Search This Blog

Sunday 11 February 2018

SIVAMAHAPURANAM - PARVATI KALYANAM - PART II - 40

పార్వతీ కళ్యాణముపార్ట్ 2

సతీదేవి అలా పడిపోవడంతోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ గబగబా లేచారు. “వీడు తండ్రి కాదు. వీడు అనుభవించి తీరుతాడు. ఉపద్రవం వస్తుంది. వీడు జగత్తునందు పరమ అపఖ్యాతిని పొందుతాడు. ప్రజాపతికి లేని అపకీర్తిని దక్షుడు పొంది తీరుతాడు. అమ్మవారిని కూతురిగా పొంది పరమశివుడిని అల్లుడిగా పొందినా, దక్షుడి పేరు గుర్తు వచ్చేసరికి దక్షయజ్ఞవిధ్వంసం జ్ఞాపకమునాకు వచ్చేటట్లుగా యజ్ఞం విధ్వంసం అయి తీరుతుందిఅనుకున్నారు. ఎప్పుడయిత అమ్మవారు యోగాగ్నియందు భస్మం అయిపోయిందో అక్కడ ఉన్న రుద్రగణములన్నీ ఒక్కసారి లేచాయి. లేచి వాళ్ళు దక్షుడి మీదికి వెళ్ళబోయారు. అక్కడ భ్రుగువు ఉన్నాడు. ఆయనది అర్థం లేని ఆవేశం. ఆనాడు దక్షుడు శంకరుడిని తిడుతుంటే భ్రుగువు కళ్ళు మిటకరించి ఇంకా తిట్టమని కనుబొమలు ఎగరేశాడు. ఇపుడు సతీదేవి యోగాగ్నిలో శరీరమును వదిలేసింది. భ్రుగువు చాలా సంతోషపడిపోయాడు. రుద్రగణములు కూడా ఓడిపోవాలని వెంటనే అక్కడ గల హోమవేది దగ్గరకు వెళ్ళి యజ్ఞగుండంలో అభిచారహోమం చేసి, దానిలోనుండి కొన్ని వేలమంది వీరులను సృష్టించాడు. వాళ్ళందరూ వెళ్ళి రుద్రగణములను తరిమి కొట్టేశారు. అది చూసి దక్షుడు చాలా సంతోషపడ్డాడు. సంతోషంతో దక్షుడు తన నిరీశ్వర యాగమును చేయడము కొనసాగించాడు
విషయం నారదుడు వెళ్ళి శంకరునికి చెప్పాడు. ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారిగా తన ఆసనం మీద నుంచిలేచాడు. ఇపుడు అమ్మవారు శివుడిని రుద్రుడిగా మార్చింది. గర్జన చేసి పెద్ద నవ్వు ఒకటి నవ్వాడు. మెరిసిపోతున్న తన జటాజూటంలోంచి ఒక జటను పీకి, పుట్టిన కోపమును అణచుకోలేక నేలకేసి కొట్టాడు. జట సరిగ్గా నేలకు తగిలేసరికి అందులోంచి ఒక పురుషుడు ఆవిర్భవించడం మొదలయింది. నల్లటి శరీరంతో ఒక పెద్ద పురుషుడు పుట్టాడు. పక్కన పెద్దపెద్ద కోరలు మెరుస్తున్నాయి. ఆయనకు వేయి చేతులు ఆవిర్భవించాయి. వేయి చేతులతో వేయి ఆయుధములు పట్టుకున్నాడు. కోపంతో ఊగిపోతున్నాడు. అంత ఊగిపోతూ వేయి ఆయుధములతో ప్రహారం చేస్తూ కనపడ్డవారిని కనపడ్డట్లు సంహరించడానికి వేరొక ప్రళయకాలరుద్రుడిలా అక్కడ సాక్షాత్కరించాడు. తండ్రి అయిన శంకరుని చూడగానే వేయి చేతులతో ఒక్కసారి నమస్కారం చేసి, మోకాళ్ళ మీద కూర్చుని తలను శంకరుని తాటించి తల ఎత్తి పాదములకు ఘోరరూపంలో ఉన్న శంకరుని వంక చూసినన్ను ఎందుకు పుట్టించారు? ఏమి ఆజ్ఞ? నేను ఏమి చెయ్యాలి? నన్ను వెంటనే ఆదేశించండిఅన్నాడు. శంకరుడుదక్షుడు నీ జనని అయిన సతీదేవి పట్ల అపచారంతో ప్రవర్తించాడు. నిరీశ్వర యాగం చేస్తున్నాడు. నీవు వెంటనే బయలుదేరి వెళ్ళి యజ్ఞ ధ్వంసం చెయ్యిఅన్నాడు. వీరభద్రుడు శంకరునికి ఒకమారు ప్రదక్షిణ చేసి బయలుదేరాడు. ఆయనను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన వెనక ప్రమథగణములు అన్నీ బయలుదేరాయి. ఆయన శరీరం చేత పెద్ద చీకట్లు పుట్టాయి. ఎక్కడ చూసినా ధూళి పైకి రేగుతోంది. దక్షయజ్ఞంలో కూర్చున్న వాళ్ళుఏమిటి ఇంత ధూమం పుడుతోంది. ఒకవేళ మనం చేసిన దారుణమయిన పనిచేత మహానుభావుడయిన శంకరుడు కోపమును పొందినవాడై దక్షయజ్ఞ ధ్వంసమునకు పూనుకోలేదు కదా అని భయపడుతున్నారు. ఈలోగా వీరభద్రుడు రానే వచ్చాడు.
