Search This Blog

Sunday 11 February 2018

SIVAMAHAPURANAM - PARVATI KALYANAM - PART VI - 40


పార్వతీ కళ్యాణము – పార్ట్ 6

పార్వతీదేవి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైఅయ్యో పార్వతీ, నా గురించి ఇంత తపస్సు చేశావానీ అంతః సౌందర్యమును ప్రకాశింపజేయడానికి నేను ఇలా ప్రవర్తించాను. నేను నీవాడను. పార్వతీ మనం ఎప్పుడూ రెండుగా లేము. ఇద్దరమూ కలిసే ఉంటాము. కాబట్టి వచ్చి నందివాహనమును అధిరోహించు. కైలాసమునకు వెళ్ళిపోదాంఅన్నాడు. అపుడు పార్వతీదేవి మహానుభావా, నీవు ఎంతటి గొప్పవాడివో నాకు తెలుసు. నాది ఒక్క కోరిక. కాదనకుండా మన్నించాలి. నేను సతీదేవిగా ఉన్నప్పుడు నీవు నా పాణిగ్రహణం చేసినప్పుడు ఒక చిన్న వెలితి జరిగింది. మనం నవగ్రహారాధనతో కూడిన విధానంతో ఆనాడు మన కళ్యాణం చేసుకోలేదు. అలా చేసుకోలేక పోయినందుకు సతీదేవిగా నేను శరీరం వదిలిపెట్టాను. నీవు మా వారి వద్దకు వచ్చి కన్యను ఆపేక్షించలేదు. దక్షుడే వచ్చి పిల్లనిచ్చాడు. జన్మలో అలా కాకూడదు. నీవే పెద్ద మనుషులైన సప్తఋషులను మా నాన్నగారి దగ్గరకు పంపిమీ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నానుఅని అడగాలి. నన్ను కన్నందుకు మా నాన్నగారు పొంగిపోయిఅలాగే మా అమ్మాయిని ఇస్తానుఅని మాట ఇవ్వాలి. నీవు నీ పరివారమును అంతటినీ తీసుకుని ఆడపెళ్ళి వారింటికి రావాలి. అక్కడ జరిగే వివాహ తంతులో నన్ను నీదానిగా స్వీకరించి మా తండ్రి అయిన హిమవంతుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా చందన తాంబూలాది సత్కారములు చేసి పొంగిపోతే అపుడు కన్యాదానం చేసిన ఫలితం మానాన్నగారికి పూర్ణంగా కలుగుతుంది. తరువాత నీవు నన్ను కైలాసమునకు తీసుకువెళ్ళాలి. శంకరా, జన్మలో నాకలా పెళ్ళి చేస్తానని మాటిస్తావా?’ అని అడిగింది. అది అమ్మవారి కోరిక. శంకరుడు అందుకు అంగీకరించి కైలాసమునకు వెళ్ళిపోయాడు
తదనంతరము పార్వతీదేవి తన తపస్సును విరమించినదై ఆమె కూడా హిమవత్పర్వతమునకు చేరుకుంది. తండ్రి హిమవంతుడు కూతురు ముఖంలో కనపడుతున్న ఆనందం చూసిఅమ్మా ఈవేళ నీ కళ్ళు అరవిరిసిన తామరపువ్వుల్లా ఉన్నాయి. నీ ముఖం చాలా కాంతివంతంగా ఉన్నది. నీవు చాలా సంతోషంగా ఉన్నావు. నీ చెలికత్తెలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఏమిటమ్మా విశేషం?’ అన్నాడు. పరమశివదర్శనం పరమశివుని అనుగ్రహం తన కుమార్తె అయిన పార్వతీదేవి పొందినది అని ఆయన గ్రహించాడు. చెలికత్తెలందరూ పార్వతీదేవి వెళ్లి తపస్సు చేసిన విధానము, శంకరుడు ప్రత్యక్షం కావడం, శివనింద చేసి పార్వతీదేవి మనస్సు స్థితిని ఆవిష్కరించిన విధానం, అమ్మవారి శివభక్తి లోకమునకు ఆవిష్కరింపజేసిన విధానం తదనంతరం శంకరుడు సంతోషించి తానే కన్యను అపేక్షించడం కోసం పెద్ద మనుష్యులను కైలాసం నుండి పంపిస్తానని ప్రతిజ్ఞచేసిన వృత్తాంతం హిమవంతునికి చెప్పారు. అపుడు హిమవంతుడు తన కుమార్తెతోఅమ్మా, పార్వతీ, నువ్వే నన్ను అనుగ్రహించి నీవు నాకు కుమార్తెగా జన్మించావు. అంతేకాని యథార్థమునకు నిన్ను కుమార్తెగా పొందడానికి నాకు అర్హత ఉన్నాడని చెప్పడానికి నా దగ్గర ఏమి ఉన్నది! కానీ నువ్వు జన్మించి నాకు ఎన్నో గొప్ప విషయములను ఇచ్చావు. దేవతలు ఈవేళ నన్ను స్తోత్రం చేస్తున్నారు. ఈవేళ నా రాజ్యంలోకి ఎవరూ తొంగిచూడలేరు. ఇపుడు నేను శక్తి స్వరూపమయిన అమ్మవారికి తండ్రిని. శంభునికి మామగారు హిమవంతుడు అనే పేరు ప్రఖ్యాతులు ఈవేళ నేను పొందగలుగుతున్నాను. అని కూతురిని చూసుకుని పొంగిపోయాడు
ఇపుడు కైలాసపర్వతం మీదకు శంకరుడు సప్తర్షులను పిలిచాడు. శంకర దర్శనం అంటే మాటలు కాదు. ఆయనే స్వయంగా పిలిచే సరికి ఎంతో సంతోషంతో సప్తర్షులు గబగబా కైలాసమునకు వెళ్ళారు. వాళ్ళు లోపలికి వెడుతూనే నమస్కారం చేసి భూమిమీద ప్రణిపాతం చేసి శరణుచెప్పారు. శంకరుడు వాళ్ళ యోగ్యతను గుర్తించి వాళ్ళను కూర్చోబెట్టి ఇలా చెప్పాడునా వివాహమునకు మీరు పెద్దలుగా ఉండాలి అని చెప్పారు. పార్వతీ పరమేశ్వరుల పెళ్ళిలో వారిద్దరికీ అనుసంధానం చేసే పదవిని పొందినందుకు అటువంటి అదృష్టం తమకు కలిగినందుకు సప్తర్షులు పొంగిపోయిఏమి మా అదృష్టము! వేదముల చేత కూడా చూడబడని పరమాత్మ ఈవేళ మాకు సాకారరూపుడై పిలిచి దర్శనం ఇచ్చి పనిచేసి పెట్టమని అడుగుతున్నాడు. మమ్ములను ధన్యులను చేస్తున్నావు. మేము ధన్యులం అయ్యే కార్యం ఏమిటో మాకు చెప్పు తండ్రీఅని అడిగారు. అపుడు శంకరుడు నవ్విహిమవంతునికి పార్వతీదేవి అనే కూతురు ఉంది. మీరు వెళ్లి ఆయనతో, ఆయన భార్యతో మాట్లాడి అమ్మాయితో నాకు వివాహం కుదిరేటట్లుగా మాట్లాడండి. అమ్మాయితో నాకు సంబంధం కలగడం కోసమని ఒకవేళ అవతలివాళ్ళు ఏదైనా పణం అడిగినట్లయితే దానిని మీరు పెట్టి రండి. అంత అందమయిన పార్వతీదేవిని నాకిచ్చి వివాహం చేసేటట్లుగా మాట్లాడి రండి. మీరు వెళ్ళి మాట్లాడి వచ్చేసేటప్పుడు పాల అన్నం తినిరండి. తప్పకుండా వారు అంగీకరించేలా చేసి రండి. ఇది నాకు చాలా ఇష్టమయిన పని. దీనిని మీరు జాగ్రత్తగా చేసుకురావాలి. ఇప్పుడే ఇక్కడి నుంచే హిమవంతుడి దగ్గరకు వెళ్ళండిఅని చెప్పాడు.
