః

శంభుం స్తోతుం మతిం చక్రే సర్వాభీష్ట ప్రదాయకమ్!!

గణేశ ఉవాచ:

నమస్తే దేవ దేవాయ నమస్తే రుద్ర మన్యవే!
నమస్తే చంద్రచూడాయా ప్యుతోత ఇషవే నమః!!1!!

నమస్తే పార్వతీ కాంతా యైక రూపాయ ధన్వనే!
నమస్తే భగవన్ శంభో బాహుభ్యాముత తే నమః!!2!!

ఇషుః శివతమా యా తే తయా మృడయ రుద్రమామ్!
శివం ధనుర్యద్బభూవ తేనాపి మృడయాధునా!!3!!

శరవ్యా యా శివతమా తయాపి మృడయ ప్రభో!
యా తే రుద్రశివా నిత్యం సర్వంగలసాధనమ్!!4!!

తయాభిచాకశీహి త్వం తనువా మా ముమాపతే!
ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశినీ!!5!!

యా తయా మృడయ స్వామిన్ సదా శంతమయా ప్రభో!
గిరిశంత మహారుద్ర హస్తే యా మిషు మస్తవే!!6!!

బిభర్షి తాం గిరిత్రాద్య శివాం కురు శివాపతే!
శివేన వచసా రుద్ర నిత్యం వాచా వదామసి!!7!!

త్వద్భక్తి పరిపూతాంగం మహింసీః పురుషం జగత్!
యచ్చ శర్వ జగత్సర్వ మయక్ష్మం సుమనా అసత్!!8!!

యథాతథావమాం రుద్ర తదన్యధాపి మే ప్రభో!
రుద్ర త్వమ్ ప్రథమో దైవ్యో భిషక్ పాపవినాశకః!!9!!

అధివక్తా ధ్యవోచ న్మాం భావలింగార్చకం ముదా!
అహీన్ సర్వాన్ యాతు ధాన్యః సర్వా అప్యద్య జంభయన్!!10!!

అసౌ తామ్రోరుణో బభ్రుః నీలగ్రీవ స్సుమంగళః!
విలోహితో స్త్వయం శంభో త్వదధిష్ఠాన ఏవహి!!11!!

నమో నమస్తే భగవన్ నీలగ్రీవ మీఢుషే!

సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానంద మూర్తయే!!12!!

ఉభయోగార్త్ని యోర్జ్యా యా ధన్వన స్తాం ప్రముంచతామ్!

సంప్రాప్య ధనురన్యేషాం భయాయ ప్రభవిష్యతి!!13!!

అస్మద్భయ వినాశార్థ మధునాభయద ప్రభో!

యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వాప!!14!!

అవతత్య ధనుశ్చత్వం సహస్రాక్ష శతేషుధే!

ముఖానిశీర్య శల్యానాం శివోనః సుమనా భవ!!15!!

విజ్యం ధనురిదం భూయాత్ విశల్యో బాణవానపి!

అనేశన్నిషవశ్చాపి హ్యాభురస్తు నిషంగధిః!!16!!

కపర్దినో మహేశస్య యది నాభుర్నిషంగధిః!

ఇషవో పి సమర్థాశ్చేత్ సామర్థ్యాతు భయం భవేత్!!17!!

యాతే హేతిర్ధనుర్హస్తే మీఢుష్టమ బభూవ యా!

తయాస్మాన్ విశ్వతస్తేన పాలయ త్వ మయక్ష్మయా!!18!!

అనాతతాయాయుధాయనమస్తే ధృష్ణవే నమః!

బాహుభ్యాం ధన్వనే శంభో నమో భూయో నమో నమః!!19!!

పరితే ధన్వనో హేతిః విశ్వతోస్మాన్ వృణక్తు నః!

ఇషుధిస్తవ యా తావదస్మదారే నిధేహి తమ్!!20!!

హిరణ్య బాహవే తుభ్యం సేనాన్యే తే నమోనమః!

దిశాంచ పతయే తుభ్యం పశూనాం పతయే నమః!!21!!

త్విషీమతే నమస్తుభ్యం నమస్సస్పింజరాయతే!

నమః పథీనాం పతయే బభ్లుశాయ నమోనమః!!22!!

నమో వివ్యాధినేన్నానాం పతయే ప్రభవే నమః!

నమస్తే హరికేశాయ రుద్రాయ స్తూపవీతినే!!23!!

పుష్టానాం పతయే తుభ్యం జగతాం పతయే నమః!

సంసార హేతి రూపాయ రుద్రాయాప్యాతతాయినే!!24!!

క్షేత్రాణాం పతయే తుభ్యం సూతాయ సుకృతాత్మనే!

అహన్త్యాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః!!25!!

రోహితాయ స్థపతయే మంత్రిణే వానిజాయచ!

కక్షాణాం పతయే తుభ్యం నమస్తుభ్యం భువంతయే!!26!!

తద్వారి వస్కృతాయాస్తు మహాదేవాయ తే నమః!

ఓషధీనాం చ పతయే నమస్తుభ్యం మహాత్మనే!!27!!

ఉచ్చైర్ఘోషాయ ధీరాయ ధీరాన్ క్రందయతే నమః!28!!

పత్తీనాం పతయే తుభ్యం కృత్స్నవీతాయ తే నమః!

ధావతే ధవలాయాపి సత్త్వనాం పతయే నమః!!29!!

అవ్యాధినీనాం పతయే కకుభాయ నిషంగిణే!

స్తేనానాం పతయే తుభ్యం దివ్యేషు ధిమతే నమః!!30!!

తస్కరాణాం చ పతయే వంచతే పరివంచతే!

స్తాయూనాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే!!31!!

నమః పరిచరాయాపి మహారుద్రాయతే నమః!

అరణ్యానాం చ పతయే ముష్ణతాం పతయే నమః!!32!!

ఉష్ణీషిణే నమస్తుభ్యం నమో గిరిచరాయతే!

కులుంచానాం చ పతయే నమస్తుభ్యం భవాయ చ!!33!!

నమో రుద్రాయ శర్వాయ తుభ్యం పశుపతయే నమః!

నమ ఉగ్రాయ భీమాయ నమశ్చాగ్రేవధాయచ!!34!!

నమో దూరేవధాయాపి నమో హంత్రే నమోనమః!

హనీయసే నమస్తుభ్యం నీలగ్రీవాయ తే నమః!!35!!

నమస్తే శితికంఠాయ నమస్తేస్తు కపర్దినే!

నమస్తే వ్యుప్తకేశాయ సహస్రాక్షాయ మీఢుషే!!36!!

గిరిశాయ నమస్తేస్తు శిపివిష్టాయ తే నమః!

నమస్తే శంభవే తుభ్యం మయోభవ నమోస్తుతే!!37!!

మయస్కర నమస్తుభ్యం శంకరాయ నమోనమః!

నమశ్శివాయ శర్వాయ నమశ్శివతరాయ చ!!38!!

నమస్తీర్థ్యాయ కూల్యాయ నమః పార్యాయతే నమః!

ఆవార్యాయ నమస్తేస్తు నమః ప్రతరణాయచ!!39!!

నమ ఉత్తరణాయాపి హరాతార్యాయ తే నమః!

ఆలాద్యాయ నమస్తేస్తు భక్తానాం వరదాయ చ!!40!

నమశ్శష్ప్యాయ ఫేన్యాయ సికత్యాయ నమోనమః!

ప్రవాహ్యాయ నమస్తేస్తు హ్రస్వాయాస్తు నమోనమః!!41!!

వామనాయ నమస్తేస్తు బృహతేచ నమోనమః!

వర్షీయసే నమస్తేస్తు నమో వృద్ధాయతే నమః!!42!!

సంవృధ్వనే నమస్తుభ్య మగ్రియాయ నమోనమః!

ప్రథమాయ నమస్తుభ్య మాశవే చాజిరాయ చ!!43!!

శీఘ్రిమాయ నమస్తేస్తు శీభ్యాయ చ నమోనమః!