వీరభద్రుని చూడగానే దేవలోకాధిపతినని తనను పట్టుకుంటాడేమోనని ఇంద్రుడు లేచి పరుగెత్తడం ప్రారంభించాడు. వెనక చంద్రుడు పరుగెత్తుతున్నాడు. అప్పటివరకు యాగాగ్నియందు ఉన్న అగ్నిహోత్రములు పురుషరూపం దాల్చి పారిపోతున్నాయి. మీరు ఎక్కడికి పారిపోయినా మిమ్మల్ని పడగొట్టి గుద్దేస్తాను అని తన వేయి చేతులతో పట్టుకుందుకు వారి వెంటపడ్డాడు. యజ్ఞ శాలలో మొట్టమొదట రుద్రగణములు సంహరింపబడ్డాయి కాబట్టి ముందుగా వీరభద్రుడు నువ్వెవరు వాళ్ళ ఉసురు తీయడానికి శంకరుని ఎడమ కాలి దెబ్బకు లేచిపోయిన వాడివి నువ్వు అని ముందుగా యమధర్మరాజును పట్టుకుని ఆయన రెండు చేతులను వెనక్కి విరిచి తిప్పి ఒక్క తోపు తోసి తన కుడికాలి పాదంతో యమధర్మరాజు గుండెలమీద నొక్కిపెట్టి పిడిగుద్దులతో డొక్కలలో కొడుతుంటే యమధర్మరాజు ప్రక్కటెముకలు విరిగిపోయాయి. మిగిలిన దేవతలు ఇది చూసి పారిపోతున్నారు. ఈలోగా ప్రక్కకి చూసేసరికి సరస్వతీ దేవి ఎంతో సంతోషంగా కళ్ళు మూసుకుని వీణ వాయిస్తోంది. అన్నగారికి అవమానం జరుగుతూ యాగం జరుగుతుంటే నీవు ఇక్కడకు వచ్చి కూర్చుని వీణవాయిస్తున్నావు. నీకు యాగం కావలసి వచ్చిందా అని చిటికిన వేలు పెట్టి ముక్కు గిల్లెశాడు. ముక్కు ఊడిపోయి క్రింద పడిపోయింది. ఆమె వికృతరూపం చూసి అక్కడ ఉన్న అందరు కాంతలు లేచి పరుగులు మొదలుపెట్టారు. వీరభద్రుడు భ్రుగువు దగ్గరకు వెళ్ళి ఆయనను పట్టుకుని నువ్వేనా ఆరోజున బ్రహ్మసభలో శంకరుని దక్షుడు నింద చేస్తుంటే ఎగతాళి చేశావు. అని ఆయన గడ్డమును తన చేతికి ముడి వేసుకుని ఒక్క లాగు లాగాడు. అపుడు భ్రుగుని గడ్డం మొత్తం ఊడిపోయి నెత్తురు వరదలయిపోయింది. మీసములను లాగేశాడు. బొటనవేలితో భ్రుగుని రెండు కనుగుడ్లు ఊడబెరికేశాడు. శంకరనింద చేస్తే ఎలాంటి గతి పడుతుందో గుర్తు పెట్టుకో అని యాగాగ్నిహోత్రం దగ్గర కూల దోసేశాడు. అక్కడితో ఆగలేదు. భ్రుగువు రెండు దవడలు నొక్కి పైవరుస దంతములు పట్టుకుని కుదిపేసి క్రింది వరుస దంతములు కుదిపేసి రెండు చేతులతో రెండు దవడలు పట్టుకుని లాగాడు. నోరు చిరిగిపోయింది