దానికి సప్తర్షులు పరమ సంతోషముతో అంగీకరించి అక్కడినుండి బయలుదేరారు. అరుంధతీదేవి ఒక్కతీ మాత్రం సప్తర్షులతో పాటు బయలుదేరింది. అరుంధతిని మాత్రం పక్కకు పిలిచి ఒక రహస్యం చెప్పాడు శంకరుడు. ‘నువ్వు స్వతంత్రంగా లోపలకు వెళ్ళి హిమవంతుని భార్యయైన మేనకాదేవితో మాట్లాడుతూ నేను అన్ని విధములా పార్వతీ దేవికి తగినవాడినేఅని నచ్చచెప్పాలి. శంకరుని మాటలకు అరుంధతి కొంచెం ఆశ్చర్యపోయి అలాగే స్వామీ అని చెప్పింది. ఇప్పుడు సప్త ఋషులు, అరుంధతి హిమవంతుని పట్టణమునకు చేరారు. హిమవంతుడు సప్తర్షులను చూసి గబగబా బయటికి వచ్చి వారితోమీరు కబురు చేస్తే నేను రావాలి. మీరు మా ఇంటికి రావడమా! నేను చాలా సంతోషపడి పోతున్నాను. నేను ఎంత పుణ్యం చేశానో! మీరు కార్యం మీద వచ్చారో, నేను ఏమి చేయాలో దయచేసి తెలపండిఅన్నాడు. అపుడు సప్తర్షులునీ కూతురు పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని శంభుదేవుడు అనుకుంటున్నాడు. పిల్లను అడగమని ఆయన తరపున మా ఏడుగురిని పంపించాడు. అందుకని మేము విషయం మాట్లాడడానికి వచ్చాముఅన్నారు. అపుడు హిమవంతుడుశంకరుడు మా అమ్మాయిని అడగడం నిజంగా నన్ను చాలా పెద్ద చేయడం. ఆయన ఆజ్ఞాపిస్తే చాలు. ఆయన నా కుమార్తెను అనుగ్రహించి ప్రత్యక్షం అయి తీసుకు వెళ్ళిపోతే చాలు! నీ పిల్లని పంపు అని నాకు కబురు చేస్తే చాలు కానీ అలా చేయకుండా ఎంతో మర్యాదతో సప్తర్షులను నాకు పెళ్ళివారిగా పంపాడా! శంకరుడు నన్ను ఎంత పెద్దవాడిని చేశాడు! తల్లి పార్వతీదేవి ఆయన సొత్తు. నేను ఆయనకు ఇవ్వడమా. నన్ను అనుగ్రహించదానికి కొన్నాళ్ళపాటు మా ఇంట్లో పెట్టాడు అంతే. ఆయనదయిన సొత్తు ఆయనకే ఇమ్మనమని నన్ను ప్రార్థించి అడగడం ఆయన నన్ను పెద్దవాడిని చేసి పుణ్యం కట్టబెట్టడం తప్ప వేరొకటి కాదు. పైగా శంభుడు నాకు దైవము. నేను ఆయనకు దాసుడను. నేను ఆయన కింకరుడను. ఆయన నన్ను చేయమని ఆజ్ఞాపించాలి. నన్ను అర్థించమని సప్తర్షులను పంపడమా! ఎంత గొప్ప విషయంఅని అనుకున్నాడు. ఈలోగా సప్తర్షులు వచ్చారు తన పిల్లను అడుగుతున్నారు అని మేనకాదేవికి వార్త వెళ్ళింది. ఆవిడ ఎంతో సంతోషంగా తన కూతురుని కూడా వెంటబెట్టుకుని అక్కడికి వచ్చింది. హిమవంతుడుఅయ్యా, మా