Search This Blog

Saturday 10 February 2018

SIVAMAHAPURANAM - TRIPURASURA SAMHARAM - PART II - 39


త్రిపురాసుర సంహారం - పార్ట్ 2



అందరూ కలిసి పరమశివుడు దగ్గరకు వెళ్లిశంభో శంకరాఅని పిలిచారు. ఆయన వచ్చివాళ్ళు తెల్లివారినప్పటినుంచి రాత్రి వరకు నా నామస్మరణ చేస్తుంటారు. నన్ను కొలుస్తూ ఉంటారు. నాపూజ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను చంపను. కానీ మీకొక మార్గం చెప్తాను. విష్ణువును అడగండి. ఆయన ఏదో ఒక మాయచేసి మిమ్మల్ని రక్షిస్తాడుఅని చెప్పాడు. దేవతలందరూ వైకుంఠమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని కీర్తించారు. ఆయన ప్రత్యక్షం అయిమీకు ఏమి కావాలిఅని అడిగాడు. వాళ్ళు జరిగిన కథంతా చెప్పారు. ‘ఒక చిన్న మాయ చేశారు విష్ణువు. సంకల్పం వలన ఒక పురుషుడు పుట్టాడు. వాడు బోడిగుండుతో, మాసిపోయిన బట్టలు కట్టుకున్నాడు. మాసిపోయిన గుడ్డనొకదానిని భుజంమీద వేసుకున్నాడు. చేతిలో పుర్రెనొకదానిని పట్టుకున్నాడు. పుడుతూనేధర్మం ధర్మంఅంటున్నాడు. వెంటనే శ్రీమన్నారాయణుడు అతనికిఅరిహన్అని నామకరణం చేసిఇప్పుడు నువ్వు వైదిక ధర్మమును పక్కన పెట్టేస్తూ సనాతన ధర్మం దారి తప్పి పోయేటట్లుగా వినడానికి చాలా అందంగా ఉండేటట్లుగా చక్కగా తేనె రాసిన విషంలా నీవు పదహారు వేల శ్లోకములతో ఒక సిద్ధాంతమును తయారుచేసుకుని, త్రిపురాసురులు పాలిస్తున్న పట్టణములకు వెళ్లి నువ్వు పెద్ద యతిలా కూర్చుని ప్రబోధం మొదలుపెట్టు. అపుడు క్రమక్రమంగా సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు అటువైపు వెళ్ళడం మొదలుపెడతారు. వారి ధర్మమూ లుప్తమయిపోతుంది. అపుడు వారిని సంహరించడానికి శివుడు వస్తాడు. కాబట్టి నీవు వెళ్లి బోధ చెయ్యిఅన్నాడు.
ఈయన త్రిపురాసురుల వద్దకు వెళ్ళాడు. అక్కడ ఎవ్వడూ ఆయన బోధ వినలేదు. అప్పుడు విష్ణువు నారదా, నీవు బయలుదేరి త్రిపురాసురుల దర్శనమునకు వెళ్ళు. వాళ్ళకి చెప్పవలసిన మాటలు చెప్పి మార్గమును సుగమం చెయ్యి అన్నాడు. అప్పుడు నారద మహర్షి త్రిపురాసురులలో పెద్దవాడు అయిన తారకాక్షుడి దగ్గరికి వెళ్ళినీ రాజ్యమునకు ఒక మహాపురుషుడు వచ్చాడు. అతడు చాలా గొప్ప సిద్ధాంతమును ఉపదేశిస్తున్నాడు. అతను చాలా గొప్పవాడు. అని చెప్పాడు. అయితే ఆయన ఇపుడు ఎక్కడ ఉన్నాడు అని తారకాక్షుడు నారదుని అడిగాడు. నారదుడు అరిహన్ ఉన్నచోటును చెప్పాడు. తారకాక్షుడు అరిహన్ ను పిలిపించి, ప్రబోధం చేయమని అడిగాడు. అరిహన్ చెప్పడం ప్రారంభించాడు. త్రిపురుడు వింటున్నాడు. అంతా ఈశ్వర కృప అంటూ ఉంటారు. ఎవడా ఈశ్వరుడు? ఇలాంటి తెలివితక్కువ మాటలు మానేయండి కంటికి కనపడని వాడికి పూజలు, యజ్ఞములు, యాగములు చెయ్యకండి అంటూ చెప్పాడు. అరిహన్ శ్రీమహావిష్ణువు సూచనల ప్రకారం ఇలా చెప్పి సమాజం పాడయిపోయే మాటలను తారకాక్షుడికి నూరిపోస్తున్నాడు. అరిహన్ చెప్పిన మాటలను