Search This Blog

Sunday 11 February 2018

SIVAMAHAPURANAM - PARVATI KALYANAM - PART IV - 40


పార్వతీ కళ్యాణము – పార్ట్ 4

తల్లి పార్వతీ దేవికి శంకరుడి యందు ప్రేమ ఉన్నది. తొందరగా ఆయన ప్రక్కకు భార్యగా చేరాలనే తలంపు ఉన్నది. కాబట్టి ఆయన కన్నులు మూసుకుని ధ్యానమునందు ఉన్నప్పుడు తాను పని చేసుకుంటున్నట్లుగా ఉంటూ పలుమార్లు శంకరుని సౌందర్యమును వీక్షిస్తూ ఉండేది. పలుమార్లు శంకరుడికి దగ్గరగా వెళ్ళడానికి ఇష్టపడేది. కానీ ఆయన బహిర్ముఖుడైనప్పుడు ఆయన తేజస్సు, ఆయన నిష్ఠ, ఆయన తపశ్శక్తి చూసి అడగలేక ఉండిపోయేది. అలా ప్రతిరోజూ పరిచర్య చేస్తూ ఉండేది. ఇలా ఎంతకాలమో జరిగిపోయింది. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయితే తప్ప తారకాసుర సంహారం జరగదు. అందుకని దేవతలందరూ బాగా ఆలోచించి ఒకరోజున బ్రహ్మదగ్గరకు వెళ్ళారు. వాళ్ళలో పెద్ద అయిన బృహస్పతి బ్రహ్మతో ఒక మాట చెప్పాడుస్వామీ శంకరుడు పార్వతీ ఇద్దరూ ఒకరివైపు మరొకరు చూసుకోవడం లేదు. వాళ్ళిద్దరికీ వివాహమై ఒక కొడుకు పుడితే తప్ప తారకాసురుడు సంహరింపబడడు. సుబ్రహ్మణ్యుడు పుట్టాలి. రాక్షసుడయిన తారకాసురుని సంహరించాలంటే వారిద్దరికీ వివాహం అవ్వాలి. ఏమి చేద్దాము? అని అడిగాడు. అపుడు బ్రహ్మకూడా కించిత్ మాయకు వశుడయ్యాడు. బృహస్పతి దేవేంద్రుడికి కబురు చేద్దాం దేవేంద్రుని ఆజ్ఞకు ఎదురులేదు. మన్మథుని పిలిపిద్దాము. మన్మథుడు బాణం వేస్తె ఎంతటి వాడయినా వశుడవుతాడు. తరువాత సుబ్రహ్మణ్యుడు పుడతాడు. తారకాసుర సంహారం అయిపోతుంది అని చెప్పాడు. ఇప్పుడు మన్మథుని పిలిపించాలి
ఇంద్రుడు ఒక్కసారి మన్మథుని స్మరించాడు. దేవేంద్రుడు మన్మథుని తలచుకునే సమయానికి మన్మథుడు రతీదేవితో కలిసి ఉన్నాడు. ఒక్కసారి దేవేంద్రుడు మనస్సులో స్మరించగానే ఇంద్రుడు తనను పిలుస్తున్నాడనే విషయం ఆయనకు అందింది. వెంటనే దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళాలి అని చెప్పగా రతీదేవి నేను కూడా వస్తాను అని చెప్పిడ్ని అపుడు మన్మథుడు సాక్షాత్తు రాచకార్యం మీద వెడుతున్నాను అక్కడికి నీవు నాతో వస్తాను అని అనకూడదు. నువ్వు రాకూడదు. నేను వెళ్ళి విషయం ఏమిటో కనుక్కుని వస్తాను. అని చెప్పి మన్మథుడు బయలుదేరి దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళాడు
మన్మథుడు ఇంద్రుని దర్శనం చేసుకుని ఆయన ఇచ్చిన ఉచితాసనం మీద కూర్చున్నాడు. ఇంద్రుడు మన్మథునితో విషయం చెప్పాడు. ఇంద్రుని మాటలు విన్న మన్మథుడు మొహం అదోలా పెట్టాడు. అపుడు ఇంద్రుడు నీతోపాటు వసంతుడిని పంపిస్తాను. తుమ్మెదలు వస్తాయి. శంకరుని సమీపంలో చాటుగా నిలబడి ఒక పూలబాణం తీసి వింటినారికి సంధించి ఎక్కుపెట్టి గురిచూసి ఒక బాణం కొట్టు. బాణం తగులుతుంది. వెంటనే ఆయన పార్వతీ దేవితో అనురాగంలో పడిపోతాడు. అపుడు నీవు సంతోషంగా తిరిగి వచ్చెయ్యి. బయలుదేరు అన్నాడు. అప్పుడు మన్మథుడు అయ్యా ఇంద్రా, నేను వచ్చి ఒకవేళ తెలియక శంకరుని మీద బాణం వేస్తానంటే మీరు