అమ్మాయి వచ్చింది చూడండి, మీరు నిర్ణయించండిఅన్నాడు. హిమవంతుడు గొప్ప అదృష్టవంతుడు. సప్తర్షుల రాకవలన హిమవంతుడు పావనుడయ్యాడు. రాత్రివారు అక్కడ నిద్రించారు. వారు ఏడుగురు పాలకూడులు తిని పడుకుని మరునాడు పొద్దున్న దేవతార్చన చేసుకుని బయలుదేరబోతుంటేఅయ్యా మహాత్ములు మీరు మా ఇంటికి వచ్చారు చాలా సంతోషం అని మేనకా హిమవంతులు ఏడుగురు సప్తర్షులకు అరుంధతీదేవికి బట్టలు పెట్టారు. వాళ్ళు వాటిని స్వీకరించి పరమసంతోషంగా కైలాసం వెళ్ళి అక్కడ శంకరునికి పార్వతీదేవి గురించి చెప్పడం ప్రారంభించారు. ‘శంకరా పార్వతీదేవికి ఉన్న లక్షణములు మరెవ్వరియందు లేవు. ఆవిడ ముఖమునకు ఆవిడ ముఖమే సాటి అని చెప్పి ఆమె ఎలా ఉంటుందో చెప్పాలనుకుంటే ఆమె అందమును నాలుగు ముఖములు ఉన్న చతుర్ముఖ బ్రహ్మ కూడా చెప్పలేడు. ఆవిడ అటువంటి అందగత్తె. వాళ్ళు పిల్లనిస్తానన్నారు అని చెప్పారు.
వీరిమాటలు విని శంకరుడు చాలా సంతోషించాడు. సప్తర్షులు వివాహ శుభలేఖ వ్రాసేశారు. పెళ్ళికి ముహూర్తం పెట్టాలి కదా! బ్రహ్మగారిని మనస్సులో తలుచుకున్నాడు. వెంటనే బ్రహ్మ అక్కడకు వచ్చాడు. ముహూర్తం పెట్టమని అడిగాడు. బ్రహ్మముహూర్తం పెట్టాడు. శుభలేఖలు వేసేశారు. అందరూ మగపెళ్ళి వారయిన శంకరుని ఇంటికి వచ్చేస్తున్నారు. దేవతలందరూ వచ్చారు. వచ్చిన దేవతలందరితో కలిసి పరమేశ్వరుడు కూడా బయలుదేరాడు. సమస్త లోకములలో ఉన్న దేవతలు, ఋషులు, దిక్పాలురు, నారదుడు అందరూ శంకరుడి వెనక పెద్ద ఊరేగింపుగా బయలుదేరారు.
శంకరుడు పెళ్ళి కొడుకు కదా! ఒంటినిండా భస్మమును రాసుకున్నాడు. పాములను పెట్టుకున్నాడు. పట్టు పుట్టమునొకదానిని కట్టుకున్నాడు. దానిమీద చక్కగా ఏనుగు తోలును కప్పుకున్నాడు. చక్కని జటాజూటమును కట్టుకుని నీలకంధరముతో దేవతలు ఋషులు కొలుస్తుండగా బయలుదేరుతున్నాడు. నందీశ్వరుడు ఆనందంతో పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నాడు. వీళ్ళ మీద నుంచి వచ్చే గాలి చప్పుడు దిక్కులను కప్పేస్తోంది. కొన్ని కోట్లమంది అన్ని లోకములనుండి పెళ్ళికి బయలుదేరి పోతే బరువు ఒక్కచోటికి వెళ్ళిపోయేటప్పటికీ ఇంకా శేషుడు భూమిని పట్టుకోలేక ఒక పక్కకి వంగిపోయాడు.

No comments:

Post a Comment