నమ ఊర్మ్యాయ శర్వాయాప్యవస్వన్యాయతే నమః!!44!!

స్రోతస్యాయ నమస్తుభ్యం ద్వీప్యాయచ నమోనమః!

జ్యేష్ఠాయ చ నమస్తుభ్యం కనిష్ఠాయ నమోనమః!!45!!

పూర్వజాయ నమస్తుభ్యం నమోస్త్వవరజాయచ!

మధ్యమాయ నమస్తుభ్యమపగల్భాయ తే నమః!!46!!

జఘన్యాయ నమస్తుభ్యం బుధ్నియాయ నమోనమః!

సోభ్యాయ ప్రతిసర్యాయ యామ్యాయచ నమోనమః!!47!!

క్షేమ్యాయ చ నమస్తుభ్యం యామ్యాయ చ నమోనమః!

ఉర్వర్యాయ నమస్తుభ్యం ఖల్యాయ చ నమోనమః!!48!!

శ్లోక్యాయ చావసాన్యాయావస్వన్యాయ చ తే నమః!

నమో వన్యాయ కక్ష్యాయ మౌన్జ్యాయ చ నమోనమః!!49!!

శ్రవాయ చ నమస్తుభ్యం ప్రతిశ్రవ నమోనమః!

ఆశుషేణాయ శూరాయ నమోస్త్వాశు రథాయ చ!!50!!

వరూథినే పర్మిణే చ బిల్మినే చ నమోనమః!

శ్రుతాయ శ్రుత సేనాయ నమః కవచినే నమః!!51!!

దుందుభ్యాయ నమస్తుభ్య మాహనన్యాయతే నమః!

ప్రహితాయ నమస్తుభ్యం ధృష్ణవే ప్రమృశాయ చ!!52!!

పారాయ పారవిందాయ నమస్తీక్ణేషవే నమః!

సుధన్వనే నమస్తుభ్యం స్వాయుధాయ నమోనమః!!53!!

నమః స్రుత్యాయ పథ్యాయ నమః కాట్యాయ తే నమః!

నమో నీప్యాయ సోద్యాయ సరస్యాయ చ తే నమః!!54!!

నమో నాద్యాయ భవ్యాయ వైశంతాయ నమోనమః!

అవట్యాయ నమస్తుభ్యం నమః కూప్యాయ తే నమః!!55!!

అవర్ష్యాయ చ వర్ష్యాయ మేఘ్యాయ చ నమోనమః!

విద్యుత్యాయ నమస్తుభ్యమీథ్రియాయ నమోనమః!!56!!

ఆతప్యాయ నమస్తుభ్యం వాత్యాయచ నమోనమః!

రేష్మియాయ నమస్తుభ్యం వాస్తవ్యాయ చ తే నమః!!57!!

వాస్తుపాయ నమస్తుభ్యం నమస్సోమాయతే నమః!

నమో రుద్రాయ తామ్రాయాప్యరుణాయ చ తే నమః!!58!!

నమ ఉగ్రాయ భీమాయ నమశ్శంగాయ తే నమః!

నమస్తీర్థ్యాయ కూల్యాయ సికత్యాయ నమోనమః!!59!!

ప్రవాహ్యాయ నమస్తుభ్యమిరిణ్యాయ నమోనమః!

నమస్తే చంద్రచూడాయ ప్రపధ్యాయ నమోనమః!!6౦!!

కింశిలాయ నమస్తేస్తు క్షయణాయ చ తే నమః!

కపర్దినే నమస్తేస్తు నమస్తేస్తు పులస్తయే!!61!!

నమో గోష్ఠ్యాయ గృహ్యాయ గ్రహాణాం పతయే నమః!

సమస్తల్ప్యాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః!!62!!

కాట్యాయ గహ్వరేష్ఠాయ హ్రదయ్యాయ చ తే నమః!

నివేష్ప్యాయ నమస్తుభ్యం పాగ్oసవ్యాయ తే నమః!!63!!

రజస్యాయ నమస్తుభ్యం పరాత్పర తరాయ చ!

నమస్తే హరికేశాయ శుష్క్యాయ చ నమోనమః!!64!!

హరిత్యాయ నమస్తుభ్యం హరిద్వర్ణాయ తే నమః!

నమ ఉర్మ్యాయ సూర్మ్యాయ పర్ణ్యాయ చ నమోనమః!!65!!

నమోపగుర మాణాయ పర్ణశద్యాయ తే నమః!

అభిఘ్నతే చాఖ్ఖిదతే నమః ప్రఖ్ఖిదతే నమః!!66!!

విశ్వరూపాయ విశ్వాయ విశ్వాధారాయతే నమః!

త్ర్యంబకాయ చ రుద్రాయ గిరిజాపతయే నమః!!67!!

మణికోటీర కోటిస్థ కాన్తిదీప్తాయ తే నమః!

వేదవేదాంత వేద్యాయ వృషారూఢాయ తే నమః!!68!!

అవిజ్ఞేయ స్వరూపాయ సుందరాయ నమోనమః!

ఉమాకాంత నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే!!69!!

హిరణ్య బాహవే తుభ్యం హిరణ్యాభరణాయ చ!

నమో హిరణ్య రూపాయ రూపాతీతాయ తే నమః!!70!!

హిరణ్యపతయే తుభ్యమంబికాపతయే నమః!

ఉమాయాః పతయే తుభ్యం నమః పాప ప్రణాశక!!71!!

మీఢుష్టమాయ దుర్గాయ కద్రుద్రాయ ప్రచేతసే!

తవ్యసే బిల్వపూజ్యాయ నమః కళ్యాణ రూపిణే!!72!!

అపార కళ్యాణ గుణార్ణవాయ శ్రీ నీలకంఠాయ నిరంజనాయ!

కాలంతకాయాపి నమో నమస్తే దిక్కాల రూపాయ నమో నమస్తే!!!73!!

వేదాంత బృంద స్తుత సద్గుణాయ గుణ ప్రవీణాయ గుణాశ్రయాయ!

శ్రీ విశ్వనాథాయ నమో నమస్తే కాశీ నివాసాయ నమో నమస్తే!!74!!

అమేయ సౌందర్య సుధానిధాన సమృద్ధి రూపాయ నమోనమస్తే!

ధరాధరాకార నమోనమస్తే ధారా స్వరూపాయ నమో నమస్తే!!75!!

నీహార శైలాత్మజ హృద్విహార ప్రకాశ హార ప్రవిభాసి వీర!

వీరేశ్వరాపార దయానిధాన పాహి ప్రభో పాహి నమోనమస్తే!!76!!

వ్యాస ఉవాచ:

ఏవం స్తుత్వా మహాదేవం ప్రణిపత్య పునఃపునః!

కృతాంజలి పుటస్తస్థౌ పార్శ్వే డుంఠివినాయకః!!

త మాలోక్య సుతం ప్రాప్తం వేదం వేదాంగపారగం!

స్నేహాశ్రుధారా సంవీతం ప్రాహ డుంఠిం సదాశివః!!

ఇతి శ్రీ శివ రహస్యే హరాఖ్యే తృతీయాంశే పూర్వార్ధే

గణేశ కృత రుద్రాధ్యాయ స్తుతిః నామ దశమోధ్యాయః

అనేనా శ్రీ గణేశ కృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణేన

శ్రీ విశ్వేశ్వర స్సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు!!