ఖండించాలి. అలా అనడం మానేసి మోహాతీతుడయిన శంకరుని మీద నన్ను బాణములు వేయమంటున్నారేమిటి? శంకరుడు కానీ బహిర్ముఖుడు అయిపోతే ఆయన ప్రతాపాగ్ని ముందు నేను నిలబడలేను. ఒకవేళ నిలబడినా శంకరుడు పాశుపతాస్త్రం తీస్తాడు. నాదగ్గర పూల బాణములు ఉన్నాయి. పాశుపతాస్త్రం ముందు నా పూలబాణం నిలబడలేదు. ఒక వేళ అలా నిలబడినా శంకరుడికే మొహం కల్పించి ఇంటికి వస్తే శంకరుడిని నేను గెలిస్తే, శంకరుడి మీద బాణ ప్రయోగం చేసి ఇంటికి వస్తే మా నాన్నగారు నారాయణుడు అసలు నన్ను ఎలా చూస్తాడో అని నేను వణికిపోతున్నాను నువ్వు చెప్పింది ఎలా ఉన్నదంటే ఒక దూడను వెళ్లి సింహంతో యుద్ధం చేయమని పంపించినట్లు ఉంది. నేనెక్కడ శంకరుడెక్కడ! అన్నాడు
చివరికి భయపడుతూ భయపడుతూ సగం చచ్చి శంకరుని మీద పుష్పబాణం ప్రయోగం చేయడానికి వెళ్ళాడు. ముందుగా తను బయలుదేరేముందు తన సంపద తన గర్వము తన మదము అన్నింటినీ కూడదీసుకున్నాడు. మీరు ముందే వెళ్లి పరమశివుడికి అనురాగం కలిగేటట్లుగా ఉండడం కోసమని చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ ఎక్కి కూర్చోండి. ఆయన తొందరగా బహిర్ముఖుడు అయ్యేలా ఆహ్లాదకరంగా కూతలు కూయండి అని కొన్ని వేల కోయిలలను పంపాడు. తుమ్మెదలను పిలిచి మీరందరూ వెళ్ళండి అక్కడ భ్రుంగముల సవ్వడి మృదంగములు మోగిస్తున్నట్లుగా ఉండాలి. ఆయన కళ్ళు విప్పి చూసేసరికి అన్ని పువ్వుల మీద వాలి రెక్కలు టపటప లాదితున్న భ్రుంగములను శంకరుడు చూసి ఆయన మనస్సు మళ్ళాలి. అందుకని మీరు వెళ్ళండి అని చెప్పాడు. వసంతుడిని పిలిచి ఎక్కడ చూసినా నవవసంత శోభావిలసిత ప్రదేశం చేసెయ్యి. చెట్లన్నీ పూలు పూసేయ్యాలి. ఎక్కడ చూసినా సుగంధములు వచ్చెయ్యాలి. చక్కగా మెల్లగా నదులు పారుతూ ఉండాలి. చెట్లమీద పక్షులు కూర్చుని మైథునంతో ఉండాలి. పశువులు పక్షులు అన్నీ అదే వాతావరణంలో ఉండాలి. శంకరుడు కళ్ళు విప్పి ఎటు చూసినా ఆయన దృష్టి స్త్రీపట్ల అనురక్తమయ్యేటట్లుగా చేయాలి. అందుకని వసంతుడా నువ్వు బయలుదేరు అన్నారు. అందరికీ ఆయా పనులను పురమాయించి చేపను ధ్వజంగా కలిగిన లోకంలో తపస్సు చేసుకునే వారిని పడగొట్టగలిగిన మన్మథుడు తన బాణములతో శంకరుని వద్దకు బయలుదేరి వెళ్ళాడు. తాను అక్కడికి వెళ్ళేటప్పటికి తుమ్మెదలు గండు కోయిలలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అప్పుడే అమ్మవారు శివార్చన పూర్తి చేసుకుంది. శంకరుడు బహిర్ముఖుడు అయ్యాడు. అమ్మవారు వెళ్ళి స్వామివారి పాదముల మీద పుష్పములు వేద్దామని వెళ్ళి వంగి పుష్పములను సమర్పిస్తోంది. శంకరుని దృష్టి యందు మార్పులేదు. మన్మథుడు ఇదే అదనని శంకరుడికి కనపడకుండా ఉండే ఒక దట్టమయిన లతావితానంలో నిలబడి బాగా గురి ఎక్కు పెట్టాడు. తుమ్మెదల తాడులాంటి వింటినారికి మొదటి పుష్ప బాణమును కలువ రేకులతో తొడిగాడు. ఆకర్ణాంతం లాగి శంకరుడు మళ్ళీ కళ్ళు గబుక్కున మూసేస్తాడేమోనని శంకరుని మీద గురిపెట్టి బాణం వదిలాడు. బాణం వెళ్లి శంకరుని గుండెల మీద తగిలింది. బాణం కనపడదు. శంకరునియందు