తరువాత పూషుడి దగ్గరకు వెళ్ళాడు. పూషా అనబడే సూర్యరూపమును పడగొట్టి ఆయన పళ్ళను పట్టుకుని నలిపేశాడు. పైవరస పళ్ళు, క్రింది వరుస పళ్ళు ఊడిపోతే వాటిని గాలిలోకి విసిరేసి ఇవాళ నుంచి నీవు మాట్లాడితే నీకు పళ్ళు లేవు కాబట్టి భాషయందు తప్పులు వస్తాయి. భాషయందు తప్పులు రావడం నీతోనే మొదలవుతుంది అని చెప్పాడు. ఆనాటి నుంచి పళ్ళు లేక పూష సరిగా మాట్లాడలేకపోయాడు. ఆనాటి నుండే భాషలో తప్పు రావడం అన్నది ప్రారంభం అయింది
వీరభద్రుడు వెనకనుంచి వెళ్ళి చంద్రుడిని పట్టుకుని క్రిందపడేసి తన రెండు కాళ్ళను పైకెత్తి చంద్రుడి కడుపు మీదకి ఒక గెంతు గెంతాడు. చంద్రుడికి ప్రక్కటెముకలన్నీ విరిగిపోయి, చంద్రుడి నోట్లోంచి అమృతధార పైకి లేచి, వీరభద్రుని పాదములను అభిషేకం చేసింది. అలా వీరభద్రుడు దేవతల వెంటబడి తన వేయి చేతులతో చావగొట్టాడు
చివరికి దక్షుడి మీదకు వెళ్ళి ఆయన మెడను నరకడానికి ప్రయత్నించాడు. దక్షుని మెడ తెగలేదు. దక్షుని శరీరం అంతా మంత్రపూరితం అయిపోయి ఉంది. అందుకని కంఠం తెగలేదు. తెగకపోతే గుండెల మీద తన కుడికాలి పాదంతో తొక్కి తలకాయను రెండు చేతులతోటి గడ్డిని మోపు కట్టినపుడు తిప్పినట్లుగా తిప్పేసి అది బాగా మెలిపడిపోయి సన్నగా అయిపోయిన తర్వాత ఊడబెరికి అగ్నిహోత్రంలో పడేశాడు. పిమ్మట రుద్రగణములను పిలిచి హోమగుండంలోనే కదా దేవతలు హవిస్సులు పుచ్చుకున్నారు. గుండంలో మూత్రమును విసర్జించండి అన్నాడు. వారందరూ హోమ గుండంలో మూత్రవిసర్జన చేశారు. అందరినీ కొట్టి ఉగ్రమూర్తియై వీరభద్రుడు నాట్యం చేస్తుంటే ఆపగలిగిన మొనగాడెవడు? మిగిలిన వాలు కొద్దిమంది ఉంటే వీళ్ళందరూ పరుగుపరుగున బ్రహ్మ సదనమునకు వెళ్ళారు. వీరభద్రుడు తన చేతిలో పట్టిసమును తీసుకు వెళ్ళి గోదావరి నదిలో కడిగి శాంతమూర్తి అయ్యాడు. ఎక్కడ తన చేతిలో ఉన్న పట్టిసమును వీరభద్రుడు కదిగాడో అదే పట్టిసతీర్థం. దక్షయజ్ఞం జరిగిన చోటు దక్షారామం. పరమ పుణ్య క్షేత్రం.
దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మ గారి దగ్గరకు వెళ్ళి మహానుభావా, ఏమిటి దీనికి పరిష్కారం? అని అడిగారు. అపుడు ఆయన మీరు చేసిన పాపం సామాన్యమయిన పాపం కాదు. ఆయన శర్వుడు, భవుడు, ఉగ్రుడు, భీముడు, రుద్రుడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు. ఎనిమిది రూపములతో ప్రకాశిస్తున్నవాడు పరమశివుడు. మీకొక మాట చెప్తున్నాను. శంకరుడు కరుణాపూరిత హృదయుడు. మనం బుద్ధి తెచ్చుకుని ఆయనకు నమస్కరించడానికి వెళితే ఆయన మిక్కిలి ప్రసన్నమూర్తిగా ఉంటాడు. రండి అని చెప్పి వీళ్ళందరినీ తీసుకుని కైలాసమునకు వెళ్ళాడు. అక్కడకు వెళ్ళేసరికి ప్రశాంత వదనంతో శంకరుడు పెద్ద వటవృక్షం క్రింద కూర్చుని తన ఎడమతొడ మీద కుడిపాదం పెట్టుకుని సనక సనందనాది మహర్షులందరూ తనచుట్టూ కూర్చుని ఉండగా, పరబ్రహ్మమునకు సంబంధించిన జ్ఞానమును చక్కగా చిన్ముద్రపట్టి తనలోతాను రమిస్తున్నవాడై సన్నటి చిరునవ్వు నవ్వుతూ, పరమానంద స్వరూపంగా వాళ్ళందరికీ జ్ఞానబోధ చేస్తున్నాడు
ఎక్కడ చూసినా కైలాస పర్వతం మీద లతావితానములు. పొదరిళ్ళు, ఋషులు, ప్రమథగణములు, నందీశ్వరుడు, గంటల చప్పుడు, వచ్చే విమానములు, వెళ్ళే విమానములు. అందరూ శంకరుడికి పరమభక్తితో నమస్కారములు చేస్తున్నారు. పరమభక్తితో అందరూ పంచాక్షరీ మహా మంత్రమును జపం చేసుకుంటూ ఉన్నారు. కైలాసపర్వతం పరమరమ్యంగా శోభాయమానంగా ఉంది. బుద్ధి తెచ్చుకున్న దేవతలు శంకరుడి దగ్గరకు వెళ్ళి నిలబడిస్వామీ మా బుద్ధి గడ్డి తినింది. ఈశ్వరా నీవు కాకపోతే మమ్మల్ని రక్షించే వారెవరు? కృపచేసి మమ్మల్ని కాపాడవలసిందిఅని ప్రార్థించారు. శంకరుడు వెంటనే చిరునవ్వు నవ్వి ఎవరెవరు దెబ్బలు తిని మరణించిన వారు ఉన్నారో వారందరూ పూర్వం ఎలా ఉన్నారో అంతే తేజస్సుతో సజీవులు అగుదురు గాక! ఆగిపోయిన యాగం యథారీతిగా సశాస్త్రీయంగా వేదం ఎలా చెప్పిందో అలా పూర్తిచేయబడుగాక! దక్షుడి తల అగ్నిహోత్రంలో కాలిపోయింది కాబట్టి మూర్ఖత్వమునకు పిరికితనమునకు ప్రతీక కనుక మేక ముఖమును తీసుకు వచ్చి దక్షుడి శిరస్సుకు అతికింపబడుగాక! దక్షుడు సజీవుడు అగుగాక! అతడు బుద్ధి తెచ్చుకుని సంతోషంగా జీవితమును గడుపుగాక! మీరందరూ పరమ సంతోషముతో ఆనందముగా ఉందురుగాక! అని చెప్పాడు. ఎక్కడా తన భార్య గురించి మాట్లాడలేదు. ఇదీ శంకరుడంటే. ఇపుడు దక్షుడు మేక ముఖం పెట్టుకుని శంకరుడి దగ్గరకు వచ్చి సాష్టాంగ పది ఏడుస్తూతండ్రీ దేవా అభవ పురహర రుద్రా, నీవు నన్ను దండించావని అనుకోవడం లేదు. నువ్వు ఎలా మస్తిష్కమును తీసి ఉండకపోతే నేను ఇంకా ఎన్ని పాపములు చేసి ఉండేవాడినో? పాపమును ఇక్కడితో తీసి వేశావు. ఇకపై బుద్ధి తెచ్చుకుని బ్రతుకుతాను. అన్నాడు. శంకరుడు చక్కగా వెళ్ళి యజ్ఞమును పూర్తిచెయ్యి అని ఆదేశించాడు
ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి యాగమును పూర్తిచేశారు. అప్పుడు బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఇటువంటి తప్పు పనులు ఎన్నడూ చేయవద్దు అని చెప్పారు. యాగం పూర్తి చేయబడింది
దక్షయజ్ఞం ధ్వంసం గూర్చి చదివినా, బుద్దిమంతులై శంకరుని కారుణ్యమును మనసులో అవధరించగలుగుతూ వినినా, అటువంటి వారికి జాతకములో ప్రమాదములు పొడచూపితే అవి తప్పి పోతాయి. ఆయుర్దాయం కలుగుతుంది. కీర్తి కలుగుతుంది. వాళ్ళు చేసిన పాపములు నశిస్తాయి. శంకరుడు దక్షిణామూర్తిగా ఉన్న కైలాస దర్శనం చెప్పబడింది కాబట్టి వాళ్ళ భవబంధములు తొలగి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇది అంత పరమపావనమయిన ఆఖ్యానము.

No comments:

Post a Comment