శివపురాణం – లింగావిర్భావం

                                                శివపురాణం – లింగావిర్భావం




ఒకనాడు లింగావిర్భావకాలమునందు ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి ‘నేను అధికుడను అంటే నేను అధికుడను’ అని వాదోపవాదం జరిగింది. వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్రస్థాయిని పొందుతుంటే దేవతల మొరవిన్న పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభంగా వారిమధ్య ఆవిర్భవించాడు. దాని ఆది కనుక్కోవడానికి శ్రీమహావిష్ణువు వరాహరూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని చివర కనుక్కుందుకు వెళ్ళారు. బ్రహ్మగారు వెళుతూ ఉండగా కేతకీ పుష్పం(మొగలి పువ్వు) ఒకటి క్రింద పడింది. దానిని నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు?” అని అడిగారు. అపుడు మొగలిపువ్వు ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో నన్ను శంకరుడి మీద వేశాడు. అక్కడి నుంచి నేను క్రింద పడ్డాను. మీరు ఎక్కడికి వెడుతున్నారు?” అని అడిగింది. అపుడు బ్రహ్మగారు నాకొక ఉపకారం చేస్తావా?’ అని అడిగాడు. ఏమిటి కావాలి మీకు?” అని అడిగింది మొగలిపువ్వు. ఆయన “క్రింద శ్రీమన్నారాయణుడు ఉంటారు. నేను ఆ పైభాగమును చూశానని సాక్ష్యం చెప్తావా? అని అడిగాడు. చెప్తాను అన్నది మొగలి పువ్వు. బ్రహ్మగారు మొగలిపువ్వుతో కలిసి క్రిందకు వచ్చారు. శ్రీమహావిష్ణువును ఆయన చూసి వచ్చారా? అని అడిగారు. అపుడు విష్ణువు నాకు కనపడలేదు. ఎంతదూరం వెళ్ళినా నేను కనుగొనలేకపోయాను అన్నారు.
అపుడు బ్రహ్మ గారు నేను చూసి వచ్చాను. సాక్ష్యం ఈ కేతకీ పుష్పం అన్నారు. ఇప్పుడు జ్యోతి స్తంభంగా ఉన్న పరమాత్మ సాకారమును పొంది బ్రహ్మగారితో బ్రహ్మా నీకు దర్శనం అయిందని అబద్ధం ఆడావు. కాబట్టి నీకు భూమియందు పూజ లేకుండుగాక! కానీ బ్రహ్మ స్థానమని ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానమునందు ఆవాహన పొంది నీవు గౌరవింపబడుతుంటావు. మహావిష్ణువు నేను చూడలేదు అని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకు వైభవోపేతంగా పూజలు ఉంటాయి. ఆ ఉత్సవములకు నీవు ఆధిపత్యం వహిస్తూ ఉంటావు. అందుకే బ్రహ్మోత్సవం అని బ్రహ్మగారి రథం ఉత్సవములకు ముందు నడుస్తుంది. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ పుష్పం నా పూజయందు వినిమయం అవకుండుగాక! ఇప్పుడు కేతకీ పుష్పం నాకు పూజార్హత లేదా అని బాధపడింది. నాకు పూజింపబడవు కానీ నా భక్తులయిన వారు నిన్ను తలలో ధరిస్తారు. వారు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను. పూజ జరిగే ప్రాంగణం మొగలి పువ్వులతో అలంకారం చేస్తే ప్రీతి పొందుతాను. అని చెప్పాడు. అలా ఏర్పడిన శివలింగం జ్యోతి స్తంభంగా ఏర్పడినదే మహాశివరాత్రి. ఇది మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటిచే చూడదగినటువంటి లింగాకృతిని పొందిన రూపమే అరుణాచలంలో ఉన్న కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమయిన రోజే మహాశివరాత్రి. కాబట్టి భగవత్ స్వరూపములు అన్నీ సమానములే. ఎన్ని దీపములు వెలుగుతున్నా వెలుగుతున్నది ఒక్క జ్యోతి రూపమే. ఇన్ని రూపములుగా ఉన్నది ఒక్కటే అని మీరు తెలుసుకోవాలనే జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. 
శివలింగమునకు ఒక విశేషం ఉంది. మొట్టమొదట అన్నిటికన్నా గొప్పదయినా లింగమును స్వయంభూ లింగము అని పిలుస్తారు. ఆ లింగమును ఒకరు ప్రతిష్ఠ చేయరు. తనంత తాను వెలుస్తుంది. శ్రీశైలాది క్షేత్రములు ఇందుకు ఉదాహరణ. రెండవది దివ్య లింగములు ఇవి దేవతలు ప్రతిష్ఠ చేసినవి. కుమారస్వామి ప్రతిష్ట చేసిన సామర్లకోటలోని కుమారారామం ఇందుకు ఉదాహరణ. మూడవది మానుష లింగములు. ఇవి మనుష్యులు ప్రతిష్ఠ చేసినవి. తరువాత ఆర్ష లింగములు. ఇవి మహర్షులు ప్రతిష్ఠ చేసినవి. రాక్షస లింగములు. రాక్షసులు ప్రతిష్ఠ చేసినవి. దైవిక లింగములు వాటంతట అవి ఏర్పడతాయి. అరకువేలీలోని బుర్రా గుహలలో పైనుండి నీటి బిందువులు క్రిందపడతాయి. కొండ ఉపరితలం ఎక్కడో పైన ఉంటుంది. పైనుండి నీటి బిందువు ఒకేచోట బయలుదేరి క్రింద ఒకేచోట పడుతుంది. ఆ నీటి బిందువు పడినప్పుడల్లా క్రింద ఉన్న భూమి కొద్దికొద్దిగా పైకి లేస్తూ శివలింగంగా మారిపోతుంది. ఇది క్రమక్రమంగా పెరిగి చివరకు ఎక్కడి నుండి నీరు పడుతోందో ఆ ప్రదేశమును తాకి ఇంక నీరు పడకుండా ఆపేస్తుంది. అలా అది మర్రిచెట్టు ఊడలా పెరిగిపోతుంది. దీనిని దైవిక లింగం అంటారు. బాణ లింగములు అని ఉంటాయి. అవి నర్మదానది ప్రవాహము ఒరిపిడి చేత ఏర్పడతాయి. 
లింగము అరూపరూపి. ఉపాసనలో లింగోపాసన ఒక మెట్టు పైన ఉంటుంది. మీకు శివలింగమును చూపించి ఆ శివలింగం ఎటువైపు చూస్తోంది అని అడిగినట్లయితే దానికి సమాధానం చెప్పడం తేలికయిన విషయం కాదు. యథార్థమునకు మీరు శివాలయంలోపల కూర్చుని శివలింగమునాకు అభిషేకం చేయడం కన్నా రుద్రాధ్యాయంతో అర్చక స్వాములు అభిషేకం చేస్తుండగా బయట కూర్చుని కైమోడ్చి నమస్కరిస్తే దానివలన మీరు ఎక్కువ ప్రయోజనమును పొందుతారు. ఇది సాక్షాత్తు చంద్రశేఖరపరమాచార్య స్వామివారు చెప్పినమాట. 
శివలింగంలో తూర్పుకు చూస్తున్న దానిని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుకు అధిష్ఠానంగా ఉంటుంది. దీనివలన అజ్ఞానం కలుగుతుంది. దక్షిణమునకు చూసే ముఖమును అఘోర ముఖము అంటారు. ఇది అగ్నిహోత్రమును శాస్తిస్తుంది. అది అగ్నిహోత్రంగా ఉంటుంది లయం చేస్తుంది. ఇది మీ అజ్ఞానమును దహించేస్తూ జ్ఞానమును కూడా ఇస్తుంది. పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది. దీనిని సద్యోజాత ముఖం అంటారు. పశ్చిమ ముఖం నుండి పాలు, నీళ్ళు విభూతి, పళ్ళరసములు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా మీకు పరమేశ్వరుని అనుగ్రహం కలిగేస్తూ ఉంటుంది. అది భూసంబంధంగా ఉంటుంది. అది సృష్టికి కారణం అవుతుంది. అందుకే లోకంలో పిల్లలు పుట్టలేదని అంటే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. దుష్ట నక్షత్రంలో పిల్లాడు పుట్టాడు అని చెప్తే సుందరకాండ పారాయణ/శివాభిషేకం చేసుకోమని చెప్తారు. అపమృత్యువు వస్తుందేమోనని భయంగా ఉంది అంటే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. పీడకలలు వస్తున్నాయని చెప్తే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. ఈ రెండు క్రియలె చెప్తారు. ఎందుచేత? హనుమ శివాంశ. వర్షములు పడకపోతే శివలింగామునకు అభిషేకం చెయ్యండని చెప్తారు. అభిషేకం చేస్తే వామదేవ ముఖం కానీ తడిసినట్లయితే పరమేశ్వర అనుగ్రహం వలన వర్షములు పడతాయి. పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది. దానిని ఈశానముఖం అంటారు. దీనిని సదాశివ అని పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపియై ఉంటుంది. ఇదే మోక్షమును కటాక్షిస్తుంది. ఈ అయిదు ముఖములతో పంచభూతములను శాసిస్తోంది. సృష్టి స్థితి లయ అజ్ఞాన మోక్షములకు కారకం అవుతుంది. సమస్త ఫలితములను ఇస్తుంది. కాబట్టి శివలింగం చల్లబడడం ఊరంతా చల్లగా ఉండడమే. 
అసలు లింగమునకు బాహ్యమునందు ఏమీ లేదు. బ్రహ్మాండములన్నీ లింగాకృతిలోనే ఉన్నాయి. లింగమునకు పూజ చేస్తే సమస్త లోకములకు పూజ జరిగినట్లే. శివాలయమునకు వెళ్ళినపుడు ముఖ్యంగా ఎనిమిది కనపడతాయి. మనం ఒక అపచార ధోరణి చేస్తూ ఉంటాము. శివాలయం గోడకు ఆనుకోవడం, స్తంభాలను ఆనుకోవడం చేస్తుంటాము. ఆ గోడలు, స్తంభములు అన్నీ ఈశ్వర స్వరూపమే అయి ఉంటాయి. దేవాలయ గోడను కొట్టినట్లయితే శాస్త్రం ప్రకారం శివుడిని కొట్టినట్లుగానే పరిగణింపబడుతుంది. శివాలయం నందు ఎనిమిది రూపములలో లింగం ఉంటుంది. అందుకే పూర్వం పెళ్ళిళ్ళు గాని, జరిగితే ధ్వజస్తంభం ఎక్కడివరకు కనపడుతోందో అక్కడ మేళతాళములు ఆపుచేసేవారు. గోపురంగా శివుడే ఉంటాడు. రెండవది శివుడు గర్భాలయ శిఖరంగా ఉంటాడు. ధ్వజస్తంభం శివుడు. ఇప్పటికీ కొన్ని దేవాలయములలో బలి పీఠమునకు, ధ్వజ స్తంభానికి అభిషేకం చేస్తారు. లోపల ఉన్న శివలింగమును మహాలింగం అని పిలుస్తారు. పెద్ద పెద్ద దేవాలయములలో కొన్ని మహాలింగముల మీద చారికలు ఉంటాయి. ఆ గీతలను బ్రహ్మసూత్రములు అని పిలుస్తారు. అవి సాధారణంగా స్వయంభూ లింగముల మీద ఉంటాయి. 
శివాలయంలో ఉన్న ప్రధాన లింగమును ‘మూల లింగము లేక మహాలింగము’ అని పిలుస్తారు. చందీశ్వరుడు ఒక లింగము. ఇవి కాకుండా అర్చక స్వామి ఒక లింగము. అందుకే నందికి శివుడికి మధ్య అర్చకుడు వెళ్ళవచ్చు. శివాలయంలో దేవతామూర్తులు స్థానములు మారడానికి వీలులేదు. ఎంత పెద్ద శివాలయం అయినా సరే నైరుతిలో విఘ్నేశ్వరుడు, పడమట సుబ్రహ్మణ్యుడు, ఉత్తరమున చండీశ్వరుడు, దక్షిణమునందు దక్షిణామూర్తి, ఆగ్నేయం నందు సోమస్కందుడు, ఈశాన్యము =నందు నటరాజు కాని, భైరవ మూర్తి కాని ఉండాలి. 
శివ లింగారాధనం ఎలా చేయాలి అని తెలిసి చెయ్యగలిగితే వాడంత అదృష్టవంతుడు సృష్టిలో లేడు. అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై నీటిని సన్నటి ధారగా పోయాలి. అంతేకానీ పంచపాత్రలో నీళ్ళు తీసుకుని ఉద్ధరిణతో పోయకూడదు. అభిషేక జలం తొక్కకూడదు. శివాభిషేకం గురు ముఖతః చేయడం చాలా మంచిది. ఫేంటు ధరించికాని, తోలు బెల్టు పెట్టుకుని గానీ గర్భాలయం లోపలి వెళ్ళకూడదు.

