Search This Blog

Tuesday 20 March 2018

BRAHMA KAPALAM బ్రహ్మ కపాలం

!!బ్రహ్మ కపాలం"!!




"శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు.
నాలుగు ముఖాలతో మంత్రోఛ్ఛారణ చేస్తున్నాడు కానీ,
ఆయన ఊర్ధ్వ ముఖం పార్వతీదేవీ సౌందర్యానికి మోహపరవశమై చేష్టలుడిగి చూస్తుండిపోయింది.
ఇది గమనించిన పరమశివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుధ్ధి చెప్పాలని చేయిచాచి ఒక దెబ్బ వేశాడు.
మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా.!
దాని ప్రభావనికి బ్రహ్మ ఊర్ద్వముఖం తెగిపోయింది.
కానీ కిందపడలేదు, శివుడి అరచేతికి అతుక్కుపోయింది.
అది ఎంత విదిలించినా అది ఆయన చేతిని వదలలేదు.
క్రమక్రమంగా ఎండి,చివరికది
కపాలంగా మారిపోయింది.

బ్రహ్మ అపరాధం చేశాడు.దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది. అయితే , అది సరాసరి
బ్రహ్మ హత్యగా పరిణమించి, ఆ పాపం అంతటి మహాదేవుడుకీ అంటింది.
జగద్గురువు , మహాతపస్వి ఆయనకూ ఆ పాప ఫలం తప్పలేదు.
దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి, తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గమేమిటో సూచించమన్నాడు.

'దేవాదిదేవా ! పరమజ్ఞామివి.
నీకు తెలియని ధర్మం లేదు.
ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి .
శాసించగలవాడివి.
అయినా, మాపై క్రుపతో ఒక సలహా ఇవ్వమని కోరావు.
కనుక, మా జ్ఞాన పరిమితికి తోచింది చెబుతున్నాము…
ఈ కపాలాన్నే భిక్ష పాత్రగా భావించి ఇంటింటికీ తిరుగుతూ ప్రతిచోటా నీ పాపమేమిటో చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళూ కొంత కాలానికి ఆ పాపం తరిగిపోయు ఈ కపాలం రాలిపోవచ్చు అన్నారు దేవతలు.

పరమశివుడికి అది ఉచితమనిపించింది. భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ
మళ్ళీ తన వివాహం జరిగిన చోటుకే చేరాడు. హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశ్వరుడిగా అవతరించి ఉన్నాడు. అందుకే సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాల్లోని శిఖరాలను, నదులను ఆయనకు కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడి దగ్గరకు వచ్చి పరమశివా, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలున్నాయి కదా !
ఈ బదరీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా ? అని అడిగాడు.

నారాయణుడంతటివాడు అడిగితే తానెలా ఇవ్వకుండా ఉండగలడు.?
పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు.
అప్పటినుంచి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు.
ఆ తరువాత శివుడు ఆయన దగ్గరకే భిక్షకు బయలుదేరాడు.
ఈ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు.
'పరమశివుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు. వాస్తవంగా ఇది ఆయన ఇల్లు .
ఆయన తన ఇంటికే భిక్షకై వస్తున్నాడంటే - అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట . ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్దితంగా మార్చాలి. ఇది శివక్షేత్రం. ఇందులో నేను (విష్ణువును) ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు. ఈ కపాలం బ్రహ్మదేవుడి ఊర్ధ్వ ముఖానిది.
అంటే అది అధోలోకాలను, ఊర్ధ్వ లోకాలను అనుసంధానం చేసే ముఖం.
చిరకాల శివహస్త స్పర్శవల్ల దానిలోని దుర్భావనలన్నీ నశించిపోయాయి. ఇప్పుడది పరమ పవిత్రం.
దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి.
దానికితోడు నాశక్తి , శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి.'
అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. అంతే ! ఆ కపాలం కాస్తా ఊడి కిందపడి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది.

అప్పటి నుంచి బదరీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారియైన బ్రహ్మకపాలం మహాక్షేత్రమైంది.
తమ పిత్రుదేవతలను పునరావ్రుతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గమై నిలచింది.!!!……

"ఓం నమఃశ్శివాయ"!!

No comments:

Post a Comment