వికారం కలిగింది. ఎప్పుడయితే వికారం కలిగిందో ఆయన వెంటనే తనపట్ల వ్యగ్రతతో ప్రవర్తించాడని తన మీద బాణం వేశాడని గుర్తించాడు. ఆయన బాణమునకు వశుడు కాలేదు. బాణము వేయబడిందన్న విషయం గుర్తించాడు. పార్వతీదేవి వంక ఆయన చూపులో మార్పులేదు. పరికించి చూసి వేయబడినది పుష్ప బాణం కాబట్టి అది ఖచ్చితంగా మన్మథుడు చేసిన పనియే అని గుర్తించి చూట్టూ చూశాడు. ఒక పొద దగ్గర మన్మథుడు శంకరుడిపై రెండవ బాణమును వేయడానికి సిద్ధపడుతున్నాడు. అలా సిద్ధపడుతున్న మన్మథుని శంకరుడు చూసి ఆగ్రహంతో తన జ్ఞాన నేత్రమును మంద్రంగా రెప్ప విప్పేసరికి భుగభుగమంటూ అందులోంచి మంటలు పైకి వచ్చాయి. అపుడు సమస్త బ్రహ్మాండములు వేడెక్కాయి. అగ్నిహోత్రం దూరంగా ఉన్న మన్మథుడి దగ్గరకు ప్రయాణం చేసింది. ఎప్పుడయితే పరమశివుని మూడవకంటి నుండి అటువంటి చిచ్చు బయలుదేరిందో అమ్న్మతుడు నిశ్చేష్టితుడై ఏమి చేయాలో అర్థంకాక అలా నిలబడిపోయి ఉండిపోయాడు. పరమశివుడు విడిచిపెట్టిన అగ్నిహోత్రం మన్మథుని మీదకు వచ్చి మన్మథుడు భస్మరాశియై క్రిందపడిపోయాడు
రతీదేవి భర్త పొరపాటుకు చింతిస్తోంది. నేను ఎన్నో నోములు నోచాను. కాబట్టి మరల నాకు అయిదవ తనమును ఇప్పించరా! మీరు అందరూ మేరకు పరమేశ్వరుని అడగరా? మీరు అందరూ అడిగితే పరమేశ్వరుడు నా భర్తను బ్రతికిస్తాడుఅని ప్రార్థిస్తూ విలపించింది. వసంతుడా కాముడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి నేను కూడా వెళ్ళిపోతాను కాబట్టి చితి పేర్పించు. నేను అగ్నిలో ప్రవేశించి మన్మథుని చేరుకుంటాను అంది. అపుడు వసంతుడు అమ్మా, నీవు తొందరపడి అగ్నిహోత్రంలో ప్రవేశించవద్దు. కొద్దికాలంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానంతరం పార్వతీ పరమేశ్వరులు సంతోషంగా కూర్చుంటారు. పరమేశ్వరుడు భక్త వత్సలుడు. తప్పకుండా నీకు వరం ఇస్తాడు. తప్పకుండా నీ భర్తను మరల బ్రతికిస్తాడు అన్నాడు. జనులందరూ ఆశ్చర్యపడి పోయేటట్లుగా అశరీరవాణి పలికింది. శరీరం లేకుండా పలుక కలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడే పలికాడని అర్థం చేసుకోవాలి. ‘వసంతుడు నీకు చెప్పినది సత్యమే. తొందరలో నీ భర్త సశరీరుడిగా కనపడతాడు. కానీ ఈలోగా ఆయన నీకు అనంగుడిగా శరీరంతో లేకపోయినా నీకు మాత్రం కనపడుతుంటాడు రాబోవు కాలంలో కృష్ణ పరమాత్మకు కుమారుడిగా ప్రద్యుమ్నుడిగా నీ భర్త జన్మిస్తాడుఅని అశరీరవాణి పలికితే రతీదేవి చాలా సంతోషించింది. తన భర్త మరల తనను ప్రద్యుమ్నుడిగా కలుసుకునే తరుణం కోసమని ఎదురు చూస్తోంది. ఆమె పరమ సంతోషంతో పసుపు కుంకుమలతో ఆనందంగా తిరిగి వెళ్ళిపోయింది
పరమశివుడు కూడా ఇంత ఉద్ధతి జరిగిపోయింది. మన్మథుడు కాల్చబడ్డాడు తన తపస్సుకు భంగం కలిగింది అని అక్కడినుంచి వెళ్ళిపోయాడు. హిమవంతుడు వారగా విని గబగబా అక్కడకు వచ్చాడు. అక్కడ ఆందోళనతో విచారంతో ఉన్న కూతురు పార్వతీదేవిని తీసుకుని వేగంగా హిమవంతుడు తన అంతఃపురమునకు వెళ్ళిపోయాడు.

No comments:

Post a Comment