SEETHASTAMI - 'సీతాష్టమి'

SEETHASTAMI - 'సీతాష్టమి'


శివ ధనుస్సు విరిచిన శ్రీరాముడి మెడలో సీత వరమాల వేసింది. వేద మంత్రాల సాక్షిగా రాముడి వెంట ఏడడుగులు నడిచింది. అపురూపంగా ... అల్లారుముద్దుగా పెరిగిన సీత అత్తవారిల్లు అయోధ్య అయినందుకు పొంగిపోయింది. సూర్యవంశీకుల ఇంటికి కోడలిగా వెడుతున్నందుకు ఎంతగానో ఆనందించింది. సీతమ్మలేని మిథిలా నగరంలో ఉండలేమని అక్కడి ప్రజలు దిగాలు పడ్డారు. అసమాన పరాక్రమవంతుడైన రామయ్య చేతిలో ఆమెని పెట్టినందుకు సంతోషించారు.

కానీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి, రాముడితో సీతమ్మ వనవాసానికి వెళ్లవలసి వస్తుంది. మేడలకి దూరమైనందుకు సీతమ్మ బాధపడలేదు. రాముడి నీడలో వుండే భాగ్యం లభించినందుకు సంతోషించింది. చలువరాతి మందిరాలు తప్ప మరేమీ తెలియని సీతమ్మ, కారడవులలో కాలి నడకన రాముడిని అనుసరించింది. దశరథుడు చనిపోయిన సమయంలో రాముడి మనసుకు ఆమె ఎంతో ఊరట కలిగించింది.

రావణుడు అపహరించుకుపోగా, రాముడు వచ్చేంత వరకూ పాతివ్రత్యం చేత తనని తాను రక్షించుకుంది. లంకా నగరానికి ముందుగా వచ్చిన హనుమంతుడు, తాను రాముడి సన్నిధికి తీసుకువెళతానంటే నిరాకరిస్తుంది. రాముడు వచ్చి రావణుడిపై విజయ శంఖాన్ని పూరించి తీసుకువెళ్లడమే క్షత్రియ ధర్మమని చెబుతుంది. సీత పవిత్రత గురించి రాముడికి తెలిసినా, లోకం నింద చేయకూడదనే ఉద్దేశంతో అగ్నిప్రవేశం చేయమనగానే చేస్తుంది.

ఎలాంటి పరిస్థితుల్లోను ఒక్కమాట వలన కూడా రామచంద్రుడి మనసు నొప్పించని మహాఇల్లాలు సీత. అందుకే ఆమె లక్ష్మీ స్వరూపంగానే కాదు, మహిళాలోకానికి ఆదర్శమూర్తిగాను నిలిచింది. జనకమహారాజుకి నాగేటిచాలులో పసికందుగా లభించింది. అందుకే ఈ రోజుని 'సీతాష్టమి' గా పిలుచుకుంటూ వుంటారు.

ఈ రోజున ఆ తల్లిని భక్తిశ్రద్ధలతో స్మరించుకోవాలని చెప్పబడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున ప్రదోష కాలంలో పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి 'దీపోత్సవం' జరుపుతుంటారు. ఈ రోజున సీతారాముల ఆలయాలను దర్శించడం వలన ... పూజించడం వలన ... రామాయణ మహాకావ్యాన్ని పఠించడం వలన ... వినడం వలన కష్టాలు తొలగిపోయి శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.

మరియు ఈ రోజు.
శివాజీ క్రీ.శ. ఫిబ్రవరి 19, 1627వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. జిజాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై (పార్వతి) పేరు శివాజీకు పెట్టింది.