వారు చెవులొగ్గి వినిఆహా ఎంత గొప్పగా చెప్పావయ్యా. మేము మందమతులం. ఇన్నాళ్ళు విషయములు మాకు తెలియలేదు. అని వెంటనే రాజ్యంలో ఉన్న వాళ్ళు అందరినీ వావి వరుసలు లేకుండా వారి వారి ఇష్టానుసారంగా భోగములు అనుభవించండి అని చెప్పారు. అంతే ఇంక శరీర సంబంధమయిన భోగం ప్రారంభం అయిపొయింది. పూజా పునస్కారములు లేవు, యజ్ఞయాగాదులు లేకుండా పోయాయి. దీనికంతటికీ కారణం వినకూడనిది వినడమే. ఇప్పుడు శ్రీమహావిష్ణువు, బ్రహ్మ మిగిలిన దేవతలు అందరూ కలిసి పరమశివుడి దగ్గరకు వెళ్ళిశంకరా, మీరు చెప్పినట్లుగా సర్వం సిద్ధం చేసేశాముఅని చెప్పారు. అప్పుడు శంకరుడువాళ్ళు పాపం చేశారు కాబట్టి దేవత సార్వభౌముడిగా వాళ్ళని సంహరించడం నాకు పెద్ద విశేషం కాదు. కానీ వాళ్ళు కొన్ని వారములు అడిగారు కదా! మరి వాటినన్నింటిని తెచ్చారా? అని అడిగాడు. అపుడు దేవతలుఅవన్నీ పట్టుకునే వచ్చాము అనగా శివుడు వాటిని తెమ్మని చెప్పాడు.
వాళ్ళు సమస్త లోకములలో ఉండే సారమును పిండి దానిని భూమండలం మీద రథములుగా మార్చారు. రథమునకు కుడిచక్రంగా సూర్యుడిని, ఎడమచక్రంగా చంద్రుడిని పెట్టారు. చక్రములకు ఆకులుగా ద్వాదశాదిత్యులను పెట్టారు. నక్షత్రములతో అలంకారం చేశారు. రథమునకు కమ్ములుగా ఋతువులను, ఆకాశమును కప్పుగా పెట్టారు. మందర పర్వతమును శివుడు కూర్చొనడానికి ఆసనంగా వేశారు. ఉదయాచలం హస్తాచలం అనే రెండు కొండలను నొగలుగా, సంవత్సరములను రథవేగంగా మార్చారు. ఉత్తరాయణ, దక్షిణాయనములను రెండు చక్రములకు శీలలుగా వేశారు. పంచభూతములను రథమునకు బలంగా కూర్చారు. వేదవేదాంగ పురాణములను రథమునకు గంటలుగా కట్టారు. గంగాది నదులను శివుడు కూర్చున్నప్పుడు చామరం వేయడానికి స్త్రీలుగా మార్చారు. బ్రహ్మగారిని సారధిగా కూర్చోబెట్టారు. ప్రణవమును గుర్రములను తోలడానికి కొరడాగా మార్చారు. మేరు పర్వతమును ధనుస్సుగా చేశారు. ఆది శేషుడిని అల్లెత్రాడుగా కట్టారు. సరస్వతీ దేవిని గంట కొట్టి బయలుదేరాలి కాబట్టి రథమునకు ముఖ్య గంటగా మార్చారు. శ్రీమహావిష్ణువు బాణంగా మారారు. వేదములను రథాశ్వములుగా సమకూర్చారు. మహర్షులు రథము ముందు గానం చేసేవారిగా బయలుదేరారు. రథం నడవలేదు. ఇంతమంది దేవతలు చేసిన నిర్మాణం విఫలం అయిపోయింది.
అప్పుడు స్థితికారుడుగా శ్రీమహావిష్ణువుదేవతలారా, మీరు రథమును లాగలేరు. నాకు, పరమశివునికి భేదం లేదు. కాబట్టి ఇప్పుడు నేనే ఆయనను కదపాలి అని శ్రీమహావిష్ణువు వృషభమయిపోయి రథమును లాగేయడం మొదలుపెట్టాడు. ఎలాగయితేనేం రథం కదిలింది. ఇప్పుడు శివుడు మేరు పర్వతమును ధనుస్సుగా పట్టుకుని, ఆదిశేషుడిని వింటినారిగా కట్టి టంకారము చేసి, శ్రీమహావిష్ణువును బాణంగా తీసుకుని లాగి విడిచిపెట్టాలి. అపుడు శంకరుడునేను సర్వలోక సృష్టి స్థితి ప్రళయకర్తను. నేను ఏదయినా చేస్తే అది నా అనుగ్రహం క్రిందకే వస్తుంది. మీకు బ్రహ్మగారు వరం ఇచ్చారు. నేను మిమ్మల్ని