ASTA DALA PADA PADMARADHANA SEVA - “అష్టదళ పాద పద్మారాధన సేవ”



ASTA DALA PADA PADMARADHANA SEVA - “అష్టదళ పాద పద్మారాధన సేవ”






తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆఫీసు
*****************************
పి వి ఆర్ కే ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు executive officer గా పనిచేస్తున్నారు..సరిగ్గా అవే రోజుల్లో దేవస్థానం వారు కూడా తమ స్వర్ణోత్సవపు సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచి పోయేటట్లుగా ఏదన్నా కొత్త పని మొదలు పెడితే బావుంటుందన్న ఆలోచనలో వున్నారు..

వారంతా ఆలోచనయితే చేసారు గానీ ఎన్ని దఫాలుగా ఎన్ని మీటింగులు పెట్టి ఎంత చర్చించినా ఆ ఆలోచనని ఆచరణలో పెట్టటంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోయారు..సమయం దగ్గర పడుతోంది..ఏం చేయాలో దిక్కు తోచని స్థితి..వెంటనే ఏదో ఒకటి ప్లాన్ చెయ్యకపోతే అభాసుపాలు అవుతామేమోనన్న భయం అందర్లోనూ ఏ మూలో ఉంది….



అక్కడున్న వారిలో TTD బోర్డు మెంబర్లుగా ఉన్నకొద్ది మంది పేరొందిన ప్రముఖులతో పాటు మరి కొంత మంది ముఖ్యమైన ఆలయ అధికారులు కూడా ఉన్నారు..అప్పుడక్కడ వేడిగా వాడిగా చర్చ జరుగుతోంది..చర్చ అయితే జరుగుతోంది కానీ తమ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా స్వామి వారికి కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయంలో మాత్రం అక్కడున్న పెద్దలు ఒక perfect అవగాహనకు రాలేక పోతున్నారు..

సమయం గడుస్తున్నకొద్దీ EO పీ వీ ఆర్ కే ప్రసాద్లో అసహనం ... ఆయనకు క్లియర్ గా అర్థం 

సరిగ్గా అదే సమయంలో తలుపు తోసుకొని ఆఫీస్ అటెండర్ మెల్లిగా ప్రసాద్ దగ్గరికి వచ్చాడు..అసలే చిరాగ్గా ఉన్న ప్రసాద్ టైం గాని టైం లో వచ్చిన ఆ అటెండర్ని చూస్తూ ‘ఏంటయ్యా” అని మరింత చిరాకు పడిపోతూ అడిగారు..కంగారు పడ్డ ఆ అటెండర్ తన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ ఆయన ముందుకొంగి “సార్ మిమ్మల్ని కలవటం కోసం గుంటూరు నుండి ఎవరో భక్తుడు వచ్చాడు.. ” అని మెల్లిగా చెప్పాడు..

చిర్రెత్తుకొచ్చింది ప్రసాద్ కి.. “..ఎవరయ్యా అతను..ఇప్పుడింత అర్జెంటుగా మీటింగులో ఉంటే నన్ను డిస్టర్బ్ చేసి మరీ చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది..కాసేపుండమను…”మరి కాస్త చిరాకు పడిపోతూ అన్నారు ప్రసాద్…”చెప్పాను సార్..కానీ ఏదో అర్జెంటుగా మీతో మాట్లాడాలట..అతని పేరు షేక్ మస్తాన్ అని చెప్తున్నాడు..” కొద్దిగా భయపడుతూ చెప్పాడు అటెండర్..

“.. షేక్ మస్తానా…” అని ముందు కాస్త ఆశ్చర్య పోయినా..”ఎవరో ముస్లిం భక్తుడు ఏదో రికమండేషన్ లెటర్ తో వచ్చి ఉంటాడు.. మా వాళ్ళు నా దగ్గరికి పంపించుంటారు..మళ్ళీ బయటకు పోవటం ఎందుకు..ఏదో రెండు నిమిషాలిక్కడే మాట్లాడి పంపించేస్తే సరిపోతుంది కదా ” అని మనసులో అనుకుంటూ.. “.. సర్లేవయ్యా..ఇక్కడికే రమ్మను..” ..అని అటెండర్ తో చెప్పి పంపించేసారు ప్రసాద్..

అప్పుడు దుద్రుష్టవసాత్తు ప్రసాద్ కి గానీ అదే రూం లో ఉన్నఏ ఇతర బోర్డు మెంబర్లకి గానీ తెలినీ విషయం ఏమిటంటే కాసేపట్లో తమ ముందుకు రాబోతున్న ఆ ముస్లిం భక్తుడు కేవలం ఒక భక్తుడు మాత్రమె కాదని స్వయంగా తమ స్వామి వారు పంపిస్తే తమ దగ్గరికి వస్తున్నాడని అంతేకాకుండా అతని ద్వారానే తాము ఇన్నాళ్లుగా తలలు బద్దలు కొట్టుకుంటున్న తమ స్వర్ణోత్సవ సంవత్సర సమస్యకు కూడా గొప్ప పరిష్కారం దొరకబోతోందని..

ఇవేమీ తెలీని ఆ పెద్దలంతా ఆ రూంలో వెయిట్ చేస్తుంటే ఆ ముస్లిం భక్తుడొక్కడూ బయట వెయిటింగ్ హాల్లోవెయిట్ చేస్తున్నాడు.. సరిగ్గా అప్పుడే అటెండర్ బయట కొచ్చిఆ ముస్లిం భక్తుడి దగ్గర కెళ్ళి చెప్పాడు “సార్..మా సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు” అని..

అప్పటిదాకా తను కూర్చున్నచెక్క కుర్చీ లోంచి లేచి ఆ అటెండర్ కి థాంక్స్ చెప్తూ ఆ ముస్లిం భక్తుడు ఒక్కో అడుగూ వేసుకొంటూ బోర్డు రూం లోపలికి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాడు..వెళ్తూనే రెండు చేతులు జోడించి అక్కడున్నవారందరికీ ఎంతో వినమ్రంగా నమస్కారం చేసి ఆ తరువాత మెల్లిగా ప్రసాద్ వైపు తిరిగి ఇలా చెప్పటం మొదలు పెట్టాడు..

“.. అయ్యా.. నా ఏరు షేక్ మస్తాన్..మాది గుంటూరు జిల్లా..మాది చాల పెద్ద కుటుంబం..అన్నదమ్ములందరం కలిసి ఉమ్మడిగా ఒకే ఇంట్లో ఉంటాం..మా కుటుంబానికక్కడ ఓ చిన్న పాటి వ్యాపారముంది..ఎన్నోతరాలుగా మేమంతా స్వామి వారి భక్తులం..”

“..మా తాత ముత్తాతల కాలం నుండీ కూడా మా కుటుంబ సభ్యులమంతా చిన్న పిల్లలతో సహా ఒక పద్ధతి ప్రకారం పొద్దున్నేలేచి స్వామి వారి ముందు నిలబడి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పటిస్తాం..అట్లాగే ఏ మాత్రం తప్పులు పోకుండా శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి, మంగళాశాసనం కూడా పటిస్తాం..నా మటుకు నేను శ్రీనివాస గద్యం మొత్తం పొల్లుపోకుండా అప్పజెప్పగలను..”

“తరతరాలుగా మా ఇంట్లో మరో ఆచారం కూడా ఉంది..అదేమిటంటే మేమంతా కలిసి ప్రతి మంగళ వారం పొద్దున్నే లేచి మా పెరట్లో పూచే రకరకాల పూలతో స్వామి వారి 108 నామాలూ ఒక్కొక్కటిగా పటిస్తూ ఒక్కో నామానికి ఒక్కో పువ్వు చొప్పున సమర్పిస్తూ శ్రీ స్వామి వారికి అష్టోత్తర శత నామ పూజ చేస్తాం..”

“అయ్యా ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిమిటంటే..మా తాతగారు అంటే మా తండ్రి గారి తండ్రి గారు తన చివరి రోజుల్లో స్వామి వారికి తన స్వార్జితంతో 108 బంగారు తామర పూలు చేయించి శ్రీవారి ఆలయంలో సమర్పిస్తానని మొక్కుకున్నారు..మొక్కయితే మొక్కుకున్నారు గానీ పాపం వారి ఆరోగ్యమూ అంతంత మాత్రమే ఆర్ధిక స్తోమతా అంతంత మాత్రమె కావటం చేత కొద్ది మాత్రం బంగారు తామర పూలు మాత్రమే చేయించ గలిగారు..”

“..ఆ తరువాత తండ్రి గారి మొక్కు తీర్చే బాధ్యత తనది కూడా అవుతుంది కాబట్టి మా తండ్రిగారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక్కో రూపాయి కూడ పెట్టి మరికొన్ని బంగారు పూలు చేయించారు..అంత కష్టపడీ చివరికా మొక్కు తీర్చకుండానే మా తండ్రి గారు కూడా వారి తండ్రి గారి లాగానే తమ చివరి రోజుల్లో ఎంతో బాధపడుతూ స్వామి వారి పాదాల్లో ఐక్యమై పోయారు..”

“..మరి మా తాతగారిది తండ్రిగారిది మొక్కు తీర్చాల్సిన బాధ్యత ఇంటికి పెద్ద కొడుగ్గా నా మీద కూడా వుంటుంది కాబట్టి నా ఆర్ధిక పరిస్థితి కూడా పెద్దగా సహకరించక పొయినా నేను కూడా ఎంతో కష్టపడి నా వంతు ప్రయత్నంగా ఆ మిగతా బంగారు పూలు కూడా పూర్తి చేయించాను..ఈ మధ్యనే కరెక్టుగా 108 పూల లెక్క పూర్తయ్యింది..ఎంతో భక్తితో అవి స్వామి వారికి సమర్పించాలని మా కుటుంబ సభ్యుల మంతా మొత్తం 54 మందిమి కలిసి ఇందాకే కాలి బాటన కొండెక్కి పైకి చేరుకున్నాం..”

అంటూ కాసేపాగి అందరివేపు ఒక్క నిమిషం తదేకంగా చూసాడు షేక్ మస్తాన్..ఆ తరువాత మెల్లిగా అసలు విషయం బయట పెట్టాడు… 

“అయ్యా..ఇప్పటికే మీ అమూల్యమైన సమయం చాలా తీసుకున్నాను..కానీ చివరగా పెద్దలందరికీ నాదొక చిన్న విన్నపం.. మూడు తరాలుగా మా కుటుంబ సభ్యులంతా ఎంతో శ్రమపడి ఈ బంగారు తామర పూలు చేయించాం..ఇవి ఒక్కోటి 23 గ్రాముల బరువుంటాయి..”

“..కాదనకుండా మీరు వాటిని స్వీకరించి ఏదో రూపేణా స్వామి వారి కైంకర్యంలో ఉపయోగిస్తే మా కుటుంబం మొత్తానికి కూడా గొప్ప సాయం చేసిన వారవుతారు..మా తండ్రీ తాతగారి ఆత్మలు కూడా శాంతిస్తాయి..ఇది విన్నవించు కుందామనే మీ దగ్గరకు వచ్చాను ..ఇక మీ ఇష్టం..నిర్ణయం మీకే వదిలేస్తున్నాను..”

అంటూ వినమ్రంగా అందరికీ రెండు చేతులెత్తి మరోసారి నమస్కారం చేసి అప్పుడు మెల్లిగా తన చేతిలో ఉన్న ఒక బరువైన సంచీని తీసి ప్రసాద్ ముందున్న టేబుల్ మీద పెట్టాడు షేక్ మస్తాన్ అనబడే ఆ అతి గొప్ప ముస్లిం భక్తుడు..

నిశ్శబ్దం..నిశ్శబ్దం..నిశ్శబ్దం..

గుండెలు పిండేసే నిశ్శబ్దం.. రాతిని కరిగించే నిశ్శబ్దం.. బరువైన నిశ్శబ్దం.. గుండె చెరువైన నిశ్శబ్దం.. నిర్వెదమైన నిశ్శబ్దం… నిలువెల్లా మనిషిని నివ్వెర పరిచే నిశ్శబ్దం.. మనసంతా నిశ్శబ్దం.. మనసుని కలవర పరిచే నిశ్శబ్దం.. గతి తప్పిన నిశ్శబ్దం.. మనసుని గతి తప్పించే నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. 

కొన్ని క్షణాల పాటక్కడ ఇంతకంటే వర్ణించటానికి వీలుకాని నిశ్శబ్దం తాండవించింది..అక్కడున్నవారందరూ ఓ మహాశిల్పి చెక్కేసి గదిలో వొదిలేసిన మహాత్ముల శిలా విగ్రహాల్లాగా freeze అయిపోయి కూర్చున్నారు..అక్కడ గది మూలల్లో ఏర్పాటు చేసిన pedestal fans తిరుగుతూ చేసే శబ్దం తప్ప ఆ సమయంలో అక్కడ మరే ఇతర శబ్దం వినిపించటంలేదు..

ఎంతో సాదా సీదాగా కనపడుతూ తమ మధ్యన మామూలుగా నిలబడి ఎన్నో అద్భుత విషయాలు చెప్పిన ఆ గొప్ప శ్రీవారి ముస్లిం భక్తుడి మాటలకు చేష్టలుడిగి పోయి ఉన్నారంతా.. అందరికంటే ముందు తేరుకున్నవాడు పీ వీ ఆర్ కే ప్రసాద్..

“దివినుండి దేవ దేవుడే దిగి వచ్చినాడా..” 

అన్న ఒక్క అతి చిన్న అనుమానం లిప్త పాటు కాలంలో ఓ మహోగ్ర రూపం దాల్చిఆయన మనసంతా ఆక్రమించింది..ఇంకొక్క ఉత్తర క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఒక్క ఉదుటున లేచి షేక్ మస్తాన్ దగ్గరికి చేరుకున్నారు ప్రసాద్..

కళ్ళనుండి ధారగా కన్నీళ్లు కారిపోతుండగా షేక్ మస్తాన్ రెండు చేతులు పట్టుకొని ఎంతో ఆర్త్రతతో,”మస్తాన్ గారూ..మమ్మల్ని దయచేసి క్షమించండి..మీరెవరో తెలీక ఇంతసేపూ మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడించాను..రండి ..” అంటూ ముందు తన కుర్చీ దగ్గరికి తీసుకెళ్ళి తన పక్కనున్న కుర్చీలో కూర్చోపెట్టుకుని ఆ తరువాత మెల్లిగా ఇట్లా అన్నారు..

“మస్తాన్ గారు..ఇక్కడున్న మేమంతా మా సర్వీసులో ఎంతో మంది గొప్ప గొప్ప భక్తుల్ని చూసాం..కానీ మీ అంతటి అద్వితీయమైన భక్తుడ్నిమాత్రం ఇప్పుడే చూస్తున్నాం..ఒక రకంగా మిమ్మల్ని చూడగలగటం మా పూర్వజన్మ సుకృతం అనుకోండి..బహుశా మిమ్మల్ని ఆ శ్రీనివాసుడే మా దగ్గరికి పంపించాడేమో..ఎవరికి తెలుసు..”

“..కానీ నాదొక విన్నపం..ఈ అమూల్యమైన బంగారు తామర పూలను TTD తరఫున ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్ గా నేను తప్పకుండా స్వీకరిస్తాను..కానీ వీటిని స్వామి వారి సేవలో వెంటనే ఉపయోగిస్తామని మాత్రం ఈ క్షణం లో మీకు మాటివ్వలేను.. ఎందుకంటే పేరుకి మేము కూడా శ్రీవారి సేవకులమే అయినా ప్రభుత్వం తరఫున బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం కాబట్టి మాకు కొన్ని పరిమితులుంటాయి.. వాటిని అధిగమించటానికి మాకు చాలానే సమయం పడుతుంది..”