చంపలేనని అనుకుంటున్నారు. లోకమునందు లేని ఆయుధముతో చంపమని అడిగారు. నేను నా మూడవ కన్ను విప్పితే ఏమవుతారు? అని ఆగ్రహమును పొంది తెల్లటివారు ఎర్రబడి ఒక్కసారి కాల్చేద్దామని అనుకున్నాడు. కానీ వెంటనే పరమ దయా స్వరూపుడై త్రిపురాసురులను సంహారం చేయడం కోసమని మూడవ కన్ను విప్పబోతున్నాడు. రెప్ప కొద్దిగా కదిలింది. నాడు శ్రీ మహావిష్ణువు సోముడు కాలాగ్ని ఇవన్నీ కలిసి బాణంగా వచ్చిఈశ్వరా, ఒక్కసారి మీ చేతితో మమ్మల్ని స్పృశించి బాణమును పట్టుకుని మీ ధనుస్సును చేతితో పట్టుకుని ఆదిశేషుని వింటినారిగా మీరు వంగి కట్టి పైకి లేచి బాణమును తగిలించి ఆకర్ణాంతం లాగితే మీ చెవిదాకా వచ్చి మీలో ఉన్న శక్తి మాలోకి ప్రసరించాక, బాణము మీ ధనుస్సు నుండి విముక్తమై త్రిపురాసుర సంహారం చెయ్యాలని మాకు కోరిక. అందుకని మమ్మల్ని బాణంగా ముట్టుకోండి. అని పరమశివుని అడిగారు. అప్పుడు శంకరుడు నవ్వి బాణమును తీసుకుని సంధించి విడిచిపెట్టాడు. ఒక్క బాణమునకు త్రిపురాసురులు బూదికుప్పలై క్రిందపడిపోయారు. శంకరుని మీద బ్రహ్మాండమయిన పుష్పవృష్టి కురిసింది.
త్రిపురములను కాల్చడం అంటే ఏమిటి? త్రిపురములు మనలోనే ఉంటాయి. అవి స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరములతో జాగ్రత్, స్వప్న సుషుప్తి, సృష్టి స్థితి లయ అనబడే మూడూ జరుగుతుండడం. మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతికినా మూడు అవస్థలనూ అనుభవిస్తాడు. వీటితో పాటు నాల్గవదితురీయంఉంది. తురీయంలో ఉన్నవాడు మూడింటికీ సాక్షి. తురీయం చేరడానికి దానికి ముందు గల మూడు అవస్థలను తెలుసుకోవాలి. సాధారణంగా జనులు నాల్గవ దానికి వెళ్ళరు. నాల్గవది చేరడానికి మొదట భగవంతునియందు పరమభక్తి ఏర్పడాలి. అలా ఏర్పడకపోతే మీకెప్పుడూ మాయవలన ఇవే చాలా సుఖంగా ఉన్నాయని ఇంద్రియములతో లేవడం, శౌచం లేకుండా అన్ని పదార్థములను తినడం, ఇంద్రియములతో అన్నింటిని అనుభవించడం చేస్తూ జాగ్రత్ స్వప్న సుషుప్తి మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాడు. మూడు అవస్థలు మనకు చాలా సుందరముగా ఉంటాయి. అలా తిరగడమే త్రిపురసుందరి. అదే స్థూల సూక్ష్మ కారణ శరీరము. కానీ మూడు కాకుండా పరమ కారణ శరీరము అని ఒకటి ఉంది. దానిని తెలుసుకోవాలంటే ముందుగా భక్తితో ఈశ్వరుడి పాదములు పట్టుకోవాలి. పట్టుకుంటే ఆయన బాణం వేస్తాడు. బాణం తగిలితే త్రిపురములు కూలిపోతాయి. అప్పుడు స్థూల సూక్ష్మ కారణముల మీద మమకారం లేకుండా తురీయమునందు తాను సాక్షిగా మూడింటిని చూస్తాడు. స్థితి యందు ఈశ్వరుడు మనలను పైకెత్తడానికి ఆయనకు దయ ఉండాలి. దయ భక్తివలన కలుగుతుంది. కాబట్టి ఇపుడు త్రిపురులను దయతో చంపాలి. కాబట్టి త్రిపురసంహారం కేవలం శంకరుని అపారమయిన దయ వలన జరిగింది. కాబట్టి ఈశ్వరుడి లీలలలో త్రిపురాసుర సంహారమును గొప్ప లీలగా చెప్తారు.

No comments:

Post a Comment