“అయినా సరే.. ప్రయత్నలోపం లేకుండా నా వంతు కృషి చేసి వీలున్నంత తొందరగా మీ పని పూర్తి చేసి మీకు కబురు పెడతాను.. ఏం చేస్తాననేది మాత్రం ఇప్పుడే చెప్పలేను..మీరు మీ అడ్రస్సు ఫోన్ నెంబర్ మాకిచ్చి వెళ్ళండి..మిగతా విషయాలు నేను చూసుకుంటాను..అంతవరకూ కాస్త ఓపిక పట్టండి..”

అంటూ షేక్ మస్తాన్ రెండు చేతులూ పట్టుకొని ప్రసాద్ ఇట్లా అన్నారు.. 

” మస్తాన్ గారు.. చివరగా ఒక్క మాట.. ప్రస్తుతం మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ మా వాళ్ళు దర్సనం వసతి ఏర్పాటు చేస్తారు..హాయిగా మీ స్వామి వారిని దర్శించుకొని వెళ్ళండి..thank you very much..”

ఉపసంహారం 

ఆ తరువాత పనులన్నీ చకచకా జరిగిపొయినయి.. ఇంకో రెండు మూడు మీటింగుల తర్వాత చివరికి శ్రీ వారికి ఒక కొత్త అర్జిత సేవను ప్రవేశ పెట్టాలని TTD బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది..ఆ సేవలో భాగంగా స్వామి వారికి వారానికొకసారి అష్టోత్తర శతనామ పూజ జరపబడుతుంది.. 

ఆ పూజలో స్వామి వారి 108 పేర్లను ఒక్కొక్కటిగా పటిస్తూ షేక్ మస్తాన్ కుటుంబం సమర్పించిన ఒక్కొక్క బంగారు తామర పూవును పూజారులు స్వామి వారి పాదాల మీద ఉంచుతారు..TTD ఈ ఆర్జిత సేవను 1984 లో స్వామి వారికి తమ స్వర్మోత్సవపు కానుకగా ప్రవేశ పెట్టింది.. 

శ్రీ వారి పట్ల షేక్ మస్తాన్ కుటుంబానికున్న గొప్ప భక్తి వలన స్వామి వారికి ఒక కొత్త ఆర్జిత సేవ ప్రారంభం అవటమే కాకుండా అదే కుటుంబం వలన TTD బోర్డుకి కూడా తమ స్వర్ణోత్సవ సంవత్సరాన్ని తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకొనే ఒక గొప్ప సదవకాశం లభించింది.. 

గత 30 సంవత్సరాలకు పైగా ప్రతి మంగళవారం స్వామి వారికి జరపబడే ఈ సేవలో ఇప్పటికీ షేక్ మస్తాన్ ఇచ్చిన బంగారు తామర పూలనే వాడతారు..కాలక్రమేణా ఈ సేవ భక్తుల్లో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది..మొదట్లో ఈ సేవను “అష్టదళ స్వర్ణ పద్మ పూజ” అని పిలిచినా ఇప్పుడది “అష్టదళ పాద పద్మారాధన సేవ” గా మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.......

ద్వాదశ జ్యోతిర్లింగాలు

 🌿🌿 ద్వాదశ జ్యోతిర్లింగాలు 🌿🌿
*********************************


శైవులు శివున్ని మూర్తి రూపములో మరియు లింగరూపములోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ప్రతి లింగములో శివుని యొక్క జ్యోతి స్వరూపము వెలుగుతుంటుందని శైవుల నమ్మకం.
అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావించబడుచున్నది.

నీ పుట్టుకే నీకు తెలియనివాడివి, నా పుట్టుకకు నీవు కారకుడివా..!? కానేకావు. నాకు నేను స్వయంగా అవతరించాను. నాపై నీ ఆధిపత్యం చెల్లదు. నేనే నీక న్నా అత్యధికుడిని అంటూ బ్రహ్మ వాదులాడసాగాడు. విష్ణువు ఎన్నివిధాల నచ్చజెప్ప ప్రయత్నించినప్పటికీ... బ్రహ్మ వినకుండా నేనే అధినాథుడను... ఈ విశ్వానికి నేనే అధినాథుడను అంటూ పెడబొబ్బలు పెట్టసాగాడు.

ఆ సమయంలో ఒక్కసారిగా ఫెళఫెళమంటూ విశ్వమం తా కంపించిపోయింది. ఆ ఆర్భాటాలకి హేతువేమిటో తెలియక బ్రహ్మ విష్ణువులు విస్మయం చెందుతూ అటూ ఇటూ చూడసాగారు.

లింగోద్భవం: 
****************
ఆ సమయంలో ఓంకారనాదం ప్రతిధ్వనిస్తుండగా,జ్వాలా స్తంభం ఒకటి బ్రహ్మ,విష్ణువు మధ్య ఆవిర్భవించింది. 
సహస్రాధిక యోజనాల పొడ వుగా ఉద్భవించింది ఆ స్తంభం. అగ్నిజ్వాలలు విరజి మ్ముతున్న ఆ జ్యోతిర్లింగం ఆది మూలమెక్కడో, తుది యేదో... ఎక్కడున్నదో కూడా వారికి అర్థం కాలేదు. 

ఆ జ్వాలా స్తంభం యొక్క ఆద్యంతాలు తెలుసుకోగలిగిన వాడే తమలో అధికుడని వారిరువురూ నిశ్చయించుకున్నారు.

ఆ నిర్ణయానుసారం బ్రహ్మ హంసరూడుడై జ్యోతిర్లంగం తుది భాగాన్ని కనుక్కోవడానికి పైకెగిరి వెళ్లాడు. విష్ణువు ఆ లింగం అడుగు భాగాన్ని కనుక్కోవడానికి యజ్ఞ వరాహరూపం ధరించి లింగం ప్రక్క నుంచి భూమిని తొలుచుకుంటూ అడుగు భాగానికి ప్రయాణం ఆరంభించాడు. 

కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.

ఆ జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని కను క్కోవడం తనకు సాధ్యం కాదని గ్రహించి విష్ణువు వెనుదిరిగి యథాస్థానానికి వచ్చి బ్రహ్మకోసం నిరీక్షించసాగాడు.

బ్రహ్మ పైకి ఎన్ని యోజనాలు ప్రయాణించినా ఆ లింగం తుది భాగాన్ని కనుక్కోలేక నిరాశ చెందాడు.

ఆ సమయంలో విష్ణువు దేవాదిదేవా..! ఆద్యంతాలు లేని ఈ జ్వాలా లింగాన్ని అభిషేకించడం, అర్చించడం మాకు సాధ్యం కాదు. కావున, నీవు ఈ జ్వాలా స్వరూపాన్ని ఉపసంహరించుకొని, మా పూజలందుకోవడానికి అర్హమైన రూపంతో అవ తరించు అని ప్రార్థించాడు. విష్ణువు ఆ ప్రార్థనతో శాంతించిన పరబ్రహ్మ తన జ్వాలా స్తంభరూపాన్ని ఉపసంహరించుకున్నాడు.

మరుక్షణమే ఆ ప్రదేశం లో మొట్టమొదటి శివలింగం అవతరించింది. లింగోద్భవం జరిగిన ఆ సమయమే ‘మహాశివరాత్రి’ పర్వదినం అయింది.

లింగరూపంలో అవతరించిన పరమేశ్వరుణ్ణి పవిత్ర జలంతో అభిషేకించి..శివనామస్మరణతో పంచాక్షరీ మహామంత్రంతో అర్చించారు బ్ర హ్మ, విష్ణువులు. వారి భక్తి ప్రపత్తులకు సంతోషిం చి ఆదిదేవుడు ఆ లింగాకార మధ్యభాగంలో ప్రత్యక్ష మై దర్శనమిచ్చి వారిని ఆశీర్వదించి అనుగ్రహించాడు.

లింగమనగా... ‘లీయతేగమ్యతే ఇతి లింగః’...
‘లిం’ లీయతి, ‘గం’ గమయతి...

అనగా ఈ జగత్తు దేనియందు సంచరించి, దేనియందు
లయం చెందుతుందో అదే ‘లింగము’ అని అర్థం.

ఆద్యంతాలు లేనిదే లింగము. లింగతత్త్వమే ఆత్మ. కనుక ప్రతి దేహంలో ఆత్మ అనే లింగము ఉంటున్నది. ఆ లింగస్వరూపుడే శివుడు.

అగమ్యము, అగోచరమైన దివ్య తత్త్వమును మానవులు గ్రహిచటానికి నిదర్శనముగా లింగము ఉద్భవించుచున్నది. లింగము అనంత నిరాకార పరబ్రహ్మమునకు చిహ్నం. ఈ సత్యాన్ని చాటడానికి ఆ పరబ్రహ్మ తొలుత లింగరూపుడై ఉద్భవించి బ్రహ్మ, విష్ణువులకు దర్శనమిచ్చాడు. అనంతరం లింగాకారుడై ముల్లోకాలలోనూ వెలసి నిత్యాభిషేక అర్చనలు అందుకుంటున్నాడు.

భక్తులు, సర్వజీవుల హృదయాలలో ఆత్మరూపుడై నివశించే శివుడు ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ తనని పూజించడానికి వీలుగా కోటానుకోట్ల శివలింగాలై వెలసి ఉన్నాడు.

ఇట్టి అనేకానేక శివలింగాలలో దాదాపుగా అన్ని ప్రతిష్ఠించినవి కాగా... కొన్ని మాత్రమే ఆ శివుడు తనకుతానుగా స్వయంగా లింగరూపుడై వెలిసినవి. వాటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవే ద్వాదశ జ్యోతిర్లింగాలు. 

ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర ‘లింగపురాణం’లో వ్యాసమహర్షి వివరించాడు.

ద్వాదశ జ్యోతిర్లింగ సంపూర్ణ స్తోత్రమ్
*****************************************
సౌరాష్ట్రదేశే విశదే‌உతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ |
భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే || 1 ||

శ్రీశైలశృంగే విబుధాతిసంగే ‌ తులాద్రితు0గేஉపి ముదా వసంతమ్ |
తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుమ్ ||2 ||

అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ |
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ || 3 ||

కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతమ్ ఓంకారమీశం శివమేకమీడే || 4 ||

పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసం తం గిరిజాసమేతమ్ |
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి || 5 ||

యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి || 6 ||

సుతామ్రపర్ణీ జలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి || 7 ||

యామ్యే సదంగే నగరే‌உతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే || 8 ||

సానందమానందవనే వసంతమ్ ఆనందకందం హతపాపబృందమ్ |
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే || 9 ||

సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే |
యద్దర్శనాత్ పాతకమాశునాశం ప్రయాతి తం త్ర్యమ్బకమీశమీడే || 10 ||

మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే || 11 ||

ఇలాపురే రమ్యవిశాలకే‌உస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ |
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే || 12 ||

జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |
స్తోత్రం పఠిత్వా మనుజో‌உతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ||

1 . గుజరాత్‌లో శ్రీ సోమనాథేశ్వరుడు
**********************************************
గుజరాత్‌ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. 
ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమ నాథేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి.
.
2 . శ్రీశైల మల్లికార్జునేశ్వరుడు
*************************************
మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దోర్నాల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి 52 కిలోమీటర్ల, హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది.

పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభువుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు.

భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షన్ముఖుడికి ప్రతీచోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు. పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్లిపోయి కార్తీకుడిగా వెలిశాడు.

తన తప్పిదం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానదీ తీరం శ్రీశైల శిఖరంలో తప్పస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సహిత మల్లిఖార్జునులుగా వెలిశారు. 

శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వేయి లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన అయిదు లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానందాలహరి రాసారని ప్రతీతి.

3 . శ్రీ మహా కాళేశ్వరుడు
********************************
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయం ఉంది.
క్షిప్ర నదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది. 
ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్రయంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత.

ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహా కాళేశ్వరుడికి పాతఃకాలం భస్మాభిషేకం చేస్తారు.

ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు.

4 . శ్రీ ఓంకారేశ్వరుడు
***************************
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం వింద్య పర్వత సానువుల్లో నర్మదానది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. సంస్కృత ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం.

5 . శ్రీవైద్యనాథేశ్వరుడు
*****************************
జార్ఖండ్‌ రాష్ట్రంలో జేసిడీ కూడలి దగ్గర శ్రీవైద్యనాథేశ్వరాలయం ఉంది. పాట్నా నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

మహారాష్ట్రలో కట్నీపూర్‌ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు.

ఈ రెండింటి నేపథ్యమూ రామాయాణాంతర్గత రావణాసురిడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయం మవుతుండడం వల్ల శ్రీవైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి.

6 . శ్రీభీమేశ్వరుడు
**************************
మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతఘాట్‌లో పూణేకు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమనది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసింది.

కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది. 

ఈ జ్యోతిర్లింగం అర్థనాథేశ్వర రూపంలో భక్తులు కోర్కెలు తీర్చేదిగా ప్రతీతి.
ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుండడం ఓ ప్రత్యేకత.
శివుని రౌద్రరూపం నుంచి వచ్చిన చెమట బిందువులు భీమనదిగా మారిందని స్థల పురాణం.

7 . శ్రీరామేశ్వరుడు
*************************
తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వరాలయం ఉంది. పురాణగాథ ప్రకారం రావణవధ అనంతరం శ్రీరామచంద్రమూర్తి సేతువును దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మ హత్యాపాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమకు ఆజ్ఞాపిస్తాడు. సుముహూర్త సమయం దాటిపోతుండడంతో సీతాదేవి సముద్రతీరంలో ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుక లింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు. గర్వభంగమైన ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు.

రామేశ్వరంలో రెండు లింగాలు మనం గమనిస్తాం. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి. రామేశ్వరంలోని నూతుల్లో నీటితో స్నానమాచరిస్తే సమస్త బాధలు పోతాయని భక్తుల విశ్వాసం.

8 . శ్రీనాగనాథేశ్వరుడు
****************************
మహారాష్ట్ర ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో శ్రీనాగనాథేశ్వర ఆలయం ఉంది.

పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ. 

మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినపుడు శరీరం నిండా పాములు, చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్నకాపాలికులు వారిని తరిమికొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి.

9 . శ్రీవిశ్వనాథేశ్వరుడు
*******************************
శ్రీ విశ్వనాథేశ్వరుడి జ్యోతిర్లింగం వారణాసిగా జగత్‌ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రంలో ఉంది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీపట్టణం. గంగానది తీరంలో బౌద్ధ, జైన మతాలవారు, హైందవులు అనేకమంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు. అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది. 

విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్ష్మి శక్తిపీఠం ఉంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానదీ తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి.

10 . శ్రీత్రయంబకేశ్వరుడు
***********************************
మహారాష్ట్రలోని నాసిక్‌కు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబుకేశ్వరాలయం ఉంది. బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా వెలసి బ్రాహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలందుకొన్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

11 . శ్రీ కేధారేశ్వరుడు
*******************************
ఉత్తరాంచల్‌ రాష్ట్రంలో కేదారేశ్వలయం ఉంది. హిమాలయశిఖరం మందాకిని నదీతీరంలో సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఎద్దుమూపుర ఆకారంలో ఉందీ జ్యోతిర్లింగం.

గౌరీకుండ నుంచి 14కిలోమీటర్ల దూరం గుర్రాలుపై గానీ, డోలీలో గానీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి నవంబరు నెల వరకే ఈ ఆలయం తెరుస్తారు.

విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కల్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ.

బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి. అంతరాలయంలో నేటికీ పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి.

ఆదిశంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆదిదంపతుల కళ్యాణసమయంలో హోమగుండం, నేటికీ దర్శించవచ్చు. హరిద్వార్‌ నుంచి గౌరీకుండ్‌ వరకు బస్సు మార్గం ఉంది.

12 .శ్రీ ఘృష్ణేశ్వరుడు
*****************************
మహారాష్ట్ర ఔరంగబాద్‌ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీవిఘ్నేశ్వరాలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు, దేవగిరి కొండపై ఘృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది.